‘తప్పు చేస్తేనే క్షమాపణ చెబుతా’
సినీనటుడు కమల్ హాసన్..;
తమిళ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) తేల్చి చెప్పారు. తాను తప్పు చేస్తేనే క్షమాపణ చెబుతానని కుండబద్దలు కొట్టారు. ఇటీవల ఆయన నటించిన ‘థగ్ లైప్’ (Thug Life) మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ‘కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది’ అని అన్నారు. ఆ ఒక్క మాట రెండు రాష్ట్రాల మధ్య పెద్ద వివాదానికి దారితీసింది. కన్నడనాట భాషాభిమానుల హృదయాలను గాయపర్చింది. కన్నడ భాష గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని కన్నడ భాషా సంఘాలు పట్టుబట్టాయి. ఆయన పోస్టర్లను తగులపెట్టి నిరసన వ్యక్తం చేశారు. కమల్పై వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
'ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది'
"నాకు గతంలో బెదిరింపులు వచ్చాయి. కానీ ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది. కర్ణాటక, ఆంధ్ర (ప్రదేశ్), కేరళ ప్రజల పట్ల నాకున్న ప్రేమ నిజం. ఒక ఎజెండాతో ఉన్నవారు మాత్రమే మరోలా అనుమానిస్తారు" అని పేర్కొన్నారు. "ఇది ప్రజాస్వామ్యం. చట్టం, న్యాయంపై నమ్మకమున్న వ్యక్తిని" అని కూడా అన్నారు.
'థగ్ లైఫ్' విడుదలకు ఒప్పుకుంటారా?
ఈ వివాదం నేపథ్యంలో మే 30లోగా నటుడు కమల్ హాసన్ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కర్ణాటకలో 'థగ్ లైఫ్' సినిమా విడుదలకు అనుమతించమని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) గురువారం తెలిపింది.
‘కమల్తో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాం’
నిన్న సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రముఖులతో మాట్లాడిన తర్వాత కేఎఫ్సీసీ అధ్యక్షుడు ఎం. నరసింహలు విలేఖరులతో మాట్లాడారు. "కమల్ సినిమాను నిషేధించాలని చాలా కన్నడ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మేం ఆ విషయంపై చర్చించాం. ఆయన చేసింది తప్పు అని మేమంతా భావిస్తున్నాం. కమల్తో కలిసి మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాం, " అని నరసింహలు అన్నారు.
పెద్దల సభకు కమల్..
సినీనటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన కమల్ గురించి కూడా కొంత చెప్పుకోవాలి. ఆయన తమిళనాట(Tamil Nadu) ‘మక్కల్ నీది మలమ్’ పేరిట పార్టీ స్థాపించారు. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. డీఎంకే తరుపున ప్రచారం చేశారు. దాంతో ఆ పార్టీ అద్భుత విజయం సాధించింది. తమిళనాడులోని మొత్తం 39 స్థానాలను, పుదుచ్చేరిలోని ఏకైక స్థానాన్ని క్లీన్ స్వీప్ చేసింది. అందుకు ప్రతిఫలంగా 2025లో ఎంఎన్ఎమ్కు రాజ్యసభ (Rajya Sabha) సీటు ఇస్తామని కమల్కు డీఎంకే హామీ ఇచ్చింది. ఆ మేరకు ఆయన పేరును కూడా ఇటీవల ప్రకటించారు సీఎం స్టాలిన్. ఈ సందర్భంగా తమిళనాడు ప్రజల గళాన్ని పార్లమెంటులో గళాన్ని వినిపిస్తానని కమల్ పేర్కొన్నారు.