కర్ణాటకలో కమల్ నటించిన ‘థగ్‌ లైఫ్‌’ రిలీజ్ అవుతుందా?

మూవీ ఈవెంట్‌లో కన్నడ భాష గురించి సినీనటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై వివాదం నడుస్తోంది.;

Update: 2025-05-29 08:24 GMT
Click the Play button to listen to article

సినీనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) వ్యాఖ్యలు కర్ణాటకలో దుమారం రేపుతున్నాయి. ‘థగ్‌ లైఫ్‌’ మూవీ ఈవెంట్‌లో కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని కమల్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక(Karnataka)లోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలకు దారితీశాయి. తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పకపోతే కమల్‌తో పాటు ఆయన చిత్రాలపై నిషేధం విధిస్తామని కర్ణాటక సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ తంగడగి హెచ్చరించారు.

"కమల్ క్షమాపణ చెప్పాలి. లేకుంటే కర్ణాటకలో ఆయనతో పాటుగా ఆయన సినిమాలపై కూడా నిషేధం విధించాలని మేం కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను కోరతాం," అని కర్ణాటక సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ తంగడగి పేర్కొన్నారు. కన్నడీగుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడి ఆ తర్వాత క్షమాపణ చెప్పిన గాయకుడు సోను నిగమ్ విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. కన్నడ చిత్ర పరిశ్రమలోని అన్ని వర్గాలతో సమావేశమై కమల్ హాసన్‌పై నిషేధం విధించే అవకాశం ఉందని కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎం. నరసింహలు పేర్కొ్న్నారు.

ఈ వివాదం నేపథ్యంలో మణిరత్నం దర్శకత్వం వహించిన ‘థగ్‌ లైఫ్‌’ రిలీజ్ అవుతుందా? అన్న సందేహం వ్యక్తమవుతోంది.

నిరసన ప్రదర్శనలు..

కమల్ వ్యాఖ్యలతో కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. కన్నడ భాషాభిమానులు, భాషా సంఘాలు బెళగావి, మైసూరు, హుబ్బళ్లి, బెంగళూరులో నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. కన్నడ భాషకు వేల ఏళ్ల చరిత్ర ఉందని వివరిస్తూ బెళగావి, మరికొన్ని చోట్ల కమల్ పోస్టర్లను తగలబెట్టారు. ఆయన వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక కమల్ వ్యాఖ్యలపై కర్ణాటక రక్షణ వేదిక సంస్థ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కాంగ్రెస్, బీజేపీ ధ్వజం..

కమల్ హాసన్‌కు కన్నడ భాషా సుదీర్ఘ చరిత్ర తెలియదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. మాతృభాషను ప్రేమించడం మంచిదే. కానీ.. ఇతర భాషలను అవమానించడం సరైన పద్ధతి కాదంటూ ఆయన హితవు పలికారు. కన్నడిగుల ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు నటుడు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ బి.వై. విజయేంద్ర డిమాండ్ చేశారు.

కన్నడీగులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కమల్ స్పందించారు. తాను ప్రేమతో ఆ వ్యాఖ్యలు చేశానని, ప్రేమ ఎన్నడూ క్షమాపణ కోరదన్నారు. భాషా చరిత్ర గురించి ఎంతో మంది చరిత్రకారులు తనకు చెప్పారని, తన వ్యాఖ్యల్లో మరో ఉద్దేశం లేదన్నారు. అయితే భాష గురించి మాట్లాడే అర్హత రాజకీయ నాయకులకు లేదని, ఇది తనకు కూడా వర్తిస్తుందన్నారు.

‘‘ఎంతోమంది చరిత్రకారులు భాషా చరిత్ర గురించి నాకు నేర్పించారు. తమిళనాడు(Tamil Nadu) అరుదైన రాష్ట్రం. ఓ ‘మేనన్‌’ (ఎంజీ రామచంద్రన్‌) ముఖ్యమంత్రిగా చేశారు. ఓ ‘రెడ్డి’ (ఒమందూర్‌ రామసామి రెడ్డియార్‌) సీఎం అయ్యారు. మైసూర్‌ సంస్థానంలో పనిచేసిన నరసింహన్‌ రంగచారి మనవరాలు (జయలలితను ఉద్దేశిస్తూ) కూడా ముఖ్యమంత్రి అయ్యారు. రాజకీయ నాయకులకు భాష గురించి మాట్లాడే అర్హత లేదు. నాతో సహా దానిపై మాట్లాడే అర్హత వారికి లేదు. దీనిపై లోతైన చర్చను చరిత్రకారులకు, పురావస్తు శాస్త్రవేత్తలు, భాషా నిపుణులకు వదిలేద్దాం’’ అని కమల్‌ పేర్కొన్నారు. 

Tags:    

Similar News