అసలేమిటీ ఢిల్లీ లిక్కర్ స్కాం?

ఢిల్లీ ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూర్చాలన్న ఉద్దేశంతో కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం పాలసీ వివాదాస్పదమైంది. ప్రముఖుల అరెస్ట్ కి దారితీస్తోంది

Update: 2024-03-16 05:10 GMT
liquer

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఢిల్లీకి తరలించారు. ఢిల్లీ సీఎం సహా అనేక మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా జైల్లో మగ్గుతున్నారు. ఈనేపథ్యంలో కవిత అరెస్ట్ అయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా అలజడి మొదలైంది. అసలింతకీ ఈ లిక్కర్‌ స్కాం ఏమిటీ, దాని పూర్వపరాలు ఏమిటీ..

2021లో ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. గతంలో ఢిల్లీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేసిందని, దాన్ని సమూలంగా మార్చాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకునుగుణంగా కొత్త లిక్కర్‌ పాలసీ తీసుకొచ్చింది. ఈ కొత్త లిక్కర్‌ పాలసీ కాస్త స్కాం వైపుకు దారి తీసిందనే ఆరోపణల నేపథ్యంలో పలువురు రాజకీయ నేతలు అరెస్ట్‌ అయ్యారు. తాజాగా కవితను అరెస్ట్‌ చేసింది ఈడీ. .

లిక్కర్‌ స్కాంలో కథ ఎప్పుడు మొదలైంది?

ఢిల్లీలో ఉన్న మద్యం దుకాణాలకు సంబంధించి ముందుగా ఒక నిపుణుల కమిటి వేసింది ఢిల్లీ ప్రభుత్వం. ఎక్సైజ్ కమిషనర్ ఆధ్వర్యంలో ముగ్గుర్ని ఈ కమిటిలో వేసింది. ఎక్స్‌పర్ట్‌ కమిటి సిఫార్సులపై మళ్లీ ముగ్గురు మంత్రులతో కమిటీని ఢిల్లీ ప్రభుత్వం నియమించింది. చాలా కాలంగా ప్రభుత్వ హయాంలో ఉన్న రిటైల్ మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలన్నది ప్రతిపాదన. ఫిబ్రవరి 2021లో మంత్రులతో కమిటీ వేసింది. నెల రోజుల్లో రిపోర్టు ఇచ్చింది మంత్రుల కమిటీ. 2021 మార్చిలో మంత్రుల కమిటి సిఫార్సును ఢిల్లీ క్యాబినెట్‌ ఓకే చేసింది. ఢిల్లీలో మద్యం అమ్మకాలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ప్రభుత్వ కమిటీ సిఫార్సు చేసింది. ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులు కేటాయించడం ద్వారా ప్రభుత్వ ఆదాయం రూ.9500 కోట్లు పెరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ క్యాబినెట్ ఓకే చేసిన కొత్త లిక్కర్ పాలసీని ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ కి ప్రభుత్వం పంపింది. దాదాపు నాలుగు నెలలు పెండింగ్ తరువాత 2021 నవంబర్‌లో కొత్త పాలసీకి ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ ఓకే చెప్పారు. అయితే కొత్తగా ఏర్పాటు చేయబోయే మద్యం దుకాణాలకు ఢిల్లీ డెవలప్‌మెంట్ అధారిటీతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అనుమతి తప్పనిసరి అని లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ మెలిక పెట్టారు. కొత్త ఎక్సైజ్ పాలసీకి అనుగుణంగా ఢిల్లీలో 849 మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ధరల విషయంలో ప్రైవేటు వ్యాపారులు స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం ఉంది. తెల్లవారుజామున 3గంటల వరకు షాపులు తెరిచి ఉంచేందుకు వీలు కల్పించిన లిక్కర్ పాలసీ హోమ్ డెలివరీ చేసేందుకు అవకాశం కల్పించింది. ఈనేపథ్యంలో 2022 ఏప్రిల్ లో కొత్త చీఫ్ సెక్రెటరీ నరేష్ కుమార్ వచ్చారు. ఆయన రాకతో స్కాం వెలుగులోకి వచ్చింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలోనే అవకతవకలు జరిగాయని... మద్యం దుకాణాల కేటాయింపులోనూ తప్పులు జరిగినట్లు గుర్తించిన చీఫ్ సెక్రెటరీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ కునివేదిక ఇచ్చారు. కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు లబ్ది చేకూరేలా విధానపరమైన మార్పులు చేసినట్లు డిల్లీ సీఎస్ నివేదిక రూపొందించారు. ఢిల్లీ చీఫ్ సెక్రెటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా లెఫ్టనెంట్ గవర్నర్‌ అదే ఏడాది జూలైలో సీబీఐ విచారణకు ఆదేశించారు.

ఓ వైపు చీఫ్ సెక్రెటరీ నివేదిక రూపొందిస్తున్న సమయంలోనే లిక్కర్ పాలసీని రద్దుచేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించడం వివాదమైంది. తాము ఆశించిన స్థాయిలో ప్రభుత్వ ఆదాయం పెరగడం లేదని అందుకే కొత్త పాలసీని రద్దు చేస్తున్నామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. తొలి త్రైమాసికానికి బడ్జెట్ అంచనాల కన్నా దాదాపు 35శాతం తక్కువ ఆదాయం వచ్చినట్లు అసెంబ్లీలో చెప్పింది.

ఇవీ ఆరోపణలు...

మద్యం దుకాణాల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయి. మద్యం దుకాణాల కేటాయింపులో నిబంధనలకు విరుద్ధంగా గుత్తాధిపత్యం కనిపించింది. మద్యం పాలసీలో మార్పులు చేస్తూ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా ప్రభుత్వానికి 145కోట్ల రూపాయల నష్టం చేశారు. మద్యం వ్యాపారులు ప్రభుత్వానికి కట్టాల్సిన రూ.145 కోట్ల రూపాయలను కోవిడ్ పేరుతో ఏకపక్షంగా ప్రభుత్వం మాఫీ చేసింది. ప్రతీ బీర్ కేస్‌కు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంపోర్ట్ డ్యూటీని ప్రభుత్వం మాపీ చేసింది. ఎల్‌-1 కేటగిరి లైసెన్సుల జారీలో లంచాలు తీసుకుని పర్మిషన్‌లు ఇచ్చారు అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదికపై సీబీఐ కేసు నమోదు చేసింది. విచారణ చేపట్టింది. అప్పటి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా కంపెనీకి ఒక మద్యం వ్యాపారి కోటి రూపాయలు తరలించినట్లు గుర్తించిన సీబీఐ ఆయన్ను అరెస్ట్ చేసింది. రిటైల్ వెండర్లకు క్రెడిట్ నోట్లు జారీచేయడం ద్వారా లంచాలు ఇచ్చినట్లు గుర్తించిన సీబీఐ... మనిష్ సిసోడియా అనుచరులు దినేష్ అరోరా, అమిత్ అరోరా, అర్జున్ పాండే ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించినట్లు ఆరోపించింది. ఆ తరువాత వరుస దర్యాప్తులో భాగంగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఆయన కుమారుడు, బీఆర్ఎస్ అధినేత కుమార్తె కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత, మరికొందరు ఉన్నట్టు గుర్తించి సీబీఐ విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు కవితను అరెస్ట్ చేసింది.


Tags:    

Similar News