డార్క్ ఫ్యాక్టరీలు -కార్మికులపై కొత్త అస్త్రం

నో లైట్స్ ,నో వర్కర్స్ దిశగా కార్మిక విప్లవ దేశాలు;

Update: 2025-05-01 11:00 GMT

    భారత దేశంలో , తెలంగాణ లో కార్మిక సంఘాల నిర్మాణం బలహీన పడి ఉండవచ్చు, సంఘాల సభ్యత్వం గణనీయంగా పడిపోయి ఉండవచ్చు. చాలా కార్మిక సంఘాల నాయకత్వం పోరాట స్వభావాన్ని కోల్పోయి, పూర్తి స్థాయి పైరవీ కారులుగా మారిపోయి, యాజమాన్యాలతో, రాజీ ధోరణితో వ్యహరించే స్వభావాన్ని సంతరించుకుని ఉండవచ్చు. మేడే స్పూర్తిని కోల్పోయి, కార్మికులు, ఉద్యోగులు కూడా మేడే ను కేవలం ఒక సాధారణ పండగలా, ఒక సెలవు దినంలా భావించే మానసిక స్థితికి చేరి ఉండవచ్చు.

    కానీ, మే 1 న ప్రపంచవ్యాపితంగానూ, దేశ వ్యాపితం గానూ, తెలంగాణ రాష్ట్రం లోనూ, తమ కార్యాలయల ముందు, కంపనీల ముందు, నాలుగు రోడ్ల కూడళ్ల లోనూ, యూనియన్ జండా ఎగరేసి, మేడే కార్యక్రమం జరుపు కోవడం శ్రామిక వర్గం, ముఖ్యంగా నగరాల కార్మిక వర్గం ఇప్పటికీ ఒక ఆనవాయితీగా కొనసాగిస్తున్నది. 139 సంవత్సరాలు గడిచినా, కార్మిక వర్గంలో పూర్తిగా చచ్చి పోని మేడే స్పూర్తికి ఇదే నిదర్శనం.

శ్రామిక చరిత్ర మాయమైపోతున్న వైనం : 

కార్మికులకు, మొత్తంగా శ్రామిక వర్గానికి మేడే పోరాట చరిత్రను చెప్పే వాళ్ళే లేకుండా తగ్గి పోయినప్పుడు, నూతన తరం కార్మికులకు, ముఖ్యంగా పర్మినెంటు కాకుండానే దశాబ్ధాల పాటు, పని చేసి రిటైర్ అయ్యే లక్షలాది మంది కాంట్రాక్టు, క్యాజువల్, అవుట్ సోర్స్ కార్మికులకు , లేదా, 8 గంటల పని దినం చట్టం ఇప్పటికీ అమలు లో ఉందని తెలిసి కూడా, రోజూ 12 గంటల పాటు, పని చేసే కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులకు, యాప్ ఆధారితంగా పని చేసే నగరాల నయా కార్మికులకు/బానిసలకు నిజమైన మేడే స్పూర్తితో మేడే కార్యక్రమం జరుపుకోవాలని అనిపించే ఆస్కారమే లేదు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలలో పని చేసే తెల్ల చొక్కా ఉద్యోగులు, రావి శాస్త్రి చెప్పినట్లు, పూర్తిగా వేతన శర్మ లుగా మారిపోయాక, 8 గంటల పని దినాన్ని హక్కుగా అనుభవించడం మాత్రమే జ్ఞాపకం ఉంచుకుని, మిగిలిన హక్కుల సాధనా పోరాటాలన్నిటినీ మర్చిపోయి, అవకాశవాదంతో వ్యవహరించడం మొదలెట్టాక, మేడే మరింత పల్చ బడిపోయింది .

 

దారి తప్పిన మేడే : 

“ పోరాడే వాడిదే ఎర్రజండా”, “ప్రపంచ కార్మికులారా ఏకం కండి “, “ పోరాడితే మనం పోగొట్టుకునేదేమీ లేదు, బానిస సంకెళ్లను తప్ప “ లాంటి నినాదాలను మర్చిపోయి, కార్మిక వర్గాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చి, కుల మతాల పేరుతో విభజించి, వర్గ పోరాట స్పృహను కోల్పోయిన రాజకీయ పార్టీలు, వాటి నాయకత్వాలు కార్మిక వర్గంలో ఈ ధోరణులు బలపడడానికి ప్రధాన కారణమయ్యాయి. కేవలం ఆర్ధిక పోరాటాలతో, కార్మిక వర్గానికి వర్గ పోరాట రాజకీయాలు పూర్తిగా అర్థం కావనీ, ఆర్ధిక పోరాటాల చైతన్యాన్ని దాటి , కార్మికులకు రాజకీయ స్పృహను అందించడానికి ఆయా సంఘాలు ప్రత్యేక కృషి కొనసాగించాల్సి ఉంటుందన్న రష్యన్ విప్లవ నిర్మాత, మార్క్సిస్టు మహోపాధ్యాయుడు లెనిన్ మాటలను , “కూలీ రేట్లు పెరగాలి” అన్న బ్యానర్ వెనకే, “కూలీ వ్యవస్థ కూడా నశించాలి “ అనే మాటలను మొదటి నుండీ రాయాలని కారల్ మార్క్స్ అంతకు ముందే చెప్పిన విషయాలను జ్ఞాపకం తెచ్చుకుంటే , మనం ఎక్కడ దారి తప్పామో గుర్తించవచ్చు.

పదహారవ శతాబ్దం నుండి నేటి వరకూ : 

16 వ శతాబ్ధంలో ఇంగ్లాండ్ తో మొదలెట్టి, పారిశ్రామిక విప్లవాలు ప్రారంభమై యాంత్రీకరణతో, శ్రామికుల చమటనూ , రక్తాన్నీ తాగే యాజమాన్యాలు, తమ వర్గ స్వభావాన్ని ఎప్పుడూ మార్చుకోలేదు. తమ దోపిడీ పీడనలను తగ్గించుకోలేదు. యంత్రాల రూపాలు మారి ఉండవచ్చు. అదనపు విలువను కొల్లగొట్టే రూపాలు మారి ఉండవచ్చు.

తమ కష్టాలకు యంత్రాలే కారణమని కార్మికులే వాటిని విధ్వంసం చేస్తూ, యూరప్ లో సాగిన లుడైట్ ఉద్యమాల కాలం నుండీ, మరిన్ని అదనపు లాభాల కోసం , ఇటీవల లైట్లూ, కార్మికులూ లేని డార్క్ ఫ్యాక్టరీలు చైనా లో ఉనికి లోకి వచ్చే వరకూ గత 400 సంవత్సరాలలో జరిగిన ప్రయాణం, రష్యా ,చైనా, తూర్పు యూరప్ లలో జరిగిన విప్లవోద్యమాలలో కార్మిక వర్గం పాల్గొన్న తీరు నుండీ, అవి సాధించిన విజయాల నుండీ, ప్రపంచ పారిశ్రామిక వర్గం, దోపిడీ వర్గ స్వభావం కలిగిన ప్రభుత్వాలు ఎన్నో విషయాలు నేర్చుకున్నాయి. అన్ని దేశాల లోనూ పెల్లుబుకుతున్న కార్మిక వర్గ పోరాటాలను అణచి వేయడానికి నిర్బంధం ఒక్కటే సరిపోదనీ, ఆయా వర్గాల సమస్యలను కొంతైనా పరిష్కరించడానికి, అంతర్జాతీయ స్థాయిలో లేబర్ ఆర్గనైజేషన్( ILO) ఏర్పాటు కూడా అవసరమని గుర్తించాయి. సమాజంలో పేదల కోసం కొన్ని సంక్షేమ పథకాలు, కార్మికులకు కనీస వేతనాలు, ఇతర హక్కుల కల్పన , కార్మికులకు సాంఘిక బద్రత గ్యారంటీ లాంటివి ఉనికిలోకి రావడానికి ఈ ఉద్యమాలు, విప్లవాలే ప్రధాన కారణం. ఈ చర్యలు కార్మికుల, ఉద్యోగుల జీవన ప్రమాణాలను ఒక మేరకు పెంచినా, ఒక మేరకు ఉద్యోగ బధ్రత కల్పించినా, కార్మికులపై శ్రమ దోపిడీ మాత్రం తగ్గలేదు. అదే సమయంలో విప్లవాల కారణంగా, వివిధ దేశాలలో ఏర్పడిన కార్మిక వర్గ ప్రభుత్వాలు చేసిన రాజకీయ తప్పులు, ప్రజల ప్రజాస్వామిక హక్కుల అణచివేతలు, తిరిగి ఆయా దేశాలలో పెట్టుబడిదారీ సమాజ పునరుద్ధరణకు కారణమయ్యాయి. దెబ్బ తిన్న పెట్టుబడి దారీ పులి మళ్ళీ కోలుకుని, ప్రజలను లాభాల కోసం వేటాడడం మళ్ళీ మొదలైంది. కార్మికుల హక్కులను కాలరాయడం కూడా మొదలైంది.

1848 ఫిబ్రవరి లో వెలువడిన కమ్యూనిస్టు మానిఫెస్టో, అది అందించిన మార్గదర్శనం, ఫ్రాన్స్ లో కార్మిక వర్గ తిరుగుబాటుతో 1871 మార్చ్ లో ఏర్పడిన పారిస్ కమ్యూన్, ప్రపంచానికి అది అందించిన స్పూర్తి , 1886 మే లో అమెరికా దేశ చికాగో నగరంలో 8 గంటల పని దినం కోసం మొదలైన పోరాటాలు, సమ్మెలు, ఈ సందర్భంగా కార్మికులు చేసిన త్యాగాలు, నలుగురు నాయకుల ఉరితీతలు, ఆ తరువాత ప్రపంచ వ్యాపితంగా ముందుకు వచ్చిన కార్మికుల పోరాటాలు, ముఖ్యంగా 1917 నవంబర్ రష్యన్ విప్లవం , 1949 అక్టోబర్ చైనా విప్లవం, 1960 దశకంలో సాగిన వియత్నాం , క్యూబా విప్లవాలు, శ్రామిక వర్గానికి కూడా అనేక విషయాలు బోధించాయి . మనం వాటి నుండీ ఏమైనా నేర్చుకున్నామా లేదా అన్నది ప్రధాన ప్రశ్న. మనం ఏమీ నేర్చుకోలేదని, మన ఆచరణ రుజువు చేస్తున్నది.

కార్మికులపై పెరిగిన భారం : 

భారత దేశంలో గత ముప్పై ఏళ్ల ప్రపంచీకరణ , ఆ వెలుగులో 1991 నుండీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన ఆర్ధిక, పారిశ్రామిక విధానాలు, దేశంలో తీవ్రమైన ఆర్ధిక అసమానతలను పెంచాయి. కార్మికుల పై పని భారాన్ని పెంచాయి. పని గంటలను పెంచేశాయి . కార్మికులకు యూనియన్ పెట్టుకునే హక్కును యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. PF, ESI, పెన్షన్ , గ్రాట్యుటీ లాంటి సాంఘిక బధ్రతా పథకాలు ఎక్కడా అమలు కావడం లేదు కనీస వేతనాలు అమలు చేయడం లేదు. వారాంతపు సెలవులు, ఇతర సెలవులు లేకుండా కార్మికులను దోచుకుంటున్నాయి.

మరీ ముఖ్యంగా . ఆదర్శ యాజమాన్యాలుగా ఉండాల్సిన ప్రభుత్వ రంగ సంస్థలు కూడా, ప్రైవేట్ యాజమాన్యాల లాగే కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయి. పర్మినెంటు స్వభావం కలిగిన పనులలో కూడా కాంట్రాక్టు, క్యాజువల్ కార్మికులను నియమించుకున్నాయి. పైగా ఆయా కార్యాలయాలలో పనులను అవుట్ సోర్సింగ్ చేస్తున్నాయి. తాజాగా మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్న అన్ని కార్మిక చట్టాలను రద్ధు చేస్తూ, 4 లేబర్ కోడ్ లను తీసుకు వచ్చింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆయా లేబర్ కోడ్ లలో ఉన్న అంశాలకు అనుగుణంగా రాష్ట్రాల స్థాయిలో నోటిఫికేషన్ లు జారీ చేస్తున్నాయి. రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట ఈ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. ఇతర రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న చోట, ఈ నోటిఫికేషన్ లు ఇంకా విడుదల చేయనప్పటికీ, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా, అసంఘటిత కార్మికులను, కాంట్రాక్టు ఉద్యోగులను దోచుకోవడంలో యాజమాన్యాల పక్షమే వహిస్తున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తెలంగాణ కూడా ఇందుకు మినహాయింపుగా లేదు. ప్రభుత్వ రంగంలో ప్రధాన రంగాలుగా ఉన్న సింగరేణి లో 35 వేల మందికి పైగా ఉన్న కాంట్రాక్టు కార్మికులను, ఉద్యోగులను పర్మినెంట్ చేయడానికి గత ప్రభుత్వం లాగే, ఈ ప్రభుత్వం కూడా ఏమీ చర్యలు చేపట్టడం లేదు. ఆర్టీసీ లో యూనియన్ లను గుర్తిస్తామని ఇచ్చిన హామీని కూడా ఇప్పటికీ, నెరవేర్చలేదు.అనేక ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయడానికి పూనుకోవడం లేదు. వారికి కనీసం సమాన పనికి సమాన వేతనం కూడా చెల్లించడం లేదు.

ఈ రోజు ఉదయం ఉస్మానియా యూనివర్సిటీ లో పని చేస్తున్న స్కావెంజర్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన మేడే కార్యక్రమానికి హాజరయినప్పుడు , ఆ కార్మికులు చెప్పిన విషయాలు అత్యంత బాధాకరంగా ఉన్నాయి. ఆ కార్మికులకు కేవలం 11,300 రూపాయల వేతనం మాత్రమే ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మొదటి PRC సిఫార్సు ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలలో పని చేసే వారికి కనీస వేత్తనంగా 19,000 రూపాయలు చెల్లించాలి.

కానీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఒక ప్రభుత్వ రంగ సంస్థ అయినా, సంవత్సరాలుగా పని చేస్తున్న ఈ కార్మికులను పర్మినెంటు చేయలేదు. వారికి కనీస వేతనం చెల్లించడం లేదు. వారు చేస్తున్న పని స్వభావాన్ని బట్టి ( హాస్టల్స్ లో, కాలేజీలలో , యూనివర్సిటీ కార్యాలయాలలో బాత్రూమ్ లు, లెట్రిన్ లు క్లీన్ చేయడం –ముఖ్యంగా ప్రమాదకరమైన యాసిడ్ ఉపయోగిస్తారు కనుక) ) , వారి చేతులకు గ్లోవ్స్ ఇవ్వాలి, ముఖానికి మాస్క్ ఇవ్వాలి. కళ్ళకు కళ్ల జోడు ఇవ్వాలి. కానీ కనీసం వాటిని కూడా యూనివర్సిటీ కార్మికులకు సమకూర్చడం లేదు. ఇదే యూనివర్సిటీ లో మెస్ లలో పని చేసే కాంట్రాక్టు కార్మికుల పని పరిస్థితులు కూడా భిన్నంగా లేవు.

రాష్ట్రంలో అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డు ను ఇప్పటివరకూ నియమించలేదు. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని అభయ హస్తం మానిఫెస్టో లో చెప్పినప్పటికీ , ఇప్పటి వరకూ అ వైపు అడుగులు పడలేదు. లక్షలాది మంది కార్మికుల సంక్షేమం కోసం పని చేయాల్సిన కార్మిక శాఖను బలోపేతం చేయడానికి ఏ ప్రభుత్వమూ గత 11 సంవత్సరాలలో ఏ ప్రయత్నమూ చేయలేదు. లేబర్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు రాష్ట్రంలో అతి తక్కువమంది ఉన్నారు. జిల్లా స్థాయిలో ఉండాల్సిన డిప్యూటీ లేబర్ కమిషనర్ లు కూడా అన్ని జిల్లాలలో లేరు.

అన్నిటి కన్నా ఘోరమైన పరిస్థితి దుకాణాలలో, మాల్స్ లో పని చేసే కార్మికులకు కూర్చోవడానికి కుర్చీ కూడా ఉంచకుండా తీసేయడం. ఇతర కార్మిక హక్కులను ఎలాగూ అమలు చేయడం లేదు. కానీ కనీసం వారిని మనుషులుగా కూడా చూడడం లేదని, ఆయా దుకాణాల యాజమాన్యాలు మానవత్వం మరిచిపోయి వివాహరిస్తున్నాయని అర్థమవుతుంది. పని చేసే స్థలంలో కార్మికులకు కుర్చీ ఇవ్వాలని, కేరళ, తమిళ నాడు లాంటి రాష్ట్రాలు కొత్తగా చట్ట సవరణ చేయాల్సి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకూ అలాంటి ప్రయత్నం కూడా చేయలేదు.

నగరాలలో పెద్ద ఎత్తున అపార్ట్ మెంట్ లు వెలుస్తున్నాయి. ఈ అపార్ట్మెంట్ లలో బధ్రత కోసం వాచ్ మెన్ ల కుటుంబాల కోసం రూమ్ లు కూడా నిర్మిస్తున్నారు. కానీ ఇక్కడ నిర్మించే ఈ రూమ్ లు మధ్యతరగతి , ధనిక వర్గాల ప్రజల అనాగరిక మనస్తత్వానికి అడ్డం పడతాయి. సాధారణంగా అతి తక్కువ వైశాల్యం ఉండే చిన్న గది మాత్రమే నిర్మిస్తున్నారు. కొన్ని చోట్ల శ్లాబ్ కూడా కాకుండా , ఇనుప రేకులతో ఒక గదిని వేస్తున్నారు. వాచ్ మెన్ తన కుటుంబంతో ఉండడానికి సరిపోయే రూమ్ లు కావివి. వాళ్ళు అదే రూమ్ లో వంట , బాత్ రూమ్ , మంచం, అన్నీ సర్దుకోవాల్సిందే. పిల్లలు ఉన్న చోట, ముఖ్యంగా టీనేజ్ లో ఉన్న పిల్లలు ఉన్న చోట, ఆ వాచ్ మెన్ దంపతుల ఘోష వర్ణానాతీతం.

ఇవేవీ ఆ అపార్ట్ మెంట్ “నాగరిక” కుటుంబాలు పట్టించుకోవు. కార్మిక శాఖ వీళ్ళ పై అసలు దృష్టి సారించదు. GHMC లాంటి సంస్థలు, ఇంకుడు గుంతల అవసరం గురించి మాట్లాడతాయి కానీ, కొత్త భవనాలకు అనుమతులు మంజూరు చేసేటప్పుడు, కనీసం వాచ్ మెన్ రూమ్ లు ఎంత విస్తీర్ణం లో ఉండాలో మార్గ దర్శకాలు కూడా జారీ చెయ్యవు. ఇవి మనుషులను మనుషులుగా చూడని ఈ సంస్థల, మనుషుల ధోరణికి అద్దం పట్టే ఉదాహరణలు. ఇంకా ఇలాంటి వారికి కార్మిక చట్టాల అమలు గురించి చెప్పినా అర్థం అవుతుందా ?

అందుకే మనం మొదట మనుషులుగా ఆలోచించాలి. ఆ తరువాత మిగిలిన విషయాలు మాట్లాడాలి. మేడే సందర్భంగా ఈ విషయాలను ప్రధానంగా ప్రస్తావించాల్సి రావడమే అసలైన విషాదం.

-------------------

Similar News