గత ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకుంటాం : సీఎం రేవంత్ రెడ్డి

గత పాలకుల అవినీతి వేలకోట్ల రూపాయలకు చేరిందని, దీనిపై రాజ్యాంగబద్ధంగా విజిలెన్స్, జుడిషీయల్ విచారణకు ఆదేశించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

Update: 2024-03-17 09:36 GMT
CM Revanth Reddy

గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై పారదర్శక విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి  చెప్పారు. మీట్ ది మీడియా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి విలేఖరుల అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.‘‘ప్రభుత్వ జీఓలను దాచిపెట్టం అన్నీ బయటపెడతాం, ఏ జీఓ అయినా దాచిపెట్టే, మూసి పెట్టే జీఓలను తీయం, త్వరలోనే సమాచార హక్కు చట్టం సభ్యులను కూడా నియమిస్తాం. పారదర్శక పాలన తెలంగాణ ప్రజల పట్ల నిబద్ధత ఉందని సీఎం చెప్పారు. కారు షెడ్డుకు పోయింది, వారు ఇంటికి పోయారు’’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

సామాజిక తెలంగాణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, తన పేషీతోపాటు ప్రతి విభాగంలోనూ సామాజిక సమతుల్యతను పాటిస్తున్నానని సీఎం చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చిన వాటిని తీసుకోవద్దు. సామాజిక న్యాయం కాంగ్రెస్ ఆలోచన అని చెప్పారు. మమ్మల్ని ఎవరూ వేలెత్తి చూపే పరిస్థితే రాదని సీఎం స్పష్టం చేశారు. ధరణిని సీజీజీకి అప్పగించాం, భూములపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించి చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు.

వైబ్రెంట్ తెలంగాణ 2050
అన్ని పాలసీలను రూపొందించి వైబ్రెంట్ తెలంగాణ 2050 పేరిట ప్రణాళిక రూపొందిస్తున్నామని రేవంత్ చెప్పారు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సహా తెలంగాణను అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారు. ‘‘9 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలపై భారం ఉంది సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి 6 వేల కోట్లరూపాయలు, దాన్ని కేసీఆర్ 64 వేల కోట్ల రూపాయలు సంవత్సరారనికి అప్పు చెల్లించేలా చేశారు. 600 శాతం అధికంగా అప్పు చెల్లించేలా కేసీఆర్ కల్పించారు, ఇప్పడు 70వేల కోట్ల రూపాయలు అప్పులకు చెల్లించాలి, ప్రతీనెలా 60 వేల కోట్ల రూపాయలు జీతాలు, పెన్షన్లు పనుల కోసం మార్చి 31నాటికి చెల్లించాలి, మేం వచ్చిన తర్వాత ప్రతీ నెల 1వతేదీన జీతాలు ఇస్తున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు.

ప్రభుత్వాన్ని పడగొడతామంటే మేం ఊరుకుంటామా?
ప్రభుత్వాన్ని పడగొడతామంటే మేం ఊరుకుంటామా అని రేవంత్ ప్రశ్నించారు. వందరోజుల పాలన తర్వాత రాజకీయపార్టీ అధ్యక్షుడిగా అసలు రూపం చూపిస్తానని రేవంత్ చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేంద్రప్రభుత్వ ఆధీనంలోనిది, తమ ప్రభుత్వానికి సంబంధం లేదని సీఎం చెప్పారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా ప్రవీణ్ కుమార్ కు ఆఫర్ ఇచ్చానన్నారు. రైతు భరోసా గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని 5 ఎకరాల లోపు ఉన్న వారికి ఇస్తామని సీఎం చెప్పారు. రోడ్లు, భవనాలు, గుట్టలకు కూడా రైతుబంధు తీసుకుంటున్నారని, దాన్ని నిరోధిస్తామన్నారు. దుబారా, దుర్వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు.

ప్రవాసీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తాం
తెలంగాణ రాష్ట్రంలో ప్రవాసీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.నిపుణుల నుంచి నివేదిక రాగానే, జుడిషీయల్ విచారణ పూర్తి కాగానే తాము చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పాలన కూలుస్తామని ఎలా చెబుతారని సీఎం ప్రశ్నించారు. నాయకులు, అధికారులపై వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలు ఉండవని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేస్తానని సీఎం చెప్పారు.



Tags:    

Similar News