ఆ త్యాగధనుల రక్తమే 8 గంటల పని

చికాగో వస్తే లెఫ్టిస్టు ఆలోచనాపరులైతే Hay Market, రైటిస్టులయితే స్వామి వివేకానంద ఉపన్యాసం చేసిన చోటు చూడ్డానికి ఇష్టపడతారు;

Byline :  భూమన్
Update: 2025-05-11 03:58 GMT

అంతర్జాతీయ ప్రసిద్ధి చెందిన 'మే' డే (May Day) మూలకారకమయిన జ్ఞాపకాలను చూసే అవకాశం ఇప్పటికి దక్కింది.చికాగో వస్తున్నామని అంటూనే నా ఆత్మీయ మిత్రుడు జయదీప్ మెట్టుపల్లి మొదట అనింది Hay Market Martyrs Monument  చూడాలని. ఎవరైనా మన వాళ్ళు వస్తే వాళ్ళు Leftists  ఆలోచనాపరులైతే Hay Market,  Rightists అయితే వివేకానంద ఉపన్యాసం చేసిన చోటు చూపిస్తామని చెబితే భలే వాడివేనయ్యానని మొదట మనం Hay Market వీరుల స్మారక స్తూపం చూడాలని చెప్పినాను.

1970 లలో మా కుట్ర కేసు వకీలు బాలకృష్ణారెడ్డి గారి కుమారులు ప్రకాష్, జయదేవ్ లు గత ఇరవై ఏళ్లుగా చికాగోలో సాహితీ మిత్రుల పేరిట అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రకాష్ ‘స్టేజి పెళ్ళి’కి నేనే అధ్యక్షత వహించింది. జయదేవ్ విద్యార్ధి దశ నుండి నాకు బాగా కావాల్సినవాడు. పైగా నా ఆత్మీయ మిత్రుడు ఎంవిఆర్ బావమరిది.లోతుగా సాహిత్యం చదువుకున్నవాడు. సాహితీపరులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నవాడు. నలుగురం కలిసి మొదట Hay Market అమరవీరుల స్తూపం,విగ్రహం చూడ్డానికి బయలుదేరినాము.



ఇల్లినాయి లోని చికాగో నగరంలో మే 4 ,1886 లో  Hay Market స్క్వేర్   లో కార్మిక ప్రదర్శనలో ఒక బాంబు పేలింది. 8 గంటల పని దినాల కోసం అత్యంత శాంతియుతంగా జరుగుతున్న ప్రదర్శనలో ఈ బాంబు ఘటన పెద్ద కలకలం చరిత్ర సృష్టించింది. అంతకుమునుపటి రోజున మే 3 న Mc Cormick Harvesting Machine Company  దగ్గర కార్మికుల ప్రదర్శనలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు కార్మికులు చనిపోయినారు. అందుకు ప్రతిగా మే 4 న Hay Market లో పెద్ద ప్రదర్శన,సభ. ఈ సభలో బాంబు పేలింది. ఎవరు వేసినారో ఇంతవరకు తేల్లేదు. నలుగురు సామాన్యులు,ఏడుగురు పోలీసులు చనిపోయినారు. లెక్కలేనంతమంది గాయపడినారు.




8 మంది మీద కేసు నమోదైంది. ‘చికాగో 8’అంటారు. ఈ ఎనిమిది మందిలో అక్కడ ఉన్నది ఇద్దరే.ఏడుగురికి ఉరి,ఒకరికి 15 ఏళ్ళు జీవిత ఖైదు తీర్పు చెప్పినారు. ఇల్లినాయి గవర్నరు ఇద్దరికి జీవిత ఖైదుగా మార్చినాడు. ఒకతను ఆత్మహత్య చేసుకున్నాడు జైల్లో. మిగిలిన నలుగురిని నవంబరు 11,1887 న ఉరి తీసినారు.

వీరి స్మారకం Forest Home Cemetery  లో ఉంది. కంచు విగ్రహం గొప్పగా తయారు చేసినారు. Albert  Weinert  అనే శిల్పి అద్భుతంగా తయారు చేసినాడు.

August spies

Adolph fischer

George engel

louis lingg

అనే నలుగురి వీరుల పేర్లు ఆ స్తూపంపై చెక్కబడి ఉన్నాయి.



స్మారకం వెనకాతల ఇల్లినాయి గవర్నరు వీరు నిందితులు కాదన్న ప్లేటు చెక్కబడి ఉంది.

ఆ స్మారకం కింద ఈ కొటేషన్ ఉంది.
“THE DAY WILL COME WHEN OUR SILENCE WILL BE MORE POWERFUL THAN THE VOICES YOU ARE THROTTLING TODAY.”
ఎనిమిది గంటల పని దినం కోసమే కాకుండా మిగిలిన 16 గంటల కోసం నినదించిన గళాలు అవి. విశ్రాంతి కోసం ఎనిమిది గంటలు, వినోదం కోసం ఎనిమిది గంటలు,పని కోసం ఎనిమిది గంటలు విభజన జరగాలని వారు నినదించారు. చికాగో,డెట్రాయిట్, ఫిలదెల్ఫియా వీధుల్లో లక్షల గొంతులు ఈ నినాదాలిచ్చాయి. రోజుకి ఎనిమిది గంటల పని దినంతో పాటు వారానికో రోజు సెలవు దినం హక్కు కూడా సాధించుకున్నది ఈ వీరుల త్యాగం వల్లనే.

ఆ స్మారకం చుట్టూ తిరుగుతున్నప్పుడు కళ్ళు చెమర్చకుండా ఉండవు. ప్రపంచంలో వీరి త్యాగం వల్లనే కదా కార్మిక వర్గంతో పాటు అన్ని వర్గాలు 8 గంటలు పని దినాలను అనుభవిస్తున్నది. ప్రపంచంలో ఇంతటి ఫలితం ఇదొక్కటేనేమో. ఇంతకుమునుపు వల్లంపాటి వెంకట సుబ్బయ్య,కేతు విశ్వనాథరెడ్డి గార్లను ఇక్కడికి పిలుచుకొచ్చి చూపిస్తే దాదాపు కన్నీళ్ళు పెట్టుకున్నారని జయదేవ్ చెబితే,సహజమే కదా అనిపించింది.

అక్కడనుండి Hay Market స్మారకం చూద్దామని బయలుదేరినాము. జయదేవ్ ,ప్రకాష్ లకు ఈ ప్రదేశాలు కొట్టిన పిండి కనుక సులభంగా రాగలిగినాము. ఒక వాగన్ ను స్టేజిగా చేసుకుని మే4,1886 లో సభనుద్దేశించి మాట్లాడిన వారి జ్ఞాపకార్థం చేసిన ఈ స్మారకం అద్భుతంగా ఒక ఫుట్ పాత్ మీద ఉంది. అప్పట్లో ఇదంతా పారిశ్రామిక వాడ కదా.మేమంతా 1970 లలో మాట్లాడిన సందర్భాలు గుర్తుకొచ్చినాయి.




నాకయితే ఆ స్మారకం చూడగానే అప్పటి ఆ క్షణాలన్నీ కళ్ళకి కట్టినట్టుగా తెలుస్తున్నాయి. ఆ ఉపన్యాసకులు,ఆ బలమయిన గొంతుకలు,అదిరిపోయే ప్రసంగాలు వింటున్నట్టుగానే అనిపించింది. ఆ వేదిక అలనాటిదే ఉన్నట్టుగా శిల్పి Mary Brogger తీర్చిదిద్దినాడు. ఆ చారిత్రాత్మక ప్రదేశాన్ని కళ్ళారా చూడటం ఒక గొప్ప విలక్షణ అనుభూతి.


ముందటి రోజు కాల్పుల్లో చనిపోయిన వారిని స్మరించుకుంటూ మే 4,1886 న జరుపుకుంటున్న సభ ఇది. వీధంతా జనం,కార్మిక వర్గంతో కిక్కిరిసిపోయింది. చుట్టూ లెక్కలేనంత మంది పోలీసులు. ఉపన్యాసాలు సామాజిక,ఆర్ధిక,రాజకీయ,పారిశ్రామిక అంశాల గురించి గొప్పగా సాగుతున్నాయి. ఇంతలో ఉన్నట్టుండి ఎవరో బాంబు పేల్చినారు. ఎవరు పేల్చినారో ఇంతవరకూ తేల్లేదు. ఈ ఘటనతో కాల్పులు,చచ్చిపోవటాలు, అరెస్ట్ లు,ఉరితీతలు కొనసాగినాయి.
ఆ స్థలం దర్శనీయ స్థలమైంది. అన్ని దేశాల వారు ఈ నేలని ఒక ఆదర్శనీయంగా,స్వేచ్చ,న్యాయం,గుమిగూడటం,నిర్భయంగా మాట్లాడటం,ప్రతి మనిషికి ఊపిరి పీల్చనిచ్చే హక్కులకు ప్రతీకగా నిలిచిన స్థలంగా భావిస్తున్నారు. 

ఇప్పటికే ఆ Martyrs స్థలానికి ప్రతి మేడే కి కొన్ని వందల మంది చేరుకొని RED SALUTE చేస్తుంటారని జయదేవ్ చెబితే ఎంతో గొప్పగా అనిపించింది.
ఈ MEMORIAL నగరం నడిబొడ్డున ఉండిన ఆ  foot path లో అడుగుపెట్టి ఆ సభ జరిగిన చోటున కొంచెం సేపు నిలబడి రావటం ఎందరికో గొప్ప చారిత్రాత్మక అంశంగా నిలుస్తున్నది.
“LET THE VOICE OF THE PEOPLE BE HEARD”
-ALBERT PARSONS
ఇతడు ఆ సభలో గంటకు పైగా ఉపన్యసించి,బాంబు పేలుడుకు ముందుగానే ఒక పని మీద స్టేజి దిగి బయటకు పోతాడు. అయితే అరెస్టుల తర్వాత తానూ నిందితుడని తెలుసుకుని స్వచ్చందంగా లొంగిపోయి విచారణకు ముందుకొస్తాడు.1887 లో ఉరి తీయబడిన వీరులలో ఇతను ఒకడు.



ఆ వీరుల ఫలితమే 8 గంటల పనిదినం. 1891 నుండి ప్రపంచ కార్మిక వర్గం ఒక ఉత్సవంలా జరుపుకునే మే డే.

1893 లో చికాగోలో అత్యంత ప్రతిభావంతమయిన ఉపన్యాసం చేసిన స్వామి వివేకానందకు ఈ చికాగో మే డే గురించి తెలుసా?


Tags:    

Similar News

మా అమ్మ