తెలుగు వాళ్లకి వాళ్ల ఆధునిక చరిత్ర ఏమిటో చక్కగా చెప్పిన చరిత్రకారుడు
రాబర్ట్ ఎరిక్ ఫ్రైకెన్ బెర్గ్ కు సోషియాలజిస్టు చెన్నూరు సతీష్ నివాళి;
దక్షిణ భారత చరిత్ర పైన, ముఖ్యంగా (ఐక్య) ఆంధ్ర ప్రదేశ్ సంస్కృతి-రాజకీయాలు పైన విసృతంగా పరిశోధన చేసిన ప్రొఫెసర్ రాబర్ట్ ఫ్రైకెన్బర్గ్ గత నెలలో కన్నుమూశారు. ఫ్రైకెన్బర్గ్ ఊటీలో పుట్టి గుంటూరులో పెరిగాడు. అతని తండ్రి స్వీడిష్ మిషనరీలో పనిచేయడం వలన గుంటూరు, నల్గొండ జిల్లాలలో విస్తృతంగా తన తండ్రితో కలిసి గ్రామాల్లో తిరగడం వలన ఫ్రైకెన్బర్గ్ తెలుగు బాషలో నైపుణ్యం సంపాదించాడు. తెలుగు వాళ్ళుగ పుట్టి తెలుగు మాట్లాడడం నామోషీ అనుకుంటున్న ఈ రోజుల్లో, ఒక అమెరికన్ వ్యక్తి తెలుగు భాషను నేర్చుకుని అనర్గళంగా మాట్లాడగలడం, తెలుగు బాషపైన, తెలుగు నేలపైన తనకున్న గౌరవాన్ని సూచిస్తుంది. అలాంటి వారిని ఒకసారి తలుచుకోవడం ఎంతైనా అవశక్యం.
పై చదువులకు అమెరికాకు వెళ్లిన, ఆంధ్రప్రదేశ్తో గాని, తెలుగు భాషతో గాని తన అనుబంధం కోల్పోలేదు. 1975లో హైదరాబాద్ LB Staidumలో ప్రపంచ తొలి తెలుగు సమావేశాలు జరిగినప్పుడు ఫ్రైకెన్బర్గ్ అందులో పాల్గొన్నాడు. 2010లో తాను రాసిన గుంటూరు జిల్లా చరిత్ర పుస్తకంను నరిశెట్టి ఇన్నయ్య గారు తెలుగులోకి అనువదించారు. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అయిన అమరావతి గురించి మరింత ఎక్కువ చారిత్రాత్మకమైన పరిజ్ఞానం పొందాలంటే ఈ గుంటూరు (Guntur District, 1788-1848) జిల్లా చరిత్ర తప్పకుండ చదవాల్సిందే.
తన కెరీర్ మొత్తంలో అతను మేధోపరంగా చాల శ్రమించడమే కాకుండ తన రచనల ద్వారా సమాజంతో వాటి ఫలితాలను కూడ పంచుకున్నాడు. ముఖ్యంగా, 1960 మరియు 70 లలో, భారతదేశం యొక్క వ్యవసాయ ఆర్థిక వ్యవస్థపై, మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంపైన చాలా విమర్శనాత్మక రచనలను ప్రచురించాడు. Selig Harrison లాంటి చరిత్రకారులు 60 లను ‘అత్యంత ప్రమాదకరమైన దశాబ్దం’ గా పరిగణిస్తే, ఆ దశకం మెుత్తం ప్రపంచం ఆందోళనలు మరియు ప్రతిఘటనలతో అట్టుడికిపోతున్న పరిస్థితి, ఫ్రైకెన్బర్గ్ ఆ దశకాన్ని సమాజంలోని వ్యవస్థలు వాటి విధివిధానాల ద్వారా సమర్థవంతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు.
ఆ దశకంలో ప్రచురించబడిన అతని రెండు రచనల గురించి ఒకసారి గుర్తు చేసుకోవాలి: Land Control and Social Structure in Indian History (1969) మరియు ‘Land Tenure and Peasants in South Asia’ (1977). ఈ రెండు గొప్ప రచనలు British పాలనలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థపై పరిశోధన చేస్తున్న వారికి ఒక విలువైన గోల్డ్మైన్ అనే చెప్పాలి. అలాగే స్వాతంత్రనంతరం, భారత ప్రభుత్వం పరిశ్రమలు లేదా వ్యవసాయం అనే విధానపరమైన సంధిగ్దత సమయం, 1960లలో హరిత విప్లవం యొక్క ప్రభావాలను దృష్టిలో ఉంచుకొని, మరియు వాటితో పాటుగా పర్యావరణ, సహజ మరియు మానవ వనరుల వంటి సమస్యలను వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ చుట్టూ ఉన్న సంక్లిష్టతలను పైన ఫ్రైకెన్బర్గ్ విశ్లేషణాత్కంగ పరిశీలించారు. భూ విస్తీర్ణత- నీరు; భూసామర్ద్యం, వాతవరణ సమతుల్యత మరియు వ్యవసాయంపైన దాని ప్రభావం; టెక్నాలజీ, కులం మరియు కార్మిక ప్రశ్నలు, ఇలా అతను చాలానే సమస్యలపైన, స్థూలంగా భారతదేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థపై చాలా లోతైన అవగాహనతో రచనలు చేసాడు.
తన మరొక ప్రధాన రచనలో, Traditional Processes of Power in South India : an Historical Analysis of Local Influence (1963), Elite Groups in a South Indian District: 1788-1858 (1965), ఈ రెండింటిలో స్థానిక రాజకీయాలలో కులం ఎలా మూలధనం అవుతుందో అతను కూలంకషంగా వివరించాడు. ముఖ్యంగా బ్రాహ్మణులు, ఎలా ఇతర కులస్తులను మరియు బ్రిటిష్ వారిని లోపాయికారిగ manipulate చేసారో చాలా ఉదాహరణలతో వివరించాడు. వారు ఎలా తమ భాష ప్రావీణ్యం, సామాజిక-ప్రాదేశిక చరిత్ర పైన ఉన్న అవగాహనని సమర్థవంతంగా ఉపయోగించుకొని రాజకీయ అధికారాన్ని కేంద్రీకృతం చేసుకున్నారో వివరించాడు. ఉదాహరణకు, ఒక దేశస్త బ్రాహ్మణ (మరాఠా బ్రాహ్మణ) తన కుటుంబం నుండి వంద మందికి పైగా సభ్యులను రెవెన్యూ విభాగంలోకి ఎలా నియమించాడో లాంటి విషయాలను తను రాసిన గుంటూరు జిల్లా ( పుస్తకంలో రాసాడు.
అప్పటి వరకు జిల్లా చరిత్రలను ఒక పరిశోదనా ప్రక్రియగా (one unit) పరిగిణిచడం అరుదు. ఎందుకంటే జిల్లా చరిత్రలు చాలా వరకు ఎక్కువగా పాలకుల చేత వ్రాయబడ్డాయి. ప్రభుత్వమే report రాస్తుంది, దాని పైన అదే చర్య తీసుకుంటుంది. సామాజిక హెర్మెనిటిక్స్ (social hermeneutics) అనే పద్ధతి (methodology) ద్వారా ఫ్రైకెన్బర్గ్ గుంటూర్ జిల్లా సామాజిక చరిత్రను రాసాడు. భారతదేశ చరిత్రను జాతీయ, కేంబ్రిడ్జ్, కాన్బెర్రా/సస్సెక్స్ వంటి దృక్పదాల నుండి చూస్తూ, సామాజిక ఆర్ధిక అంశాల్లో వచ్చిన చైతన్యం మూలాన సబల్టర్న్, దళిత-బహుజన కోణంలో భారతదేశ చరిత్రను విమర్శనాత్మకంగా చూడడానికి ప్రయత్నించాయి. అంటే చరిత్రకారులు, సామజిక-రాజకీయ శాస్త్రజ్ఞులు పరిశోధన ప్రక్రియలో భాగంగా ఒకవైపు దేశస్థాయి విషయాలు, మరొకవైపు గ్రామస్థాయి విషయాలను పట్టించుకుంటారు. ఈ రెండిటి మధ్య ఉన్న ప్రాంతాలు-ముఖ్యంగా జిల్లాలను పరిశోధన అంశంగా తీసుకొని ఫ్రైకెన్బర్గ్ పరిశీలించారు.
ముఖ్యంగా వీరు గుంటూరు జిల్లా చారిత్రక అధ్యయాన్ని సామజిక కోణంలో నుంచి చూసారు. అంటే ఇంగ్లీష్ వారి శక్తివంతమైన పాలనను స్థానిక నాయకత్వం ఎలా జీర్ణించుకున్నది? జిల్లా ప్రజలను, స్థానిక నాయకత్వాన్ని, బ్రిటిష్ ప్రభుత్వం ఎలా సర్దుబాటు చేసింది, లాంటి చాలా విషయాలు ఇందులో చర్చించారు. మరాఠా బ్రాహ్మణులు, ముస్లింలు, రెడ్లు, కమ్మలు, కాపులు, ఇలా అందరూ బ్రిటిష్ వారిని, అలాగే సామాన్య ప్రజలను చాకచక్యంగా దోచుకునేవాళ్లే. ముఖ్యంగా మరాఠా బ్రాహ్మణులైతే కొంచెం ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యత సంపాందించి బ్రిటిష్ వారిదగ్గర ఉద్యోగంలో చేరేవారు. ఆ తదనంతరం, వారు అలా అంచల అంచెలుగా పైకి ఎదగడం, అలాగే వీలైంతమంది కుటుంబ సభ్యులను కొలువులోకి నియంచిండం జరిగేది.
అతను పదవీ విరమణ చేసిన తరువాత కూడ, తెలుగు భూమి మరియు దక్షిణ భారతదేశంపైన అధ్యయనం చేస్తూనే ఉన్నాడు. మిషనరీల మీద తను చాలా గొప్ప పరిశోధన చేసాడు. ముఖ్యంగ, మతం, మతపరమైన అంశాలపైన చారిత్రాత్మకంగా మరియు సామాజికంగా వివిధ సంక్లిష్ట పొరల ద్వారా అధ్యయనం చేసాడు.
మతం, బాషా, కులం, ప్రాంతం, లాంటి సామజిక అంశాలైన తను చాలా విస్తృతంగా, విమర్శనాత్మకంగా రాసాడు. ఇంగ్లీష్ బాషను ఎలా పకడ్బందీగా థామస్ మన్రో స్థానిక నాయకత్వం పైన రుద్దాడో వివరిస్తాడు. మన్రో ఒక్కడే కాకుండా, cornwallis, Wellesley, ఈ ముగ్గురు కలిసి, దేశీయ నాయకత్వం, అంటే బ్రిటిషువారికి పనిచేస్తున్న భారతీయులలో, ముఖ్యంగా బ్రాహ్మణులకు ఏ విధంగా క్రమశిక్షణను, అలాగే ఇంగ్లీష్ బాషను అలవాటు చేసారో వివరించాడు. మిగతా persidencies లతో పోల్చి చుస్తే మద్రాస్ ప్రెసిడెన్సీ ఇంగ్లీష్ భాషను ప్రోత్సహించడంలో చాల ముందు ఉంది అని అంటాడు. అందుకే దీనిని Cindrella of the Eastగ పిలువబడింది.
ఇంకొంచెం వివరాలలోకి వెళితే అసలు దక్షిణ భారత దేశంలో ఇంగ్లీష్ బాషా యొక్క బీజాలు ఉత్తర యూరోప్ లో వెలిసి, అలా జర్మనీ, డెన్మార్క్ ల మీదుగా తరంగంబాడి (తమిళనాడు) దాకా వచ్చాయి. అక్కడ ప్రింటింగ్ ప్రెస్ రావడం, అలాగే అప్పటి గవర్నర్ మన్రో మరియు దేశస్త బ్రాహ్మణల ప్రోద్బలంతో మద్రాసులో 'madras school book society' స్థాపించడంతో స్థానికులకు ఇంగ్లీష్ భాషపై మక్కువ ఎక్కువైంది. ఉదాహరణకు మిరాసీదార్ల కుటుంబం నుండి వచ్చిన వెన్నెలకంటి సుబ్బారావు ఎలా బ్రిటిష్ ప్రభుత్వంలో స్థిరపడ్డాడో ఫ్రైకెన్బర్గ్ వివరిస్తాడు. పదిహేను సంవత్సరాల వయసులో ఆంగ్ల బాషను నేర్చుకొని 'కంపెనీ బహుదూర్ గ పదవీ విరమణ పొందిన సుబ్బరావు లాంటి ఎందరో ఆంగ్ల బాష తీసుకు వచ్చిన పలుకుబడి, పరపతి, ప్రతిష్ఠలను చాలా తరాలపాటు అనుభవించారు. అలా తెలుగునేలపైన ఆంగ్ల బాషా ఆరాధన 19వ శతాబ్దం మొదలునుండి ప్రారంభం అయింది.
స్థానికులపైనా ఆంగ్ల బాష ప్రభావం, ధామస్ మన్రో ప్రమేయం ఎంతయితే ఉందో, అంతే స్థాయిలో స్థానికులు కూడా స్పందించారని రాసారు. ఆంగ్ల బాషను బలవంతంగా స్థానికులపైన రుద్దబడలేదు అని ఫ్రైకెన్బర్గ్ చాల ఆధారాలతో మనముందు ఉంచుతాడు. 1639 నుండి స్థానికులు ఎలా కంపెనీ వారిని గాని, బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారో ఉదాహారణలతో వివరిస్తాడు.
అతని స్కాలర్షిప్ గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తన చారిత్రక సున్నితత్వం చాలా బలంగా ఉండటం. సమాజం ఏ దిశలో కదులుతుందో అతను ముందుగ అంచనా వేయగలడం, ఇది తప్పకుండ intellectual craftsmanship అనే చెప్పాలి. 60 మరియు 70 లలో ఆయన చేసిన పరిశోధన ఆ సమయంలో ఉత్పవమవుతున్న సమస్యలను-భూమి, భూమి నియంత్రణ, భూమి సారవంతం, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ మరియు సామాజిక నిర్మాణం, 80 మరియు 90 లలో, అతను రాజకీయంగా మతం యొక్క ప్రభావంపై గణనీయమైన పరిశోధన చేసాడు. అదే సమయంలో, లౌకికవాదం గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచన, హిందూ మెజారిటీవాదం నుండి తీవ్ర ముప్పు మరియు ఉత్తర భారతదేశంలో కుల రాజకీయాలు ఉద్భవించడం వంటి సున్నితమైన అంశాలపైన కూలంకషంగా రాసాడు.
ఫ్రైకెన్బర్గ్ హిందూ మతం మరియు క్రైస్తవ మతం రెండింటినీ అధ్యయనం చేయడం ద్వారా మతం యొక్క పొరల పొరల లోతుల్లోకి సంభాషణను తీసుకువెళ్ళాడు. ఫ్రైకెన్బర్గ్ రచనలను నాకు పరిచయం చేసిన వారు సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ పూరేంద్ర ప్రసాద్ గారు. అతని పర్యవేక్షణలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పీహెచ్డీ రోజుల సమయంలో ఇది జరిగింది. గోదావరి డెల్టా ప్రాంతం యొక్క ప్రాంతీయ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ మరియు కుల చరిత్రల మీద పనిచేస్తున్నప్పుడు, ఒక పరిశోధనా విద్యార్థిగా నాకు ఫ్రైకెన్బర్గ్ పరిచయం, ఆధునిక ఆంధ్ర సమాజంపై అతనొక గొప్ప సమాచార వనరు. ఫ్రైకెన్బర్గ్ ఇతర సామాజిక చరిత్రకారుల నుండి తన బలమైన చారిత్రక భావజాలం, స్థానిక రాజకీయాలు ద్వారా తనను తాను వేరుచేసుకున్నాడు.