సాహిత్య కార్యక్రమాలు కవి సమ్మేళనాలు--14
నా నుంచి నా వరకు :14 (కవి, రచయిత జూకంటి జగన్నాథ జ్ఞాపకాలు);
గతంలో చెప్పినట్టు యువ సాహితీ సమితి సాహిత్య కార్యక్రమాలు సిరిసిల్ల మార్కండేయ గుడిలో నెల నెలా కవి సమ్మేళనాలు నిర్వహించేవారు. ఈ సంస్థకు సలహాదారు పెద్దదిక్కు సీ నారాయణరెడ్డి స్వంత ఊరు హనుమాజీపేటకు చెందిన కనపర్తి లక్ష్మీ నరసయ్య సారు సిరిసిల్లలో ఉపాధ్యాయునిగా పనిచేస్తుండేవారు . సి నారాయణరెడ్డి అంతేవాసి సినారె స్థాయిలో గేయాన్ని నడిపించే సత్తా ఉన్నవాడు. వివిధ మాత్రా చందస్సులలో గేయాన్ని అద్భుతంగా రాయడంలో ఆరితేరిన వాడు. అప్పటికే ఆయన అభ్యుదయ కవిగా రాష్ట్రస్థాయిలో సుప్రసిద్ధుడు. దీపశిఖలు పేరున కవితా సంకలనం తీసుకువచ్చాడు. పరాజిత గేయ కావ్యాన్ని చంద్ర ఆర్టిస్ట్ అందమైన ముఖచిత్రంతో ముద్రిరించాడు. అనంతరం "నింపుమా చషకమున మధువు నెచ్చెలీ! వ్యధ తీరిపోవును" అనే మకుటంతో జీవిత సత్యాలను గీతాల ద్వారా అత్యంత సమర్దవంతంగా రాశాడు. ఆ రోజుల్లో సినారె, జె. బాపురెడ్డి ఊరైన సిరికొండ గ్రామానికి వచ్చాడు. అప్పుడు సిరిసిల్లలో ఉన్న కనపర్తి సార్ తన గీతాలను సి.నారాయణరెడ్డికి చూపించగా ఆయన చదివి , మార్చి నింపుమా చషకమున మధువును బదులుగా చైతన్య సవమును నింపుమా నెచ్చెలీ గా మార్చమని సూచన చేశాడట. ఎందుకో ఏమో గాని సారు ఆ పుస్తకాన్ని ప్రచురించలేకపోయాడు . అనంతర కాలంలో మకుటంలో ఎలాంటి మార్పు చేయకుండా సిరిసిల్ల మానేయ రచయితల సంఘం అధ్యక్షుడు పత్తిపాక మోహన్ పూనికతో "మధువని" పేరున పుస్తకం తీసుకరావడం జరిగింది.
ఒకసారి ఉగాది కవి సమ్మేళనం ఉన్నదని కనపర్తి సార్ పెద్ద కొడుకు ప్రవీణ్ మానేరు వాగులో నడుచుకుంటూ వచ్చి నాకు విషయం చెప్పాడు. ప్రస్తుతం ప్రవీణ్ అమెరికాలో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. ఆ వార్త తెలియగానే సిరిసిల్ల మార్కండేయ గుడిలో జరిగే ఉగాది కవి సమ్మేళనంలో పాల్గొనడానికి కవిత రాయడానికి పూనుకున్నాను. మా నాగేంద్రం ఇచ్చిన తెల్ల కాగితంపై రాసి చూపించాను. ఆయన బాగుందన్నాడు.
ఉన్న ఒక్క డ్రెస్సును చెరువుకు పోయి చాకలి వాళ్ళ సౌడుతో తెల్లగా ఉతుక్కొని అక్కడే దండెం మీద ఎండకు ఆరేసాను. ఈమధ్య నిండుగా ఉన్న చెరువులో ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు మూడు నాలుగు సార్లు ఈత కొట్టాను. ఎండిన ప్యాంటు షర్టును మడతపెట్టికొని ఇంటికి వచ్చాను. అన్నం తిన్న తర్వాత మిత్రుడు చిట్యాల లక్ష్మీనరసయ్య వాళ్ల ఇంటికి పోయి ఇస్త్రీ పెట్టెను అడుక్కొని వచ్చాను. బొగ్గులు వేసి వేడి అయ్యాక బట్టలను ఇస్త్రీ చేసుకున్నాను. ఆ బట్టలను వేసుకొని పెళ్లికి తయారైనట్టు తయారై ఉత్సాహంతో సాయంత్రం నాలుగు గంటలకు సిరిసిల్ల బాట పట్టాను. మార్కండేయ గుడి హాలులో వచ్చిన వాళ్లు కూర్చోవడానికి జంపుఖాన పరుస్తున్నారు.ఒకతను మైకు సరిచేసి వన్ టూ త్రీ హలో అంటూ మైక్ టెస్టింగ్ అంటూ ఒకటికి రెండుసార్లు విన వస్తుందో లేదో అని పరీక్షించాడు. సమావేశానికి ఒక్కొక్కరు మెల్లగా వస్తున్నారు.
కనపర్తి సారు సన్నని తెల్లని ధోతి కట్టుకొని, పట్టు లాల్చీ వేసుకొని వచ్చాడు. వడ్డేపల్లి కృష్ణ జక్కని వేంకటరాజం, కుడిక్యాల లింగయ్య కొంతమంది యువకులు ఊరి పెద్దలు వచ్చి కూర్చున్నారు. అంత కొడితే ముప్పై నలబై మంది వున్నారు. వచ్చిన వారిలో నేనే చిన్నవాడిని. పైగా అందరితో ఇంతో అంతో పరిచయం ఉన్నవాడిని. నన్ను కనపర్తి సార్ పిలిచి గాంధీ వద్ద రాయలింగం హోటల్ దగ్గర సార్లు ఉంటారు నేను రమ్మన్నానని చెప్పి తీసుక రమ్మని చెప్పాడు. నేను పోయి అక్కడ నిలబడి ముచ్చట్లు పెట్టుకుంటున్న సార్లకు పేరుపేరునా కనపర్తి సార్ రమ్మన్నాడు అని చెప్పాడు. ఎక్కడ ఉన్నరు అంటే మార్కండేయ గుడిలో ఉన్నారని చెప్పాను. ఎందుకు ఏం జరుగుతుంది అక్కడ అని అడిగారు. నేను కవి సమ్మేళనం జరుగుతుంది రమ్మన్నాడు అని అమాయకంగా చెప్పాను. సరే వస్తాము నువ్వు నడువు అన్నారు. నేను పోయి సార్ తో విషయం చెప్పాను. చూసి చూసీ ఎవరూ మీటింగు కు రాకపోయేసరికి, ఏమని చెప్పావని అడిగాడు. ఏమి మీటింగు అంటే కవి సమ్మేళనం అని చెప్పానన్నాను.
అయ్యో గట్ల ఎందుకు చెప్పినవ్ అని కోపంగా చూశాడు. ఇక ఎవరూ రారని నిర్ధారించుకున్నాక సార్ అధ్యక్షత వహించగా కవిసమ్మేళనం ప్రారంభించారు. అదో గమ్మతి సంబురం కవి సమ్మేళనంలో పాల్గొని కవితను భిన్నమైన గొంతుతో చదవడం అంటే మళ్లీ కవుల సమ్మేళనం జరిగే వరకు సరిపడా ఉత్సాహం ఒక అద్వితీయమైన శక్తి వచ్చేది . అక్కడే నాకు జక్కని వెంకటరాజం సార్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమక్రమంగా నా భవిష్యత్తు సాహితీ వ్యక్తిత్వానికి పటిష్టమైన పునాది నిర్మాణం జరిగిందని చెప్పాలి.
వారి ద్వారానే నిజాం వెంకటేశం సార్ తో పరిచయం ఏర్పడడం ద్యారా నా సాహిత్య జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పింది.. ఆ రోజుల్లోనే బహుశా దిగంబరకవుల కవితా సంకలనం అచ్చు ప్రభావంతో సిరిసిల్లలో యువసాయితీ సమితి సంస్థ ఐదుగురు కవులు "యువ స్వరాలు" పేరున కవితా సంకలనం సిరిసిల్ల ఎలగొండ నారాయణ ప్రింటింగ్ ప్రెస్ లో సుందరంగా ముద్రించబడింది. అనంతరం అదే ప్రెస్లో కనపర్తి సార్ "దీపశిఖలు" ఆ తర్వాత జక్కని వెంకట్రాజం సార్ కుందుర్తి ఆంజనేయులు ముందు మాటతో "అర్ధరాత్రి సూర్యుడు" ఆ తర్వాత కనపర్తి సార్ "పరాజిత "గేయకావ్యం అచ్చు అయ్యాయి. సిరిసిల్ల మారుమూల ప్రాంతం నుంచి విభిన్నంగా హైదరాబాద్ ప్రింటింగ్ ప్రెస్ లో ముద్రించిన పుస్తకాల స్థాయిలో విలక్షణంగా పుస్తకాలు రావడం అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఒక విధంగా సంచలనం సృష్టించింది. అట్టి సంకలనాలను నారాయణ రెడ్డి గారికి అంకితం ఇవ్వడం ఆయన స్వీకృతి అంగీకరిస్తున్నానని నాలుగు మాటలు రాయడం బాగుండేది. కృతికర్త కవితో కలిసి సినారే దిగిన ఫోటో ప్రచురించడం హైలైట్ గా ఉండేది. ఆ పుస్తకాల ఆవిష్కరణకు సినారే తో పాటు జే బాపురెడ్డి తిరుమల శ్రీనివాసాచారిలతో పాటు స్థానిక నాయకులు తదితరులు హాజరై చేసే ప్రసంగాలు చేయడం ఒక పండుగ వాతావరణం అనుభూతిని మిగిల్చేది.
ఇకపోతే అప్పటికే లబ్ద ప్రతిష్టలు అయిన ప్రముఖులను పిలిచి సాహిత్య కార్యక్రమాలు నిర్వహించేవారు. కనపర్తి సారు దీప శిఖలు వెంకటరాజం సార్ అర్ధరాత్రి సూర్యుడు పుస్తకాల ఆవిష్కరణ సభలు జరిగాయి. ఒకసారి కాళోజిని పిలిచారు. ఆ సభలో కాళోజి ప్రసంగం చాలామందిని ఆలోచించేటట్టు చేసింది. ఆ సభకు వేములవాడ నుండి చొప్పకట్ల చంద్రమౌళి సార్ తదితర సాహితీ మిత్రులు వచ్చారు. నాటి సాహిత్య సమావేశం ముందు ఎప్పుడూ లేనంత విజయవంతమైనది.