కళ్ళలో తడి దాచుకున్న అవనిగడ్డ వర్మ

‘ఎర్రజెండా నీడన నా అనుభవాలు’ అంటూ ఎనభై రెండేళ్ళ ఏవి. వర్మ రాసిన ఈ జ్ఞాపకాలు తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఉదయం ఆవిష్కరణ జరగబోతోంది.

Update: 2024-06-28 15:25 GMT


సీపీఎం నుంచి విప్లవ కారులు విడిపోయినప్పుడు అవనిగడ్డ వర్మ సిపిఎంలోనే ఉండిపోయారు. గతంలో తనతో కలిసి పనిచేసిన పురుషోత్తమ రాజు విప్లవకారుల వైపు వెళ్ళి పోయి, వివేక్ పేరుతో ‘ఎన్ కౌంటర్’ లో మృతి చెందినప్పుడు వర్మ చాలా బాధపడ్డారు. ఎందుకంటే, వర్మ మనిషిగా గుండెల్లో తడి దాచుకున్నారు కనుక.

తల్లి మరణించినప్పుడు కూడా శవపేటికపైన పడి వర్మ బావురుమని ఏడ్చేశారు. అమ్మ పార్థివ దేహాన్ని విద్యుత్ శవపేటికలోకి తీసుకెళుతుంటే చిన్న పిల్లవాడిలా గుక్కపట్టి ఏడ్చేశారు. ఎందుకంటే వర్మ కళ్ళలో తడిదాచుకున్నారు కనుక.

‘ఎర్రజెండా నీడన నా అనుభవాలు’ అంటూ ఎనభై రెండేళ్ళ ఏవి. వర్మ రాసిన ఈ జ్ఞాపకాలు తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఉదయం ఆవిష్కరణ జరగబోతోంది. ఎవరీ వర్మ అంటే, పేదల పట్ల ప్రేమ ఉన్న మనిషి, నమ్మిన దారిలోనడుస్తున్న మనిషి, రచయిత, నాటకకర్త, సంస్కృతికోద్యమ కార్యకర్త, కార్మిక నాయకుడు, మాటలకు పరిమితం కాని కమ్యూనిస్టు. పెద్ద కూతురికి మతాంతర వివాహం చేసి, ఇద్దరు కూతుర్లకు కులాంతర వివాహం చేసిన ఆదర్శవాది. అలాంటి వ్యక్తి తన ఆత్మ కథ రాస్తే ఎలా ఉంటుంది?  



ఆత్మకథలు, జీవిత చరిత్రలు నిలిచిపోయతాయి. ఎందుకంటే వాటిలో కల్పనలుండవు కనుక. అవి జీవితమంత పచ్చినిజాలతో నిండి ఉంటాయి కనుక. అవనిగడ్డ వర్మ తెనాలి తాలూక తురిమెళ్ళలో 82 ఏళ్ళ క్రితం జన్మించారు. అక్కడే చదువుకున్నారు. చదువుకునే రోజుల్లోనే చలం, శరత్, అడవి బాపిరాజు, గోరా , సీవీ రచనలతో ప్రభావితమయ్యారు. రంగనాయకమ్మ రాసిన ‘రామాయణ విషవృక్షం’ వర్మని ఆలోచనల్లోకి లాక్కుపోయింది.

‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్న సంతోషమే కానీ, జీవితంలో పెద్ద మార్పు కనిపించలేదు’ అని వర్మ రాసుకున్న ఒక్క ముక్క చాలు ఆయన వామపక్ష భావాల వైపు ఎందుకు నడిచిందీ అర్థంచేసుకోవడానికి. పీయూసీలో చేరినా, పాలిటెక్నిక్ లో చేరినా చదువు ముందుకు సాగలేదు. పోస్టల్ డిపార్టు మెంటులో క్లర్క్ గా చేరారు.

ఉద్యోగంలో చేరినా మనసు ఊరుకోలేదు. కార్మిక సంఘంలో చేరి వారి హక్కుల కోసం గళమెత్తారు. మరి ప్రభుత్వం ఊరుకుంటుందా? వర్మని ఎక్కడికి పడితే అక్కడికి మాటిమాటికీ ట్రాన్స్ వర్ చేసి ఫుడ్ బాల్ ఆడుకుంది. ఎక్కడికి పంపినా వర్మ మాత్రం కార్మిక సంఘాల కార్యక్రమాలను వదలలేదు.

సీపీఎం నుంచి సీపీఐ (ఎంఎల్) విడిపోయినప్పుడు వర్మ సీపిఎం లోనే ఉండిపోయారు. గతంలో తనతో కలిసి పనిచేసిన పురుషోత్తమ రాజు సీపీఐ (ఎంఎల్) వేపు వెళ్ళిపోయాడు. అతను వివేక్ పేరుతో పనిచేస్తూ, పోలీసుల ఎన్కౌంటర్ లో మృతి చెందినప్పుడు రాజకీయాలకు అతీతంగా వర్మ చాలా బాధపడిపోయారు. తల్లి మరణించినప్పుడు కూడా శవపేటికపై పడి చిన్నపిల్లబాడిలా గుక్కపట్టి ఏడ్చేశారు. ఎందుకంటే వర్మ కళ్ళలో, గుండెల్లో తడి దాచుకున్నారు కనుక.

పొడిబారిన కళ్ళతోనూ, ఎండిపోయిన గుండెలతోనూ ఉన్న ఈ మనుషుల మధ్య బతుకుతున్న వర్మ వారి కంటే కొంత భిన్నంగా కనిపిస్తారు. ఒదిలేసిన కమ్యూనిస్టు జీవితపు గొప్పతనాన్ని చెప్పుకుని మురిసి పోయే కొందరు పాలకవర్గాలలో చేరిపోయి సంపదను పోగేసుకుంటున్న వాళ్ల నెందరినో చూస్తున్నాం. కానీ వర్మ అలా చేయలేదు. నమ్మిన దారిలో నడుస్తున్నారు.

పెద్ద కూతురికి మతాంతర వివాహం చేశారు. తరువాత ఇద్దరు కూతుర్లకు కులాంతర వివాహాలు చేశారు. కులాంతర వివాహం చేసింది ఆర్థికంగా స్థిరపడ్డవారినిచ్చి కాదు. ఆలూరు భుజంగరావు లాగా కమ్యూనిస్టు పార్టీ హోల్ టైమర్లకిచ్చి చేశారు. భుజంగరావు ఇద్దరు అల్లుళ్ళు ఎన్కౌంటర్లో మరణించారు. భుజంగరావు, వర్మ లాంటి వారు చాలా అరుదైన కమ్యూనిస్టులు, నిత్య స్మరణీయులు.


Tags:    

Similar News

ఆమె ఒక తోట