ఆర్యబ్రాహ్మణిజం ఫాసిజం కంటే ప్రమాదమన్న బిఎస్ రాములు

ఆగస్టు 23న బహుజన తత్వవేత్త, రచయిత బి.ఎస్. రాములు 75 వ జన్మదిన సందర్బంగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ప్రత్యేక వ్యాసం

Update: 2024-08-17 13:10 GMT
తెలంగాణ బహుజన తాత్వికుడు బిఎస్ రాములు

-ప్రొఫెసర్ గాలి కుమార్

నాటి సోక్రటీస్ నుండి నేటి బి.ఎ,స్. రాములు వరకు తత్వశాస్త్రము యొక్క అనేక అంశాలను పరిశోధించి , పరిశీలించి అసమానతలు లేని నూతన సమాజ నిర్మాణానికి బాటలు వేసిన ప్రముఖ తత్వవేత్తల్లో బి.ఎస్. రాములు ఒకరు. అయితే తత్వవేత్తల్లో బిఎస్ ది బహుజన పక్షం. బుద్ధుని నుండి మొదలుకుంటే శైవతత్వం వరకు ఆయన స్పృషించని వస్తువు అంటూ ఈ భూ ప్రపంచంలో లేదంటే అతిశయోక్తి కాదేమో.
ఆయన వ్రాసిన 120 పుస్తకాలు , 8 నవలలు , 3 ముద్రితాలు , 5 అముద్రితాలు , 17 కథల పుస్తకాలు , తెలంగాణ సాధన కోసం రాసిన 42 పుస్తకాలు , రిజర్వేషన్ల పరిరక్షణ మరియు బిసి రిజర్వేషన్ల కోసం తెలంగాణ తొలి బిసి కమీషన్ చైర్మన్ గా అనేక రాజ్యాంగ అంశాలను మారుతున్న కులానికి అనుగుణంగా రాజ్యాంగంలో రావాల్సిన మార్పులను క్షుణ్ణంగా పరిశీలించి వ్రాసిన వ్యాసాలు , నోట్బుక్లు అనేకం. అయితే యుపిలో నాకు ఇష్టమైన పుస్తకాలలో నా విజయ గాధ గురించి ఒక పేజిలో ఆయన రాసిన వ్యక్తిత్వ వికాసం , సామాజిక నాయకత్వం పుస్తకం కంటే నన్ను అత్యంత ప్రభావితం చేసిన పుస్తకం యుపిలో " బిఎసిపి గెలుపు , ఆధునిక భారత రాజకీయ చరిత్రలో మహోన్నత మలుపు ".
ఈ పుస్తకంలో ఆర్య బ్రాహ్మణ అగ్రకుల ఉత్తరాదిపత్యానికి వ్యతిరేకంగా బుద్ధుని " బహుజన వాదాన్ని ” రాజకీయ రంగంలోకి తెచ్చిన మహానేత మాన్యశ్రీ కాన్షీరాం గారి స్ఫూర్తితో ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల కంటే అధిక జనాభా కలిగిన ఉత్తర్ ప్రదేశ్లో కుమారి మయావతిని నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేసి ప్రపంచ రికార్డును బద్దలు చేసిన ఘనత బహుజన ఉద్యమపితా మహులు బాబాసాహెబ్ అంబేడ్కర్కు నిజమైన వారసుడు మాన్యశ్రీ కాన్షీరాం సిద్ధాంతం గురించి ఈ పుస్తకంలో సవితరంగా వివరించారు బి.ఎస్. రాములు గారు.
ప్రపంచ ఫాసిస్ట్ చరిత్రలో మనువాదం ముఖ్యంగా ఆర్యబ్రాహ్మణిజం హిట్లర్ ఫాసిజం కన్న ప్రమాదకరమైనది. బ్రిటీష్ వాళ్ళు భారతీయులను హింసించిన దానికంటే వెయ్యి రేట్లు బహుజనులను విభజించి పాలించే వర్ణకుల వ్యవస్థ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో దేశంలోనే మొదటి సారిగా ఒక బిసి అయిన ములాయంసింగ్ యాదవన్ను దళితుడైన కాన్షీరాం స్థాపించిన బహుజన సమాజ్పార్టీ మద్దతుతో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేస్తే , కంచె అయిలయ్య భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లింది అని పుస్తకం రాసాడు. ఎందుకంటే తన యాదవ కులానికి చెందిన ములాయం సింగ్ యాదవ్ దళితులను అణచివేసినప్పటికి ఆయన ప్రభుత్వంలో యాదవులు దళితులను ఊచకోత కోసినప్పటికి కేవలం బిసి ని ముఖ్యమంత్రిని చేయాలన్న దృక్పథంలో కాన్షీరాం గారు మద్దతిస్తే దళితులకు రక్షణ లేని పరిస్థితి ములాయం పరిపాలనలో కొనసాగిన కారణంగా మద్దతు ఉ పసంహరించారు మాన్యశ్రీ కాన్షీరాం గారు.
అయితే బి.ఎస్. రాములు పద్మశాలి అయినప్పటికి తన కులం కాని కుమారి మాయవతి స్వంత మెజార్టీతో మే 13 , 2007 లో అధికారాన్ని చేపట్టినప్పుడు రాసిన పుస్తకమే యు.పి.లో బి.ఎస్.పి. గెలుపు దేశానికి మలుపు. ఇది భారత దేశ సాహిత్య రంగంలో ఒక నూతన అధ్యాయంగా చెప్పుకోవాలి. అంతే కాకుండా ఒక అంటరాని కులానికి చెందిన మహిళ నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయి ప్రపంచ రాజకీయ చరిత్ర గతిని మార్చి 2008 లో ప్రపంచ వ్యాప్తంగా ఎదిగిన 100 మంది శక్తివంతమైన మహిళా లీడర్లలో కుమారి మాయావతి గారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒక ఫోర్బ్స్ అంతర్జాతీయ పత్రికలో 59 వ స్థానాన్ని దక్కించుకున్న ఉక్కు మహిళగా ప్రపంచ ఖ్యాతిని సంపాదించుకున్నారు.
ఈ విషయాలన్ని బి.ఎస్. రాములు గారు తన పుస్తకంలో వర్ణిస్తూ ఈ బహుజన విప్లవాన్ని రష్యాలో లెనిన్ స్టాలిన్ సాధించిన విప్లవంకన్నా చైనాలో మావో సాధించిన విప్లవం కన్నా స్వదేశీ ప్యారిస్ కన్నా తక్కువ కాని జ్ఞాపకంగా ఆయన అభివర్ణించాడు. ఈ పుస్తకం కుమారి మాయావతి గెలుపు నా జీవితంలో మరువలేని జ్ఞాపకంగా మిగిలిపోయాయి. అంతే కాకుండా ప్రపంచంలో ఎవరితో పోల్చుకోలేని గొప్ప త్యాగశీలి మాన్యశ్రీ కాన్షీరాం గారితో 1989 నుండి ఆయన చనిపోయే వరకు బహుజన ఉద్యమంతో కలిసి పనిచేసిన నేను ఆయన సిద్ధాంతంతో ప్రభావితమై బహుజన్ సమాజ్ పార్టీలో 2008 వరకు కొనసాగాను.
మాన్యశ్రీ కాన్షీరాం గారి సిద్ధాంతానికి ప్రభావితమైన బి.ఎస్. రాములు గారు ఆంధ్రప్రదేశ్లోని బ్రాహ్మణవాద సాహిత్యాన్ని సవాలు చేస్తూ బహుజనవాద కవులు , కళాకారులు , మేదావుల ఐక్యవేదిక స్థాపించి ఆంధ్రప్రదేశ్కు సాహిత్య రంగంలో బహుజన సాహిత్య విప్లవానికి నాంది పలికారు వరంగల్ జిల్లా దరకమే ( దళిత రచయితల కళాకార్ల మేధావుల ఐక్య వేదిక ) ప్రధాన కార్యదర్శిగా నాకు అవకాశమిచ్చి గుర్తింపిచ్చారు బి.ఎస్. గారు అప్పుడు నా వయస్సు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. అలాగే నేను జనవరి 26 , 1997 వరంగల్ పట్టణంలోని జెడ్.పి. సెమినార్ హాల్లో నా శ్రీమతి గాలి చంద్రకళ సంపాదకత్వంలో మెజార్టీ పిలుపు ( బహుజన్ వాయిస్ ) వారపత్రికను కూడా మా అమ్మ శ్రీమతి గాలి అక్కమ్మతో పాటు ప్రారంభించింది కూడా బి.ఎస్. రాములు గారే.
మావోయిస్టు ఆలోచనాపరుడైన బి.ఎస్. గారు నేను వామపక్షవాదిని కాకపోయినప్పటికీ ఆయన ఎప్పుడైతే బహుజనవాదం భుజాన ఎత్తుకొని కుల సమస్యను మావోయిస్టు ఎజెండాలో చేర్చి చర్చకు పెట్టారో అందులో నుండి బయటకు వచ్చిన తరువాత కాన్షీరాం గారి సిద్ధాంతంతో ప్రభావితమైన బి.ఎస్. గారితో కలిసి పనిచేయడం జరిగింది. అయితే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ దొర అయిన కెసిఆర్తో ఆయన కలిసి పనిచేసిన కారణంగా బహుజన / సామాజిక / ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతున్న నేను బి.ఎస్. గారితో కలిసి పనిచేయలేకపోయాను. ఆ తరువాత జరిగిన పరిణాలమాల నేపథ్యంలో కెసిఆర్ దొరతనాన్ని ప్రశ్నించిన బి.ఎస్. గారు కెసిఆర్ నుండి దూరమైన తరువాత ఆయనతో తిరిగి అనేక సమావేశాల్లో పాల్గొన్నా. ఆగస్టు 23 , 2024 న తన 75 వ వసంతంలోకి అడుగు పెడుతున్న తెలంగాణ వైతాళికుడు , బహుముఖ ప్రజ్ఞాశాలి , సంఘసంస్కర్త , సాహితీవేత్త బి.ఎస్. రాములు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.


Tags:    

Similar News