సాయిబాబా మరణం తర్వాత పౌర సమాజం బాధ్యత ఏమిటి?

ఆయన మరణం చాలా సమస్యలను లేవనెత్తింది. వాటి పరిష్కారం మేధావులు ఆలోచించాలి.

Update: 2024-10-19 09:53 GMT

-రమణాచారి


ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో,దేశంలో ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పేరు ప్రొఫెసర్ జి ఎన్ సాయిబాబా. అకస్మాత్తుగా, అకాల మరణం పొందిన నాటి నుండి నేటి వరకు సంతాప సభలు సమావేశాలు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. దినపత్రికల్లో, టీవీ ఛానళ్ల లో, సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఆయన అకాల మరణం పైన, ఆయన ఔన్నత్యం పైన, పాలకుల పైన, న్యాయస్థాన తీర్పుల పైన విశ్లేషణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వ్యవస్థను పోస్టుమార్టం చేసినంత పనిచేస్తున్నారు. మేధావులు, రాజకీయ నాయకులు, వివిధ వర్గాల ప్రజలు చర్చోప చర్చలు చేస్తున్నారు. ఒక రకంగా ఇదంతా మంచి పరిణామమే. కానీ, సాయిబాబా పనిచేసింది, కోరుకున్నది ఇందుకోసం మాత్రమే కాదు.  కార్యాచరణ అనివార్యతను గుర్తించి నడుచుకోవడం పౌర సమాజం బాధ్యత.

నిజాలు చెప్పినందుకు, అమాయకులకు అండగా నిలిచినందుకు, యువతను చైతన్యపరచినందుకు, జాతివిముక్తి కోసం పోరాడినందుకు, స్వాతంత్ర అభిలాష వ్యక్తపరిచినందుకు పాలకులు కక్షకట్టడం, బలి తీసుకున్న ఘటనలు చరిత్రలో అడగడుగునా కనిపిస్తాయి. సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రచారం చేసినందుకు బ్రూనో (Giordano Bruno ) ను పలు చిత్రహింసలకు గురి చేసి సజీవ దహనం చేశారు. మూఢనమ్మకాలను ప్రశ్నించి, జ్ఞానమే ధర్మమని యువకులను చైతన్యపరచినందుకు సోక్రటీస్కు విషమిచ్చి చంపారు.

బానిసల విముక్తి కోసం తిరుగుబాటు చేసిన నాయకుడు స్పాటకస్ ను శిలువ వేసి చంపారు.ఆదివాసుల, మూలవాసుల స్వాతంత్ర్యకాంక్ష కోసం ఉద్యమించిన కొమురం భీం, రాంజీ గోండు, సీతారామరాజులను చంపి వేశారు. భగత్ సింగ్ ఆజాద్ సుఖదేవ్ లను చెరసాల పాలు చేసి ఉరికంబం ఎక్కించారు. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని చారిత్రక వాస్తవాలు.ఆదివాసులు దళితులు, మైనారిటీలు, అణచివేతకు గురవుతున్న జాతులకు అండగానిలినందుకు జి ఎన్ సాయిబాబా మన కళ్ళ ముందే బలయ్యాడు.

 58 ఏళ్ళ వయసులో 90% వికలాంగుడుగా ఉండి ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఆయనకు మరణం సంభవించింది. అన్యాయంగా సుమారు పదేళ్లపాటు అత్యంత ఘోరమైన అండా సెల్ లో నిర్బంధించడమే అందుకు ప్రధాన కారణం. నిర్బంధ కాలంలో సరైన వైద్య సౌకర్యం అందక, సరైన వసతులు లేక, స్వచ్ఛమైన గాలి లభించక, మనుష్య సంబంధాలు దూరమై ఒంటరితనం కారణంగా తీవ్ర మానసిక వేదనకు గురై తీవ్ర యాతన అనుభవించాడు. ఈ పదేళ్ల జైలు నిర్బంధ కాలమే ఆయన మృత్యువు కు దారి తీసింది.

సాయిబాబా విడుదల కోసం అనేక ప్రజా సంఘాలు, పలుయూనివర్సిటీ ల మేధావులు, విద్యార్థులు, రచయితలు, కవులు,కళాకారులు చేసిన విజ్ఞప్తులు ఫలించలేదు.చివరకు ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. తన మాతృమూర్తి అంత్య క్రియలకు హాజరయ్యేందుకు కూడా మానవతా దృష్టితో నైనా అనుమతి లభించలేదు. చావును నిరాకరిస్తున్నారని బహిరంగంగా ప్రకటించి, చనిపోయే ఆరు మాసాల ముందు నిర్దోషిగా విడుదలైన పోరాటయోధుడు ప్రొఫెసర్ సాయిబాబా విడుదలై బయటకు వచ్చిన సమయంలో ఈ వాతావరణం ఆయన ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. తర్వాత ఏం చేస్తారని విలేకరులడిగిన ప్రశ్నకు, ప్రజాసేవకే పునః రంకితమవుతానని బలంగా ప్రకటించాడు.

ఆదివాసుల కోసం, వారికి రక్షణ ఇచ్చే అడవి కోసం, శతాబ్దాలుగా వారి కాళ్ళ కింద రక్షణలో ఉన్న ఖనిజాలను కార్పొరేట్ సంస్థల దోపిడీకి గురికాకుండా కాపాడేందుకు కృషి చేశాడు. తనకు అంగవైకల్యం శరీరానికి మాత్రమే, మనసుకు కాదని ప్రకటించే ఆచరణతో చేశాడు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి వచ్చి హైదరాబాద్, ఢిల్లీ లో చదువు పూర్తి చేసి, ఉద్యోగం ఉద్యోగం చేసినా జీవితకాలం ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, దేశవ్యాప్తంగా అణగారిన వర్గాల, ఆదివాసుల, వివిధ జాతుల విముక్తి పోరాటాల గురించే ఆలోచించాడు, చర్చించాడు, కార్యోన్ముఖుడై పని చేశాడు.

ఈ దేశ ప్రజల హక్కుల కోసం, కనీసం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల రక్షణ కోసం ఆలోచించడమే పెద్ద నేరం అయింది. మెదడు చురుగ్గా పనిచేయడమే బెయిల్ రాకుండా, ఘోరమైన శిక్ష విధించేందుకు కారణంగా కోర్టు వివరించింది .ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ చేసిన అన్వేషణల విషయానికొస్తే ఆయనలో చైతన్యవంతంగా పని చేసింది కేవలం మెదడు మాత్రమే. ఇటు సాయిబాబా, అటు స్టీఫెన్ హాకింగ్ వీల్ చైర్ కు మాత్రమే పరిమితమై భవిష్యత్ తరాల కోసం తమ జీవితాలను అంకితం చేశారు. సాయిబాబా ఒక వేసిన శిక్ష, స్టీఫెన్ హాకింగ్ కూడా వేసి ఉంటే సైన్స్ పురోగతి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

మానవాళి అభివృద్ధి కోసం,ప్రకృతి వనరుల రక్షణ కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం, నిజాలు మాట్లాడినందుకు, దుర్మార్గాలను ప్రశ్నించినందుకు గొంతు నొక్కి వేయడం, జైళ్ళ పాలు చేయడం, పలు రకాలుగా చంపడం నిత్య కృత్యమైంది. చనిపోయిన వెంటనే ఘనంగా అంతిమయాత్ర నిర్వహించడం, నిరసనగా బిగ్గరగా నినదించడం, ఎలెక్ట్రానిక్ ప్రింట్ మీడియాలలో చర్చలు జరపడం, సభలు సమావేశాలతో హోరెత్తించడం ఆనవాయితీగా మారింది. ఈ స్ఫూర్తి వారిని బ్రతికించుకునేందుకు, కాపాడుకునేందుకు అవసరమైన కార్యాచరణ రూపంలో కానరావడం లేదు.

అమాయకులను ఎందుకిలా అక్రమంగా నిర్బంధిస్తున్నారని గాని, వేధిస్తున్నారని గాని ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణతో రాజ్యాన్ని అడ్డుకున్న ఘటనలు అరుదుగా ఉన్నాయి. భూమయ్య, కిష్ట గౌడ్ లకు ఉరిశిక్ష విధించిన సమయంలో శ్రీ శ్రీ నాయకత్వంలో పౌర సమాజం జైలు వద్దే నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో పలుమార్లు వాయిదా పడింది. చిలకలూరిపేట బస్సు దాహనం కేసులో ఉరిశిక్ష ను యావజ్జీవ శిక్ష గా మార్చారు. కారంచేడు ఘటనపై స్థానికంగా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి న్యాయ విచారణ జరిపారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.

సరైన సమయంలో ప్రత్యక్ష కార్యాచరణతో,సంఘటితంగా ఉద్యమిస్తే అనేక మందిని ప్రాణాలతో దక్కించుకో గలిగేవాళ్ళమేమో. ఫ్రాక్షనిస్టులు, రాజకీయ నాయకులు చేస్తున్న చేస్తున్న అకృత్యాలు, హత్యలపై సరైన విచారణ ఉండదు, శిక్షలు ఉండవు. బడుగు బలహీన వర్గాలకు, పీడిత తాడిత ప్రజలకు అండగా నిలిచి పోరాడిన వారికే కొత్త కొత్త చట్టాలతో పాశవిక శిక్షలు. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు కోసం, ప్రాథమిక హక్కుల కోసం ఉద్యమించడమే కాక, పాలకులను నిలదీసి ప్రశ్నించనంత కాలం సాయిబాబాలు వేధింపబడుతూనే ఉంటారు. వేటాడబడుతూనేఉంటారు.బాధింపబడుతూనే ఉంటారు. బలవుతూనే ఉంటారు. పాలకుల వైఖరిని ప్రతిఘటించకపోతే, ఇలాంటి విషాదాలు  పునరావృత మౌతూనే ఉంటాయి. మానవతావాది సాయిబాబా రగిలించిన స్ఫూర్తితో ప్రజలను చైతన్య పరచాలి.


Tags:    

Similar News