అమరావతికి ‘నమో’ హారతి
ఏది ఏమైనా రాజధాని నిర్మాణం భారం ఏపీ ప్రభుత్వమే మోయాలి అన్నది మోదీ వైఖరిగా స్పష్టమవుతుంది.;
‘చరిత్ర పునరావృతమవుతుంటుంది.కొన్నిసార్లు సుఖాంతమైతే మరికొన్ని సార్లు పరిహాసభాజనంగా ముగుస్తుంటుంది’ అన్న మార్క్స్ మాట అనేక సందర్భాల్ల్లో గుర్తు వస్తుంటుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం పున: పున:ప్రారంభోత్సవం ఘట్టం అందులో ఏ కోవకు చెందుతుందో కాలమే చెప్పాలి. దేశంలో కొన్ని రాజధానుల నిర్మాణం నిర్ణయంలో ముందు వెనకలు నిజమే కానీ ఒకే చోట ఒకే ప్రధాని రెండుసార్లు ప్రారంభించిన అరుదైన సన్నివేశం ఇదే. దేశంలోనూ రాష్ట్రంలోనూ నెలకొన్న అసాధారణ రాజకీయ పరిస్థితులు రాజకీయ పార్టీల అవకాశవాద పోకడలు దీన్నిబట్టే తెలిసిపోతున్నాయి. 2015లో అక్టోబర్లో అమరావతికి శంకుస్థాపన జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఇదే కూటమి అధికారంలో ఉన్నారు. జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం,ప్రతపక్ష నేత హోదాలో జగన్ వుండటం మినహా మిగిలిందంతా సేమ్ టు సేమ్. తర్వాత ఆ జగన్ ముఖ్యమంత్రిగా అయిదేళ్లు ఏలారు. మరి పాత్రధారులందరూ వారే అయినప్పుడు పదేళ్ల ఆలస్యం గా మళ్లీ అదే రీతిలో ప్రారంభించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్న అనివార్యం. ఆ శంకుస్థాపన రోజునా టీవీ చర్చల్లో వున్న నాలాటి వారికి అప్పటి మాటలే మరో సారి గుర్తుకు వస్తే మా పొరబాటేమీ కాదు. కాకపోతే మిస్సింగ్ లింక్స్ చాలానే వున్నాయి.
2015-19 మధ్య కాలమంతా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు సింగపూర్ భాగస్వామ్యం గురించి గొప్ప ప్రచారం కూడా జరిగినప్పటికీ రాజధాని ముందుకు కదల్లేదు, ఎందుకు ?శాసనసభ చర్చలో ఈ రాజధానికి మద్దతు ప్రకటించి, అధికారంలోకి వస్తే తాము దాన్ని నిలిపివేస్తామన్న ప్రచారంలో నిజం లేదని భరోసా ఇచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హయాంలో అది ఎందుకు నిలిచిపోయింది? అప్పుడు ఇప్పుడు మధ్యాహ్న జగన్ హయాంలోనూ రాష్ట్ర పాలకులతో రాజకీయ సాన్నిహిత్యం నడిపిన వెంట తిప్పుకున్న ప్రధాని మోదీకీ ప్రతిష్టంభనకీ సంబంధం లేదా? జగన్ దాన్ని నిలిపివేసినప్పుడు అధికారికంగా గాని రాజకీయంగా గాని జోక్యం చేసుకున్నదీ వద్దన్నదీ లేదు. రాజధాని పూర్తిగా రాష్ట్ర శాసనసభ నిర్ణయమని ఉన్నత న్యాయస్థానాల్లో అఫిడవిట్ లు కూడా దాఖలు చేశారు. కేంద్ర ఆధ్వర్యంలోని 40 సంస్థలకు విలువైన భూములు కేటాయించినప్పటికీ ఏ నిర్మాణాలు చేసింది లేదు. ఇన్ని అనుభవాల పూర్వరంగంలోనే పునః ప్రారంభోత్సవం ఎంత ఆర్భాటంగా జరిపినా ఆచరణ లో ఏం జరుగుతుందన్న ప్రశ్న వెంటాడక మానదు.
రాజధాని భారం రాష్ట్రానిదేనా...
గతం ఏమైనా భవిష్యత్తులో మంచే జరగాలని కోరుకుంటూ అమరావతిలో కదలిక రావడాన్ని స్వాగతించవచ్చు.కానీ ఈ పున: ప్రారంభ ఘట్టం తీరు అలా లేదే? మోదీ 2015 లో వచ్చినప్పుడు ఎలాంటి ఆర్థిక సహాయం కాని ,ప్రత్యేకహోదా ప్రకటించింది గానీ లేదు. ప్రత్యేక హోదాకు విభజన చట్టంతో పాటు అవకాశం కల్పించిన చంద్రబాబు అడిగిందీ మోదీ ఇచ్చింది శూన్యమే. 42 వేల కోట్ల మేరకు ఆర్థిక సహాయం కావాలని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం అడిగితే కేంద్రం 1500 కోట్లు మాత్రమే-అదీ సచివాలయం శాసనసభ రాజ్ భవన్ వంటి వాటికోసం సహాయం చేసిందని అన్నారు. అవీ తాత్కాలిక నిర్మాణాలు గానే ఉండిపోయాయి. సెంటిమెంటల్ ఎఫెక్ట్ కోసం నాడు చంద్రబాబు గ్రామ గ్రామాల నుంచి మట్టి తెప్పిస్తే, నేను సైతం అన్నట్టుగా మోదీ ఢల్లీ నుంచి మట్టి నీళ్లు తీసుకువచ్చి ఈయడం హాస్యాస్పద సన్నివేశమైంది. దేశమంటే మట్టి కాదోయ్ అన్న గురజాడ సూక్తిని కళ్లకు కట్టారాయన. ఈ పునః ప్రారంభంలో ఆ మట్టి నీళ్లు కూడా లేకపోవడం. వట్టి మాటలు కట్టిపెట్టోయ్ అన్న గురజాడనే మరోసారి తలపించింది. ఈసారీ నిర్దిష్టమైన ప్రకటనలు గాని నిధుల మంజూరు నాస్తి. ప్రపంచ బ్యాంకు, హడ్కోల నుంచి 50 వేల కోట్ల అప్పు మాత్రం మంజూరు చేయిస్తే. నక్షత్రకుడిలా వాళ్ళు మోదీ కన్నా ముందుగానే అమరావతి సందర్శించి ఆదేశాలు జారీ చేసి వెళ్లారు.ఏది ఏమైనా రాజధాని నిర్మాణం భారం ఏపీ ప్రభుత్వమే మోయాలి అన్నది మోదీ వైఖరిగా స్పష్టమవుతుంది.
ప్రపంచ బ్యాంకు అప్పు కేంద్రమే చెల్లిస్తుందని ఏపీ బిజెపి నాయకులు చెప్పే మాటలకు ఆధారంగా అధికార పత్రం ఏమైనా ఉందా? మధ్యలో దాన్ని నిలిపివేసిన జగన్ పైన కూడా ఆయన ఏమీ పెదవి మెదపలేదు చంద్రబాబు రాకతో అమరావతికి దుష్ట గ్రహాలు తొలగిపోయాయని మోదీ చేసిన వ్యాఖ్య జగన్ను ఉద్దేశించిందేనని అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం ఆధార రహితం. కనీసం కేంద్ర ప్రభుత్వ సంస్థలను వేగంగా పూర్తి చేస్తాము అన్న హామీ కూడా మోదీ నుంచి వచ్చింది లేదు. కనెక్టివిటీ రాకపోకల సంబంధాల పెరుగుదల గురించీ టెక్నాలజీ గురంచీ ఆయన ఎక్కువగా మాట్లాడారు.
పరస్పర భజనల ప్రహసనం
మోదీ నాయకత్వం ఉన్నందువల్లే భారతదేశం ప్రపంచ శక్తిగా ఆవిర్భవించిందని చంద్రబాబు పొగిడితే బాబు దార్శనికత వల్లే అమరావతి పునః ప్రారంభయవుతోందని మోదీ కొనియాడారు.చంద్రబాబు సాంకేతిక విజన్ గురించి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగానే తాను అధ్యయనం చేశానని మోదీ ప్రశంసలు కురిపించడం ఇప్పుడు టిడిపికి మహదానందం కలిగించవచ్చు. ఎప్పుడు ఏం మాట్లాడాలో మోదీకి బాగా తెలుసని దేశమంతటికీ తెలుసు. అంతమాత్రాన 2018లో వీరిద్దరూ విడిపోయి ఒకరిపై ఒక రు ఏ స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారో జనం మర్చిపోతారా? . కేంద్ర వైఖరిపై విధాన ప్రకటనలు, నిధుల విడుదల లేకుండా, కేంద్ర సంస్థలపై నిర్మాణం చేపట్టకుండా మోదీ వచ్చారని మురిసిపోవడంలో వాస్తవికత వుంటుందా? భుజం కాయటం అండగ్ా నిలబడటం లాంటి మాటలతో రాజధాని తయారవుతుందా? అన్నిటినీ మించి జగన్ ప్రభుత్వం అమరావతిని ఉన్న ఫలానా నిలిపివేసినప్పుడు మోదీ కూడా ఆయనతో ఉన్నారు. అమరావతి ఉద్యమం పట్ల బిజెపి వైఖరి ఏమిటి అన్నది కూడా చాలా కాలం పాటు అయోమయంగానే ఉండిరది. రైతులు తిరుపతి యాత్ర చేసిన సమయంలోనే బిజెపి బహిరంగంగా మద్దతు ప్రకటించింది . అప్పుడు స్వయంగా హొంమంత్రి అమిత్ షా వచ్చి గీతోపదేశం చేశారు.
నమో భజనతో మార్మోగిన అమరావతి సభ
బాబు, పవన్, లోకేష్ ల నమో భజనతో అమరావతి సభ మార్మోగింది. నమో మిస్సైల్ అని కూడా లోకేష్ అభివర్ణించారు. కాశ్మీర్లో ఉగ్రవాద మారణకాండ నేపథ్యంలో పాకిస్తాన్తో ఏర్పడిన ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ మోదీని మహాశక్తిగా అలౌకిక భాషలో కీర్తించేదాకా వెళ్లారు. అన్ని పార్టీలు ఉగ్రవాదంపై పోరాటానికి మద్దతునిస్తుంటే వ్యక్తిగతంగా మోదీ ఏదో ఒంటరిగా పోరాడుతున్నట్లు చెప్పడం అశేష ప్రజానీకాన్ని తక్కువ చేయటం లాంటిదే . రాజధాని విషయంలో జగన్ నిర్వాకాన్ని ఈ ముగ్గురి ప్రసంగాలలోనూ తీవ్రంగానే అభిశంచించారు. కానీ ఆయనకు మోదీ ఆయనకు ఆశీర్వాదాలు అందించారనే అంశాన్ని దాటేశారు. రాజధాని నిలిచిపోయిన సమయంలో పోరాడిన రైతులను ముఖ్యంగా మహిళలను ప్రశంసించటం బాగుంది. కానీ సి ఆర్ డి ఏ ఒప్పందం లోని 9. 14 వంటి అనేక అంశాలను ఇంకా అమలు చేయలేకపోయిన పరిస్థితిని మాత్రం చెప్పలేదు. విమానాశ్రయం కోసం మరో 45 వేల ఎకరాలు సేకరించటం సమీకరించటం గురించి మాట్లాడలేదు. రైతాంగంలో ఇప్పటికే అసంతృప్తి రావటం ఇందుకు కారణం కావచ్చు .నిజంగానే పదేళ్ల తర్వాత పునః ప్రారంభం చేసుకుంటున్న అమరావతిని పై సర్వ శక్తి యుక్తులు కెేంద్రీకరించే బదులు మరేదో నిర్మిస్తామంటూ భూమి సేకరించటం అంతు పట్టని విషయం. గన్నవరం విమానాశ్రయం కోసం సేకరించిన భూములకే ఇంకా పూర్తి పరిష్కారం దొరికింది లేదు. అమరావతి వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకోవడం మంచిదే గానీ అది ఆఘమేఘాల మీద విశ్వనగరంగానో దేశ అభివృద్ధికి కేంద్రంగానో మారిపోతుందని చెప్పడం ఎలా సాధ్యం?. బాబు తరపున రాజధాని వ్యవహారాలన్నీ చూస్తున్న మంత్రి నారాయణ కొద్దిరోజుల కిందట మాట్లాడుతూ విజయవాడ గుంటూరు తో కలిపి అమరావతిని మెగాసిటీగా తీర్చిదిద్దుతామన్నారు.అదే విధానమైతే చాలా సమస్యలు వచ్చి వుండేవే కావు. 29 గ్రామాలు నవ నగరాలు, సింగపూర్ స్టార్టప్ వంటి వాటి చుట్టూ తిరగడం వల్లనే సాధారణ పురోగమనం కూడా లేకపోయింది. ఇప్పుడు కూడా ఒకే చోట మొత్తం కేంద్రీకరిస్తే ప్రజలు ఆమోదించరు. అది గ్రహించబట్టే చంద్రబాబు సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని లేట్గా ట్వీట్ చేశారు.
వైసీపీ అదే పాట
అయితే మరోవైపున చూస్తే వైయస్సార్ పార్టీ నాయకులు పున:ప్రారంభంపై చేసౖే విమర్శలలోనూ ఔచిత్యం లేదు. అమరావతిని పూర్తిగా మూలకు నెట్టి మూడు రాజధానుల ముచ్చటతో కాలం గడిపి ఇప్పుడు దీనిపైన దాడి చేయటాన్ని ప్రజలు ఎ లా హర్షిస్తారు? రాజధాని కట్టేబదులు మహానగం నిర్మాణం అంటూ చంద్రబాబు పక్కదో పట్టించారని వైసీపీ వారు అంటున్నారు. మరి తాము రాజధాని వరకే పరిమితమై కట్టి ఉండాలి కదా?దాదాపు పూర్తయిన భవనాలను కూడా పాడు పెట్టడం, మొత్తం అడవిలా అల్లుకుపోతుంటే ఉపేక్షించడం వారి బాధ్యతరాహిత్యం కాదా? తమకు 40 శాతం మంది ఓట్లేశారు కనుక వారంతా అమరావతికి వ్యతిరేకమేనని కొంతమంది వైసీపీ వర్గాలు చెప్పుకోడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అమరావతిపై కేసులు వున్నాయనుకున్నా కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటుకు అన్ని పార్టీలు అంగీకారం తెలిపినప్పటికీ ఆ దిశలోనైనా వైసీపీ ప్రభుత్వం చేసింది ఏంటి ?విశాఖలో పాలన రాజధాని అంటూ రిషికొండపై వేల కోట్లు ఖర్చు చేయడం తప్ప నిజంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి?
‘ప్రజా రాజధానిగా అమరావతి’ అనే పల్లవిని మళ్లీ వినిపిస్తున్నదిగానీ పెట్టుబడిపెట్టే ప్రపంచ బ్యాంకు అందుకు ఒప్పుకుంటుందా? రాజధానిపై పెట్టే పెట్టుబడి రాబట్టడం ఎలాగనే దానికోసం టోల్స్ విధింపుతో సహా చర్చ బ్యాంకు ఇప్పటికే లేవనెత్తుతున్నది. ఆ అప్పులతో రాజధాని కట్టడం అంటే అడుగడుగునా ఆంక్షలు షరతులకు తలవంచడమే..ఏమైనా రాజధాని ప్రక్రియను వేగంగా, ప్రజోపయోగకరంగా పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది మూడేళ్లలో పనులు పూర్తి అవుతాయి అంటే అర్థం అప్పటికి ఈ ప్రభుత్వం చివరి ఏడాది పాలనలో ఉంటుంది. జమిలి ఎన్నికలు వంటి మాటలు వింటున్న దృష్ట్యా ఈ లోగా కూడా ఏం జరుగుతుందో చూడాల్సిందే.
రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకు పడే వైసిపి కేంద్రాన్ని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. వైసిపి విషయంలో బిజెపి ఇంకా పాత సంబంధాలు తెంచుకోలేదనే సమాచారం ఒకటైతే వీరు కూడా దాన్ని కాపాడుకోవాలని చూస్తున్నారని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ్డ ఈ సమయంలో తెలంగాణ రాజకీయాలు చూస్తే రజతోత్సవం పేరిట భారీగా సభ జరిపిన టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కూడా తన సుదీర్ఘ ప్రసంగంలో ఒక్క వాక్యం మినహా బీజేపీని కేంద్రాన్ని విమర్శించింది లేదు. పవన్ కళ్యాణ్ వంటి వారు ఎంతగా బిజెపి ని మోస్తున్నప్పటికీ తెలంగాణలో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీి నేతలు ప్రకటించేసారు. అయినా ఏపీలో వారు పూర్తిగా బిజెపిని సంతోషపెట్టే దిశలోనే పనిచేస్తున్నారు. విజయ్ సాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని కూడా ఇటీవల తెలుగుదేశం బిజెపికే కేటాయించింది. కాశ్మీర్ ఉగ్రవాద హత్యాకాండ సాకుగా చూపి మతాల మధ్య స్పర్ధ పెంచటం మంచిది కాదని సరైన మాట చెప్పినందుకు తెలుగుదేశం అధికార ప్రతినిధి గాయత్రిని బిజెపి సస్పెండ్ చేయించింది. ఈ విధంగా తెలుగు రాష్ట్రాల్లో నాలుగు ప్రాంతీయ పార్టీలు బిజెపి ఉచ్చులో పడిపోవటం కాదనలేని వాస్తవం. అమరావతి పున: ప్రారంభాన్ని నమో హారతిగా మార్చడం కన్నా అందుకు మరో నిదర్శనం కావాలా?