సహకార సంఘాలకు ధాన్యసేకరణ డబ్బులివ్వరా?

రాష్ట్ర సహకార సంఘాలు ఎందుకు చచ్చిపోతున్నాయి...ఇందులో సర్కారు బాధ్యత ఎంత?;

Update: 2025-06-13 11:00 GMT

ఐక్య రాజ్య సమితి పిలుపు మేరకు “సహకార వ్యవస్థతో మెరుగైన ప్రపంచ నిర్మాణం” నినాదంతో 2025 సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంఘాల సంవత్సరంగా నిర్వ హిస్తున్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణలో ఉన్న సహకార సంఘాలు ఎదుర్కుంటున్న కొన్ని కీలక సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భాగంగా తెలంగాణ ప్రాంతంలో కూడా రైతులను, గ్రామీణ ప్రజలను సహకార సంఘాలుగా సంఘటితం చేసే ప్రక్రియ 1960 దశకంలో మొదలైంది. తెలంగాణలో సహకార సంఘాల నియంత్రణకు సంబంధించి రెండు చట్టాలు అమలులో ఉన్నాయి. మొదటిది - తెలంగాణ సహకార సంఘాల చట్టం 1964. ఈ చట్టం క్రింద ఏర్పడిన సంఘాలకు ప్రభుత్వం సహాయం అందిస్తుంది. సంఘాల నిర్వహణ లో జోక్యం కూడా చేసుకుంటుంది. రెండవ చట్టం - తెలంగాణ పరస్పర సహాయ సహకార సంఘాల (MACS) చట్టం 1995. ఈ చట్టం క్రింద ఏర్పడిన సంఘాలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటాయి. ఈ సంఘాల నిర్వహణకు సభ్యులే జవాబుదారీగా ఉంటారు. బాధ్యతా యుతంగా, జవాబుదారీతనంతో, సొంత వనరులతో ఈ సహకార సంఘాలు పని చేస్తాయి.

నేషనల్ కో ఆపరేటివ్ డాటా పోర్టల్ సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో 60,125 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో క్రెడిట్ మరియు థ్రిఫ్ట్ సహకార సంఘాలు (24,020) మొదటి స్థానంలో ఉండగా, తరువాతి క్రమంలో పశు సంవర్ధక రంగంలో మేకలు, గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలు 7,974, మత్స్య కారుల సహకార సంఘాలు 4,985, , పాల రైతుల సహకార సంఘాలు 2,102 ఉన్నాయి. లేబర్ సహకార సంఘాలు 4,296 ఉన్నాయి. మొత్తం తెలంగాణ రాష్ట్ర సహకార రంగంలో 1,42,98,836 మంది సభ్యులున్నారు.

రాష్ట్రంలో మొత్తం 920 ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయి, వీటిలో సుమారు 33.7 లక్షల మంది రైతులు వాటాదారులుగా ఉన్నారు. ఈ సంఘాలు తొలి రెండు దశాబ్ధాలలో రైతులకు వ్యవసాయ రుణాలు, వ్యవసాయానికి అవసరమైన ఉపకరణాలు- ముఖ్యంగా ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందిస్తూ వచ్చాయి. ఒక రకంగా గ్రామీణ ప్రాంతంలో ఇవి బహుళ-సేవా కేంద్రాలుగా పనిచేస్తూ, రైతులకు నిల్వ , పంటల సేకరణ, మార్కెటింగ్ సౌకర్యాలను కూడా అందించేవి.

కానీ 1980 దశకం మధ్య భాగం నుండీ ఈ రైతు సహకార సంఘాల నిర్వహణలో రాజకీయ పార్టీల జోక్యం బాగా పెరిగిపోయింది. ప్రతి రెండేళ్లకు జరగాల్సిన సహకార సంఘాల సంఘాల ఎన్నికలు కూడా ఆయా రాజకీయ పార్టీల ఆధిపత్యం కోసం జరిగేవిగా మారి పోయాయి. ముఖ్యంగా అధికారంలో ఏ పార్టీ ఉన్నా, ఆ పార్టీ ఈ రైతు సహకార సంఘాలపై పెత్తనం కోసం ఎక్కువగా జోక్యం చేసు కుంటూ వచ్చింది.

రైతులకు సేవ చేసే దృక్పధంతో ఏర్పడిన ఈ సంఘాల కార్యక్రమాలు క్రమంగా తగ్గిపోతూ వచ్చాయి. స్థానికంగా రైతులకు అందే సంస్థాగత/పంట రుణాలు కూడా జాతీ /వాణిజ్య బ్యాంకుల పరిధి లోకి వెళ్లిపోయాయి. రేషన్ షాపులకు నిర్వహణకు కూడా డీలర్లతో కూడిన వేరే వ్యవస్థ ఏర్పడింది. కొన్ని రైతు సహకార సంఘాల ఛైర్మన్ లు, డైరెక్టర్లు అవినీతికి పాల్పడడం, సంఘాల నిధులను దుర్వినియోగం చేయడం, ఇతర కొన్ని కారణాల వల్ల అనేక సహకార సంఘాలు రుణాల ఊబిలో కూరుకు పోయాయి.

ఈ నేపధ్యంలో వైద్య నాథన్ కమిషన్ సూచనల మరకు కొన్ని సహకార సంఘాలను పూర్తిగా మూసేసి, కొన్ని సహకార సంఘాలను పక్కనే మెరుగ్గా ఉన్న ఇతర సహకార సంఘాలలో విలీనం చేసేసి , రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు దులుపుకున్నాయి. కానీ ఈ సంఘాల దుస్థితికి కారణమైన మౌలిక సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. రైతులతో సర్వసభ్య సమావేశాలు కూడా మొక్కుబడిగా మారి పోవడంతో ఈ సంఘాల నిర్వహణపై రైతులకు ఆసక్తి పూర్తిగా తగ్గి పోయింది. కేవలం సహకార సంఘ ఉద్యోగులు ( కార్యదర్శి) మాత్రమే సహకార సంఘ కార్యక్రమాలను నిర్వహించేలా పరిస్థితి మారిపోయి, ఆయా సంఘాలలో రైతుల భాగస్వామ్యం క్రమంగా తగ్గిపోయింది. ఈ సంఘాలను అభివృద్ధి చేయడానికి, వాటి కార్యక్రమాలను పెంచడానికి తిరిగి ప్రణాళిక చేయాల్సిన అవసర ముంది.

పరస్పర సహాయ సహకార సంఘాల (MACS) చట్టం క్రింద ఏర్పడిన సహకార సంఘాలకు రైతుల వాటా ధనం తప్ప ,ఇతర ప్రభుత్వ సహకారమేదీ అందకపోవడంతో రైతులతో ఏర్పడిన కొన్ని సహకార సంఘాలు పెద్దగా ఫలితాలు చూపించ లేక పోతున్నాయి. ఇందుకు మినహాయింపుగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రఘునాథపల్లి, ములకనూరు లాంటి కొన్ని సహకార సంఘాలు మాత్రం, మంచి ఫలితాలను సాధించాయి. రాష్ట్రంలో మహిళల స్వయం సహాయక బృందాలను ఈ చట్టం ప్రకారమే గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి సహకార సంఘాలుగా ఏర్పరిచారు. పాలు, చేపలు , గొర్రెలు, మేకలు, కల్లు గీత ఆధారిత సహకార సంఘాలు కూడా ఈ చట్టం ప్రకారమే ఏర్పడ్డాయి.

ఈ నేపధ్యంలో 2013 లో కంపనీల చట్టంలో చేసిన సవరణతో, గ్రామీణ ఉత్పత్తిదారులు రైతు ఉత్పత్తిదారుల సంఘలుగా (FPO) ఏర్పడడానికి అవకాశం ఏర్పడింది. ఈ రైతు ఉత్పత్తి దారుల సంఘాలు సహకార సంఘాల చట్టం ప్రకారం కానీ, కంపనీల చట్టం ప్రకారం గానీ రిజిస్టర్ చేసుకోవచ్చు. 2015 నుండీ తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు ఉత్పత్తి దారుల కంపనీలు ఏర్పడుతున్నాయి. నాబార్డ్, నాఫెడ్ , NCDC , SFAC లాంటి కేంద్ర సంస్థలు, ఆయా రాష్ట్రాలలో స్థానిక స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేసి ఈ సంఘాల ఏర్పాటుకు సహకరిస్తున్నాయి. వాటికి మూడు సంవత్సరాల పాటు తగిన ఆర్ధిక, సాంకేతిక, శిక్షణా సహకారాలను అందిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సంఘాలు ఎదుర్కుంటున్న ప్రత్యేక సమస్యల గురించి ఈ వెబ్ మాగజైన్ లోనే ఒక ప్రత్యేక వ్యాసం నేను రాశాను. ఆసక్తి ఉన్న వాళ్ళు చదవాలని కోరుతున్నాను.

ఇటీవల రైతు స్వరాజ్య వేదిక బృందం కొన్ని FPO లను పరిశీలించడానికి వెళ్ళినప్పుడు ఈ సంఘాలు ఎదుర్కుంటున్న మరి కొన్ని ప్రత్యేక సమస్యలు కనిపించాయి. ఈ FPO లలో కొన్నిటికి ప్రభుత్వం ధాన్యం సేకరణ కేంద్రాలను మంజూరు చేసింది. గ్రామాలలో రైతుల నుండీ ధాన్యం సేకరించి పౌర సరఫరాల శాఖ సూచిన రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలించడం ఈ సంఘాల బాధ్యత. ధాన్యం అమ్మిన రైతులకు నేరుగా పౌర సరఫరాల శాఖ చెల్లింపులు చేస్తుంది. ఈ ధాన్యం సేకరించిన సంఘాలకు పౌర సరఫరాల శాఖ కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ గత 5 సీజన్ ల నుండీ (2022 రబీ నుండీ 2024-2025 ఖరీఫ్ వరకూ ) రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఈ సంఘాలకు కమిషన్ చెల్లించడం లేదు.

ఇప్పటికీ అనేక సంఘాలు ఈ కమిషన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాయి. కొన్ని సంఘాలు తమ దగ్గర ఉన్న సభ్యుల వాటా ధనాన్ని ఇందు కోసం ఖర్చు పెట్టాయి. గత రెండున్నరేళ్లలో ఒక్కో సంఘం ఈ ధాన్యం సేకరణ ఖర్చుల కోసం 5 నుండీ 7 లక్షల వరకూ ఖర్చు పెట్టింది. ప్రస్తుతం డబ్బులు లేక తమ సంఘం CEO లకు, ఇతర సిబ్బందికి జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితిని కొన్ని సంఘాలు ఎదుర్కొంటున్నాయి. 2024-2025 రబీ లో కొన్ని సంఘాలు మళ్ళీ ధాన్యం సేకరణ చేశాయి. వాటి కమిషన్ డబ్బులు ఎప్పుడు వస్తాయో ఈ సంఘాలకు అంచనా లేదు. జిల్లా అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నా, ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ సమాయను పరిష్కరించాలి. ఆయా సంఘాలకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి.

ఈ సంఘాలు ఎదుర్కుంటున్న మరో సమస్య – మార్క్ ఫెడ్ నుండీ ఎరువుల సరఫరా లో రవాణా చార్జీల భారం. తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ ఫెడరేషన్ ( మార్క్ ఫెడ్ ) అనేది రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నడిచే రైతు సహకార సంఘాల సమాఖ్య. ఈ సంస్థ ఎరువుల కంపనీల నుండీ రసాయన ఎరువులను కొని , ఆయా జిల్లాలలో గోదాములు (డిపోలు) నిర్వహిస్తూ, రాష్ట్రంలో ఉన్న ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు నిర్వహించే ఎరువుల దుకాణాలకు ఎరువులను గ్రామ స్థాయిలో ఆయా సంఘాల గిడ్డంగుల వరకూ సరఫరా చేస్తుంది. ఆయా సంఘాలు తమ సభ్యులకు, ఇతర రైతులకు ఎరువులను అమ్మి కొంత లాభం పొందుతాయి.

రాష్ట్రంలో ఉన్న రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కూడా అవసరమైన లైసెన్సులు , వ్యవసాయ శాఖ అధికారుల నుండీ తీసుకుని తమ సభ్యుల కోసం ఎరువులను అందు బాటులో ఉంచడానికి షాపులను ఏర్పాటు చేశాయి. నిబంధనల మేరకు, తమ శక్తి మేరకు గిడ్డంగులను కూడా సమకూర్చు కున్నాయి. కానీ మార్క్ ఫెడ్ నేరుగా ఆయా సంఘాల గిడ్డంగులకు ఎరువులను సరఫరా చేయడం లేదు.

ఒక వేళ FPO లకు ఎరువులు కావాలంటే, వాళ్ళు మార్క్ ఫెడ్ నిర్వహించే డిపోలకు వెళ్ళి ఎరువులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. 50-70 కిలో మీటర్ల దూరంలో ఉండే ఈ డిపోలకు వెళ్ళి ఎరువులు తీసుకు రావడానికి ఈ సంఘాలపై రవాణా భారం ఎక్కువ అవుతోంది. ఫలితంగా కనీస లాభాలు కూడా ఈ సంఘాలకు ఉండడం లేదు. రైతులకు తక్కువ ధరకు ఎరువులు అమ్మలేని పరిస్థితి. కొన్ని సార్లు ఎరువులు మిగిలిపోయి నష్టాలు కూడా పొందుతున్నారు. నిజానికి ఎరువులు అమ్మే వారికి ఎరువుల కంపనీలు అందించే కమిషన్ చాలా తక్కువ. ఈ నేపధ్యంలో ఇతర సహకార సంఘా లకు ఎరువులు సరఫరా చేసిన విధంగానే మార్క్ ఫెడ్ బాధ్యత తీసుకుని FPO లు నిర్వహించే గిడ్డంగుల వరకూ ఎరువులను సరఫరా చేయవలసిన అవసరముంది. వ్యవసాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై కూడా దృష్టి సారించాలి.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడానికి, బడా కంపెనీలకు భూమిని చూపిస్తున్నారు. ఇందుకోసం భారీగా భూసేకరణ చేస్తున్నారు. కంపనీలకు వందల ఎకరాల భూమి తక్కువ ధరలకే కేటాయిస్తున్నారు. కానీ గ్రామాలలో రైతులు వాటా ధనం చెల్లించి స్వయంగా ఏర్పాటు చేసుకున్న రైతు ఉత్పత్తి దారుల సంఘాలు మాత్రం ఒక్క ఎకరం భూమి కోసం ఇబ్బంది పడుతున్నాయి.

ఈ సంఘాల ఆధ్వర్యంలో గిడ్డంగులు నిర్మించుకోవడం, రైస్ మిల్లులు, పప్పులు, పిండి మిల్లులు ఏర్పాటు,పశువుల దాణా కేంద్రాల ఏర్పాటు కోసం ప్రణాళిక చేసుకుం టున్నాయి . వాళ్ళ వాటా ధనంతో పాటు, CSR నిధుల తోనూ, బ్యాంకుల నుండీ తెచ్చుకునే రుణాల తోనూ వీటిని ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఈ ప్రయత్నం సఫలం కావాలంటే, ఈ సంఘాలకు ఒక ఎకరం భూమి అవసరం. కొన్ని గ్రామాలలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. కొన్ని చోట్ల కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుని , ఈ సంఘాలకు ఆయా గ్రామాల మధ్యలో రోడ్డు సౌకర్యానికి దగ్గరగా కనీసం ఎకరం భూమిని సమకూర్చాల్సి ఉంటుంది. ఉన్న ప్రభుత్వ భూమి నుండీ ఒక ఎకరం కేటాయించడం, లేదా స్థానిక మార్కెట్ ధరకు కొనుగోలు చేసి ఇవ్వడం చేయాలి. రైతు సహకార సంఘాల అభివృద్ధికి ఇది అత్యంత కీలకమైనది.

రైతు భరోసా పేరుతో వ్యవసాయం చేయని రైతులకు, వ్యవసాయం చేయని భూములకు కూడా వందల కోట్లు పంచడానికి సిద్దపడుతున్న ప్రభుత్వం రైతు ఉత్పత్తి దారుల కంపెనీలకు కనీసం ఒక ఎకరం భూమిని సమకూర్చడానికి, లేదా గ్రామాల మధ్యలో గిడ్డంగులు, శీతల గిడ్డంగులు నిర్మించడానికి, లేదా ప్రాసెసింగ్ యూనిట్లు నిర్మించడానికి ప్రతి సంవత్సరం కనీసం 2,000 కోట్లు ఖర్చు పెడితే, అయిదేళ్లలో గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సౌకర్యాలు అభివృద్ధి చెందుతాయి. ఈ మౌలిక సౌకర్యాలతో, వేల కోట్ల విలువైన ధాన్యం, ఇతర పంటలు తడిచి పోకుండా, పాడై పోకుండా కాపాడుకోవచ్చు. నగరాల లోనే కాదు, గ్రామాలలో కూడా మౌలిక సౌకర్యాలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి.

Tags:    

Similar News