నేతి బీరకాయలో నెయ్యి శాస్త్రం
పార్టీలో తన ఆధిపత్యానికి ఆటంకం, అడ్డు ఉండబోయే వాళ్లందర్నీ కేసీఆర్ పథకం ప్రకారం తొలగించారు.;
నీతి బీరకాయలు నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్టే బి .ఆర్.ఎస్. పార్టీలో సామాజిక న్యాయం జరగడం దుర్లభము. ఆ రాజకీయ పార్టీలో ఉండటానికి అవకాశాలు ఇసుమంత కూడాలేవు. పైకైనా కనబడటానికి అసలే వీలు లేదు. ఆ పార్టీ నిర్మాణం దశలో ఉన్న వాళ్లందర్నీ కరీంనగర్లో మహాసభకు వరంగల్ మహాసభకు మధ్య జరిగిన సభలలో ప్రాథమికంగా ఉన్న నాయకులు కెసిఆర్ అంతా తమకే కావాలనే అనుసరిస్తున్న ముందు జాగ్రత్త చర్యల వలన దూరమైపోయారు. పార్టీలో తన ఆధిపత్యానికి ఆటంకం, అడ్డు ఉండబోయే వాళ్లందర్నీ ఒక పథకం ప్రకారం తొలగించుకుంటూ పోయారు.
2004 ఎన్నికల అనంతరం ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎంతోమంది అర్హత కలిగిన నాయకులు ఉన్నప్పటికీ ఎలాంటి అర్హత లేని తన మేనల్లుడైన హరీష్ రావుకు మంత్రి పదవి అంటగట్టాడు. కెసిఆర్ వ్యూహాలు, కుట్రలు తెలంగాణ నాయకులకు అర్థం కావాల్సి వుండాల్సింది. కానీ ప్రత్యేక తెలంగాణ అనే బలమైన కోరికా ఆశయాల ముందు కెసిఆర్ ఎత్తులు జిత్తులు పసిగట్టినప్పటికీ, తెలంగాణ వచ్చిన తర్వాత అంతా సరి చేయవచ్చులేనని అనుకున్నారు.
తెలంగాణ ఉద్యమం తన చేతుల్లో నుంచి మేధావుల విద్యార్థుల చేతుల్లోకి పోయే అవకాశం కలిగిన ప్రతి దశలో తెలంగాణ పేరున తమ పదవులకు శాసనసభ్యత్వాలకు రాజీనామాలు తెలంగాణ ఆత్మగౌరవం పేరిట చేసి తెలంగాణ ఆత్మగౌరవం పేరిట బై ఎలక్షన్లకు తెరలేపాడు. ఒక్కొక్క ఎలక్షన్లలో ఒక్కొక్కరి కన్నా లెక్కకు మిక్కిలి మంది నాయకులను తన కుటుంబ సభ్యులకు కోసం బలి చేశాడు. పార్టీలో తనకు సమాంతరంగా ఎదిగే అవకాశాలు ఉన్న నాయకులకు పొమ్మన లేక పొగ పెట్టి, బట్ట కాల్చి మీద వేసి ఏవేవో ఆరోపణలు బయటకు పంపించాడు.
" పగలంతా దర్బార్ రాత్రి బార్ నడుస్తుందనే " పక్కా తెలంగాణవాదుల చేత ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దీనికి విరుగుడుగా కెసిఆర్ కొత్త ముందెప్పుడూ తెలంగాణ ఉద్యమంలో వినిపించని మాటలను ఆశ్రయించాడు. అవి "తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో "తల నరక్కుంటా" "చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా రుణం తీరదు" " బీబీ ఔర్ మియా" "మాట తప్పితే రాళ్లతో కొట్టండి" మాటలతో ప్రజలను ఆకట్టుకునే యత్నం చేసాడు. కెసిఆర్ అమరణ నిరాహార దీక్ష చేయడం కోసం సిద్దిపేట రంగధాం పల్లెను వేదికగా ఎన్నుకున్నాడు. కెసిఆర్ ను కరీంనగర్ నుండి సిద్దిపేటకు వెళ్లే క్రమంలో అరెస్టు చేశారు. ఈ పరిణామ క్రమం తర్వాత అదే సభ వేదిక పైన హరీష్ రావు ఒంటిమీద పెట్రోల్ పోసుకొని వీర తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలే శరణ్యం అనే ఒక సంకేతాన్ని యువతరాన్ని రెచ్చగొట్టే విధంగా ఒక ప్రయత్నం చేశాడు. ఈ సంఘటన ప్రతిస్పందనగాయువతరాన్ని ఆత్మహత్యల వైపు పురిగొలిపినట్టు అయింది.
ఇక్కడి నుండి మొదలు తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది యువకుల ఆత్మహత్యలే పరిష్కారం అన్నట్టు కొనసాగాయి .
ఇదే కాలంలో మరోవైపు తెలంగాణలోని ఆంధ్ర పెట్టుబడి దారులు నుండి చందాలు వసూలు చేయడం గేట్ల ముందు ధర్నాలు చేయడం పెచ్చరిల్లిపోయాయి. ఆలె నరేంద్ర సహచరుడైన జగ్గారెడ్డి సంగారెడ్డి శాసనసభ్యుడి ప్రాంతములో ఉన్న పారిశ్రామిక వాడలలో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీల యజమానుల దగ్గర తెలంగాణ పేరున ఒక నాయకుడు, జగ్గారెడ్డికి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదని చందాలు వసూళ్లకు పాల్పడ్డారు . తద్వారా జగ్గారెడ్డిని బలహీనపరచవచ్చు అని కెసిఆర్, మామ అల్లుళ్లు కలిసి కుతంత్రం చేశారు. ఇట్లా తెలంగాణ ఉద్యమ కాలంలోనే టీఆర్ఎస్ పార్టీ చందాల రూపంలో పెద్దమొత్తతంలో సంపదను పోగుచేశారు. అప్పటికే కేసీఆర్ కూతురు కొడుకు కె టి రామారావు అమెరికా నుండి వచ్చారు. రామారావు నేరుగా తెలంగాణ రాజకీయాలలో మెల్ల మెల్లగా కలుగ చేసుకోవడం ప్రారంభించాడు. కవిత తెలంగాణ జాగృతి పేరున ఒక సంస్థను ప్రారంభించి బతుకమ్మ పండుగ పేరున పెద్ద మొత్తంలో నిధులు సేకరించడం మొదలు పెట్టింది. కెసిఆర్ సమీపంలో పని చేస్తూ మరో వ్యక్తి తనకు అంది వచ్చినప్పుడల్లా, అవకాశం దొరికినప్పుడల్లా పెద్ద మొత్తాలను కూడేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కుటుంబ సభ్యుల తతంగాన్ని అధినాయకుడు తెలిసినా తెలియనట్టు,చూసినా చూడనట్టు నటిస్తూ ఏమీ తెలియనట్టు ఊకున్నాడు. అప్పటికి కేసీఆర్ స్వార్థపూరిత ఎత్తుగడలను హార్డ్ కోర్ తెలంగాణ ఉద్యమకారులు ఎందుకో ఏమో కానీ భయంకరమైన మౌనం వహించారు. ఈ ఉదాసీనత మూలంగా తెలంగాణ వచ్చని తరువాత "పెనం మీంచి పొయ్యిలో పడేలా" చేసింది.తెలంగాణా సంపదంతా రోజూ బాతు బంగారు గుడ్డు పెట్టే బాతును ఒకేసారి కోసుకు తిన్నట్టైపోయింది.
కాంగ్రెస్ నాయకురాలు పట్టుదలతో తెలంగాణ సహకారమయింది. నమ్మిన వారిని మట్టేట ముంచే తన సహజ కళా కౌశల్యంతో టిఆర్ఎస్ నాయకుడు 2014 లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మళ్లీ ఏవేవో వాగ్దానాలు చేసి, కల్లబొల్లి మాటలు చెప్పి అధికారాన్ని చేపట్టాడు. అప్పుడు మిషన్ కాకతీయ పేరున చెరువుల పూడికల తీత కార్యక్రమం చేశారు. అంతటితో ఆగక మిషన్ భగీరథ అనే మరో పథకానికి రూపకల్పన చేశారు. ఇది చాలదన్నట్టు కాళేశ్వరం ప్రాజెక్టు పేరున నిండు శాసనసభలో సభా నాయకుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు . పెన్షన్లు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఈ అన్ని కార్యక్రమాలలో లెక్కకు మిక్కిలి ఊహించనంత తెలంగాణ సంపదను ఎవరికి అందినకాడికి వారు కూడాపెట్టుకున్నారు. అంతేగాక పార్టీకి వెయ్యి పైగా కోట్ల నిధిని సేకరించారు. హైదరాబాద్ లోనే కాక ప్రతి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి భవనాలను నిర్మించారు. పార్టీకి ఒక విమానం హెలికాప్టర్ కూడా అందుబాటులో ఉంచుకున్నారు. ఇప్పుడు ఇంత సంపద స్థిర చర ఆస్తుల వనరులను జమ చేసుకున్నాక కెసిఆర్ చూస్తూ చూస్తూ ఆయన వేరే వారికి నాయకత్వం బాధ్యతలు అప్పగించడం ఎటువంటి వంటి పరిస్థితుల్లో జరగే ఆస్కారం ఏమాత్రం లేదు .ఉండదు. కానీ కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం కలిగే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ చరిత్రలో దాఖలాలు అనేకం కనిపిస్తున్నాయి. తప్ప టిఆర్ఎస్ పార్టీలో సామాజిక న్యాయం ముందే చెప్పినట్టు నేతి బీరకాయలో నెయ్యి లేనట్టే టిఆర్ఎస్ పార్టీలో సామాజిక న్యాయం ఉండే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు.