బనకచర్లకు తెలంగాణకు లింకేమిటి?
ఈ ప్రాజెక్టుకు జగన్, మెగా కృష్ణారెడ్డి లకు సంబంధం ఉంటే ఉండవచ్చు గాక కానీ కెసిఆర్ ఏ సంబంధం లేదంటున్నారు శ్రీధర్ దేశ్ పాండే;
-శ్రీధర్ రావు దేశ్పాండే
“గోదావరి – బనకచర్ల మనకొద్దు మానుకోండి” అంటూ మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు, కంభంపాటి పాపారావు, అక్కినేని భవానీ ప్రసాద్, టి. లక్ష్మీనారాయణతో కలసి ఏర్పడిన ఆలోచనాపరుల వేదిక, విజయవాడలో 25.06.2025 న ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది. వారి తరపున ఒక సుధీర్ఘ పత్రికా ప్రకటన విడుదల అయ్యింది. అందులో వారు చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ‘గోదావరి – బనకచర్ల’ లింకు ప్రాజెక్టును వ్యతిరేకిస్తూనే గోదావరి, కృష్ణా నదీ జలాలలో తెలంగాణ హక్కులకు సంబంధించి అవాస్తవాలు చెప్పడమే కాదు అవగాహనారాహిత్యంతో, అధ్యయనలేమితో కొన్ని వక్రీకరణలు కూడా చేసినారు. వాటిని పూర్వపక్షం చేయడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.
1) పోలవరం – బనకచర్ల అనే ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనగా ముందుకు వచ్చినప్పటికీ వాస్తవానికి కేసీఆర్ – జగన్ – మెగా కృష్ణారెడ్డి బుర్రల్లో పుట్టింది.
ఈ ప్రాజెక్టుకు జగన్, మెగా కృష్ణారెడ్డి లకు సంబంధం ఉంటే ఉండవచ్చు గాక కానీ కెసిఆర్ ఏ సంబంధం లేదు. 2019 లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇంజనీర్లు పాల్గొన్న సమావేశాల్లో ప్రతిపాదనలు ఇవి. గోదావరి జలాలను రెండు రాష్ట్రాల ప్రయోజనం కోసం తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు రూపోందించిన కృష్ణా నదీ మార్గం ద్వారా అంటే .. పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజికి, అక్కడ నుంచి ఎగువన వైకుంఠాపురం బ్యారేజీకి, అక్కడ నుంచి పులిచింతల జలాశయానికి, అక్కడ నుంచి నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ కు, అక్కడ నుంచి ఇది వరకే ఏర్పాటు అయి ఉన్న రివర్సిబుల్ పంపింగ్ వ్యవస్థ ద్వారా నాగార్జునసాగర్ జలాశయానికి, అక్కడ నుండి ఇది వరకే ఏర్పాటు అయి ఉన్న రివర్సిబుల్ పంపింగ్ వ్యవస్థ ద్వారా శ్రీశైలం జలాశయానికి గోదావరి నీటిని తరలించాలన్నది కెసిఆర్ ఆలోచన.
ఈ స్కీమ్ నే కెసిఆర్ జగన్ గారి ముందు ఉంచారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించడానికి గోదావరి నదీ మార్గాన్ని ఉపయోగించి సఫలం చేసినట్టుగానే కృష్ణాలో కూడా ఆ ప్రయోగం సఫలం చేయగలమన్న విశ్వాసంతోనే ఆయనకు ఈ స్కీమ్ ను ప్రతిపాదించినారు. దీనిపై అధ్యయనం చేసి మరొక సమావేశంలో తమ అభిప్రాయం చెపుతామని అన్నారు. కానీ ఆయన స్పందించలేదు, ఆయన తరపున ఆంధ్రా ఇంజనీర్లు కూడా చర్చలకు రాలేదు. కృష్ణా జలాలను తెలంగాణకు ధారాదత్తం చేస్తున్నాడు అని చంద్రబాబు చేసిన విమర్శలకు జడిసి కొన్ని నెలల తర్వాత జగన్ అసెంబ్లీలో తమ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ భూభాగంలో నుంచే గోదావరి జలాలను తరలించడానికి “గోదావరి – పెన్నా లింకు” ప్రాజెక్టును చేపడుతున్నామని ఏకపక్షంగా ప్రకటించారు. దీనితో పాటు శ్రీశైలం జలాశయం 798 మీటర్ల లోతు నుంచి రోజుకు 3 టిఎంసిలు ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రకటించినాడు.
జగన్ ప్రకటించిన “గోదావరి – పెన్నా లింకు” ప్రాజెక్టుకు కెసిఆర్ ప్రతిపాదించిన నదీ మార్గం స్కీమ్ కు ఏ పొలికా లేదు. గోదావరి-పెన్నాలింకు ప్రాజెక్టు నివేదికను తయారు చేయమని జగన్ ప్రభుత్వం వాప్కోస్ ను కోరింది. జగన్ పాలనా కాలంలో ఈ స్కీమ్ ముందుకు సాగలేదు. ఆయన దృష్టి అంతా శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకం పైననే ఉండింది. ఏకపక్షంగా ప్రాజెక్టులను ప్రకటించిన తర్వాత జగన్ ప్రభుత్వంతో కెసిఆర్ ప్రభుత్వం సంప్రదింపులు ఆగిపోయినాయి. ఇదీ వాస్తవం అయితే ఆలోచనాపరుల వేదిక గోదావరి-పెన్నా లింకు ప్రాజెక్టుకు కెసిఆర్ కు ఆపాదించడం శోచనీయం.
2) రాష్ట్రం విడిపోక ముందు ఇందులో 512 టీఎంసి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు, 299 టీఎంసి తెలంగాణాలో ఉన్న ప్రాజెక్టులకు వినియోగంలో ఉండేవి. విభజన తర్వాత, ప్రాజెక్టుల వారిగా కేటాయింపులు ఉన్న ఆ జాబితాను మొదటి అపెక్స్ కౌన్సిల్ (కేంద్ర జలశక్తి మంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రుల) సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. నాటి ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు మరియు కేసీఆర్ మినిట్స్ పై సంతకాలు చేశారు. కానీ, తర్వాత కాలంలో దాన్ని తాత్కాలిక ఒప్పందమని కేసీఆర్ వక్రీకరించే ప్రయత్నం చేస్తూ వచ్చారు.
ఇది పూర్తిగా అబద్దం. వారికి వాస్తవాలు తెలియక ఈ రకంగా వక్రీకరిస్తున్నారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా కృష్ణా జలాల వినియోగం కోసం రెండు రాష్ట్రాల మధ్య ఒక తాత్కాలిక ఒప్పందం జూన్ 2015 లో జరిగిన మాట వాస్తవమే. ఇది నీటి వినియోగానికి సంబంధించిన తాత్కాలిక ఒప్పందమే తప్ప రెండు రాష్ట్రాల మధ్య శాశ్వత నీటి పంపిణీ ఒప్పందం కాదు. ఆ పని చేసేది కృష్ణా ట్రిబ్యునల్. అది కూడా ఒక సంవత్సరానికి (2015-16) ఏర్పాటు చేసుకున్న temporary working arrangement అని సమావేశం మినిట్స్ లోనే స్పష్టంగా నమోదు అయ్యింది. ఇందులో రెండు రాష్ట్రాల అధికారులు మాత్రమే పాల్గొన్నారు తప్ప ముఖ్యమంత్రులు కాదు. ఆలోచనాపరుల వేదికలో అందరూ పెద్ద మనుషులే. వారి చిత్తశుద్దిని శంకించే పని చేయలేను కానీ వారు ఆ ఒప్పందం మినిట్స్ ను చదివి ఉంటే ఈ రకంగా వ్యాఖ్యానించి ఉండేవారు కాదు. ఆ తర్వాత 2016 లో జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మరొక సంవత్సరానికి (2016-17) పొడిగించారు. 2018 నుంచి ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా తాత్కాలికంగా రెండు రాష్ట్రాల మధ్య 50:50 నిష్పత్తిలోనే నీటి వినియోగం జరగాలని తెలంగాణ రాష్ట్రం పట్టుబడుతూనే ఉన్నది. కృష్ణా రివర్ బోర్డుకు, కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాస్తూనే ఉన్నది. బోర్డు సమావేశాల్లో పోరాటం చేస్తూనే ఉన్నది. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు 763 టిఎంసిల నీటిని కేటాయించమని డిమాండ్ పెట్టింది. 299:512 నిష్పత్తిని తెలంగాణ ఈ పదేళ్ళలో ఏనాడూ అంగీకరించలేదు.
3) : గోదావరి జలాలపై ట్రిబ్యునల్ అవార్డు మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 1480 టీఎంసి వచ్చాయి. వీటి వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విస్పష్టమైన విభజన లేదు. ఆంధ్ర, తెలంగాణల మధ్య తలెత్తిన ఈ సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కరించుకోవాల్సి ఉంది.
ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ మేజర్, మీడియం ప్రాజెక్టులకు, చిన్న నీటి వనరులకు 1480 టిఎంసిలలో 968 టిఎంసి ల నీటిని కేటాయించడం జరిగిన సంగతి ఆలోచనాపరుల వేదిక సభ్యులకు తెలియదు. 2014 ఫిబ్రవరిలో రాష్ట్ర విభజన బిల్లు చర్చ కోసం అసెంబ్లీకి వచ్చినప్పుడు ఈ సమాచారాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వమే అధికారికంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్ర శాసన సభ్యులకు అందించింది. ఈ సంగతి ఆనాడు కూకట్ పల్లి నుంచి శాసన సభకు ఎన్నికైన జయప్రకాశ్ నారాయణ గారికి తెలుసు. సమాచారం అందించమని ముఖ్యమంత్రికి లేఖ రాసిన వారిలో అతనూ ఒకరు. కేంద్ర జల సంఘం కూడా తెలంగాణ సమర్పించిన ప్రాజెక్టుల డిపిఆర్ లకు ఆమోదం తెలుపుతూనే ఉన్నది. ఇప్పటివరకు 968 టిఎంసిలో 946 టిఎంసిలకు కేంద్ర జల సంఘం హైడ్రాలజీ అనుమతులు జారీ చేసి ఉన్నారు.
కాబట్టి ఈ అంశంలో ఆలోచనాపరుల వేదిక చేసిన వ్యాఖ్యానం సత్య దూరం. కేంద్ర జల సంఘం గేజ్ రీడింగ్స్ ప్రకారం 1480 టిఎంసిల నికర జలాలకు అదనంగా గోదావరిలో ఏటా సగటున 3 వేల టిఎంసిల నీరు సముద్రంలో కలుస్తున్నది. ఈ నీటిపై తెలంగాణకు కూడా హక్కు ఉన్నది. నికర జలాల నిష్పత్తిలోనే 3 వేల టిఎంసిల వరద జలాల్లో 1950 టిఎంసిలు వినియోగించుకుంటామని, ఈ అంశం 2020 అక్టోబర్ లో జరిగిన రెండవ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చ జరగాలని కెసిఆర్ కేంద్ర జల్ శక్తి మంత్రికి లేఖ రాసినారు. ఇప్పుడు పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు చేపట్టే ముందే గోదావరి వరద జలాల హక్కులపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరగాలని తెలంగాణ డిమాండ్ చేస్తున్నది. ఆలోచనాపరుల వేదిక ఈ అంశాన్ని గమనించాలి.
4) 2019 ఎన్నికల తర్వాత కెసిఆర్ – జగన్ లు భాయి భాయి అనుకుంటూ ఉన్నప్పుడు కెసిఆర్ ఒక ప్రతిపాదన చేశారు. అదేమంటే ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలని ఎత్తి, తెలంగాణ గుండా పారించి, నాగార్జున సాగర్లో కలపాలని, సాగర్ నుంచి రివర్సిబుల్ టర్బైన్ల ద్వారా శ్రీశైలంలోకి ఎత్తి పోయాలని, అలా పోసి రాయలసీమకు వాడుకోవాలని, ఖర్చు చెరి సగం భరించాలని, అప్పుడు కృష్ణ నీళ్లు తెలంగాణకు ఇచ్చేయాలనేది ఆ ప్రతిపాదన.
ఈ ప్రతిపాదన కూడా ఆంధ్రా ఇంజనీర్లు తయారుచేసి సమావేశంలో చర్చకు పెట్టారు తప్ప కెసిఆర్ లేదా తెలంగాణ ఇంజనీర్ల ప్రతిపాదన కాదు. ఇందులో ఇచ్ఛంపల్లి నుంచి నాగార్జునసాగర్ కు కాలువ ద్వారానో, పైప్ లైన్ ద్వారానో గోదావరి నీటిని తరలించాలంటే సుమారు 350 కిలోమీటర్ల పొడవునా తెలంగాణలో వేలాది ఎకరాల భూసేకరణ జరపాల్సి ఉంటుంది. అది ఖర్చుతో కూడుకున్నదే కాకుండా దాదాపు అసాధ్యం అని తెలంగాణ బృందం ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. కెసిఆర్ సహా తెలంగాణ బృందం ప్రతిపాదించిన స్కీమ్ పైన వివరించిన నదీ మార్గం స్కీమ్ మాత్రమే. వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టమున్నట్టు తప్పుడు ప్రతిపాదనలు కెసిఆర్ కు ఆపాదించడం ఆలోచనాపరుల వేదికకు తగదు.
5) పోలవరం – బనకచర్ల వలన రాయలసీమ ప్రాజెక్టులకు ఇప్పుడు కృష్ణా జలాల్లో ఉన్న హక్కులు కోల్పోతాము.
రాయలసీమ, తెలంగాణ ప్రాజెక్టులు (ఎస్ ఆర్ బి సి, భీమా తప్ప) అన్నీ ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా వరద జలాల ఆధారంగా రూపొందించి నిర్మించినవే తప్ప నికర జలాలు ఉన్న ప్రాజెక్టులు కావు. వీటికి ఏ ట్రిబ్యునల్ ద్వారా నీటి కేటాయింపులు లేవు. బేసిన్లో చివరి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వరద జలాలను వినియోగించుకోవడానికి బచావత్ ట్రిబ్యునల్ కల్పించిన స్వేచ్ఛ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా రద్దు అయ్యింది. బ్రిజేష్ ట్రిబ్యునల్ వరద జలాలను కూడా 65 % కింద , 50 % కింద విభజించి మూడు రాష్ట్రాలకు కేటాయింపులు చేసింది. అట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయింపులు 811 టిఎంసిల నుంచి 1004 టిఎంసిలకు పెరిగింది. ఈ నీటిని ఇప్పుడు బ్రిజేష్ కుమార్ రెండు రాష్ట్రాలకు పునర్ పంపిణీ చేయవలసి ఉన్నది. అందులో తెలంగాణ తన న్యాయబద్దమైన వాటాగా 763 టిఎంసిలని కేటాయించమని ట్రిబ్యునల్ కు నివేదించింది. ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా ఉమ్మడి రాష్ట్రం వరద జలాల మీద రూపకల్పన చేసిన రాయలసీమ, తెలంగాణ ప్రాజెక్టులకు ఏ హక్కులు లేవు, ఉండవు. విభజన చట్టం షెడ్యూల్ 11 లో పేర్కొన్నంత మాత్రాన హక్కులు దఖలు పడవు. ట్రిబ్యునల్ తీర్పే అంతిమం.
ప్రస్తుతానికి పోతిరెడ్డిపాడు ద్వారా హక్కుగా తరలించే నీరు 34 టిఎంసిలు (ఎస్ ఆర్ బి సి -15 టిఎంసిలు, చెన్నైకి తాగునీరు -15 టిఎంసిలు) మాత్రమే. మిగతావి వరద జలాల ఆధారంగా నిర్మించినవి కాబట్టి వాటికి శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు పొంగి పొర్లుతున్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నీటిని తరలించాలి.
6) తెలంగాణా రాజకీయ పార్టీలు, ప్రభుత్వము, విశ్రాంత ఇంజినీర్ల సంఘమూ చేస్తున్న హడావుడి అంతా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, దీన్ని బూచిగా చూపించి కృష్ణ జలాల్లో ఆంధ్రప్రదేశ్ వాటా తగ్గించి తెలంగాణాకు మళ్ళించుకోవాలనే దురాశ తప్ప మరేమీ కాదు.
ఈ దారుణమైన అభియోగాన్ని ఆలోచనాపరుల వేదిక ఉపసంహరించుకోవాలి. తెలంగాణ ఇంజనీర్లు చట్టం పరిధిలోనే, గోదావరి, కృష్ణా అవార్డుల పరిధిలోనే మాట్లాడుతున్నారు. గోదావరి, కృష్ణా అవార్డుల పట్ల అవగాహన లేనిది ఆలోచనాపరులకే. మొదట గోదావరి అవార్డులో Annexure C, Clause 7 (a) & (f), కృష్ణా అవార్డులో క్లాజ్ 14(B) చదవాలని ఆలోచనాపరులను వినమ్రంగా కోరుతున్నాను. ఏ పేరామీటర్ల ప్రకారం చూసినా కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా పెరగాల్సిందే. కృష్ణాలో లోటు ఉంది. పైగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వస్తే కర్ణాటకలో ఆల్మట్టి డ్యాం ఎత్తు 519 నుంచి 524 మీటర్లకు పెరుగుతుంది. ఇప్పుడున్న130 టిఎంసిలకు బదులు 250 టిఎంసిలు అక్కడ ఆగిపోతాయి. కృష్ణా ఇప్పుడున్న లోటు మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉన్నది. కాబట్టే భవిష్యత్ లో ఈ లోటును తీర్చడానికి గోదావరి జలాలను కృష్ణా బేసిన్ వ్యవస్థలోకి మళ్లించుకోవాలని తెలంగాణ ఇంజనీర్లు, కెసిఆర్ రెండు రాష్ట్రాలకు ప్రయోజనకారిగా ఉండే స్కీమ్ ను రూపకల్పన చేసినారు. ఇందులో ఖర్చు తక్కువ, భూసేకరణ తక్కువ, మూడు పెద్ద జలాశయాలు.. పులిచింతల (45 టిఎంసి), నాగార్జునసాగర్(315 టిఎంసి), శ్రీశైలం(215 టిఎంసి) ఇదివరకే నిర్మాణం అయి అందుబాటులో ఉన్న కారణంగా బొల్లపల్లి (150 టిఎంసి) లాంటి పెద్ద జలాశయం నిర్మించే అవసరం రాదు. కాబట్టి ముంపు, పునరావాసం అసలే లేదు, కృష్ణా నది సజీవం అవుతుంది, భూగర్భజలాలు పెరుగుతాయి, దేశీయ నౌకాయానం, పర్యాటక, మత్స్య రంగాలు అభివృద్ది చెందుతాయి. రెండు రాష్ట్రాలు గోదావరి అదనపు జలాలను తమకు ఇష్టమైన రీతిలో వినియోగించుకునే అవకాశం ఉన్నది.
ఇన్ని ప్రయోజనాలు ఉన్న ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించాలని తెలంగాణ సమాజం కోరుతున్నది. పోలవరం-బనకచర్ల ప్రతిపాదనలను ఆంధ్రా ఆలోచనాపరులు కూడా వ్యతిరేకిస్తున్నారు కనుక రెండు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చే తెలంగాణ ఇంజనీర్లు ప్రతిపాదించిన కృష్ణా నదీ మార్గం స్కీమ్ ను అధ్యయనం చేయాలని కోరుతున్నాను.