తెలంగాణ స్కూళ్లని ప్రజలు నమ్మేలా బాగుచేయండి...

గ్రామాలు ప్రైవేటు స్కూళ్ల కంట్రోల్లోకి వెళ్లిపోతున్నాయి;

Update: 2025-05-29 12:20 GMT
source: cry.org

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల విషయంపై ఆచరణకు ప్రాధాన్యతలు నిర్ణయించుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నది. ఈ ప్రభుత్వ పాలనా తీరు చూస్తుంటే, మెల్ల మెల్లగా ప్రజా పాలన కాస్తా, ధనవంతుల, కాంట్రాక్టర్ల పాలన క్రిందికి మారిపోయినట్లు కనిపిస్తున్నది.

వృద్ధ, వితంతు, వికలాంగ మహిళలకు ఆసరా పెన్షన్ లు ఇవ్వడానికి , రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల మహిళలకు జీవో 194 ప్రకారం నష్ట పరిహారం చెల్లించడానికి, అర్హులైన మహిళలకు మహాలక్ష్మీ పథకం క్రింద నెలకు 2500 రూపాయల ఆర్ధిక సహాయం అందించడానికి నిధులు లేవని చేతులెత్తేసే రాష్ట్ర ప్రభుత్వం, అట్టహాసంగా ప్రపంచ అందాల పోటీలను మాత్రం నిర్వహించడానికి మాత్రం కోట్లు ఖర్చు పెడుతున్నది.

హామీ ఇచ్చిన విధంగా తెలంగాణ విద్యా రంగానికి 15 శాతం నిధులు కేటాయించడానికి, ఇప్పటికే ఉనికిలో ఉన్న ప్రభుత్వ స్కూల్స్ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించడానికి సిద్దపడని రాష్ట్ర ప్రభుత్వం, అదే విద్యా శాఖ ద్వారా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (YIIRS) పేరుతో 20 అసెంబ్లీ నియోజకవర్గాలలో 20 కొత్త స్కూల్స్ నిర్మాణం చేయడానికి మాత్రం ఒక్కో స్కూల్ కు 200 కోట్ల చొప్పున 4000 కోట్లు కేటాయిస్తూ మే 27 న జీవో ఆర్టీ నంబర్ 96 ను విడుదల చేసింది.

ఇవాల్టి పరిస్థితులలో ఇది పూర్తిగా అర్థం లేని పని. ఒక్కో స్కూల్ కు కనీసం కోటి రూపాయలు లేదా కనీసం 50 లక్షలు బడ్జెట్ కేటాయించినా అనేక స్కూల్స్ బాగుపడతాయి. బోధన ,బోధనేతర సిబ్బందిని పూర్తిగా నియామిస్తే, స్కూల్స్ పర్యవేక్షణ సరిగా చేస్తే, ఉపాధ్యాయులకు సరైన శిక్షణ ఇస్తే, చాలా వరకూ పరిస్థితులు మెరుగు పడతాయి. ప్రభుత్వ స్కూల్స్ బలోపేతమవుతాయి.

కానీ ఆ పని చేయడానికి సిద్దం కాకుండా, ప్రభుత్వం ఒక్కో స్కూల్ నిర్మాణానికి 200 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించడం అర్థం లేని పని. ఈ స్కూల్స్ లో విద్యార్ధులు ఎవరు ? ఎక్కడి నుండీ వస్తారు ? ఒక్కో స్కూల్ కు ఎందు కింత బడ్జెట్ అవసరమవుతుంది ? ఈ స్కూల్స్ నిజంగా రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా రంగ సమస్యలను పరిష్కరిస్తాయా ? ఈ ప్రశ్నలకు వేటికీ జవాబు ఇవ్వగలిగిన అధికారులు కానీ, మార్గ దర్శకాలు కానీ, వివరమైన జీవోలు కానీ ఏమీ లేకుండా 20 స్కూల్స్ కు 4000 కోట్ల నిధులు కేటాయించడం అంటే, ఈ నిధులు కాంట్రాక్టర్ల, రాజకీయ నాయకుల,అధికారుల జేబులు నింపడానికే అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది . పైగా ఒక్కో స్కూల్ 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుజండాని చెప్పడం చూస్తే, దళితుల చేతుల్లో ఉన్న అసనీడ భూములను అతి తక్కువ పరిహారం చెల్లించి, గుంజుకునే ఆలోచన ప్రభుత్వానికి ఉందా అనే అనుమానం కలుగుతున్నది.

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో పాఠశాల విద్య గత కొన్ని దశాబ్దాలుగా ప్రజల విశ్వాసం పొందలేక, సంవత్సరం వారీగా మూత పడుతున్న బడుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మూత బడిన బడులను తెరిపించాలనే ఆలోచన గానీ, ప్రణాళిక గానీ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ప్రజలు కూడా తమ గ్రామంలో దశాబ్దాల క్రితం ప్రారంభించిన బడి మూతబడితే పట్టించుకోని పరిస్థితి ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలు తమ పిల్లల్ని గ్రామాల నుండీ వాహనాల ద్వారా ప్రైవేట్ స్కూళ్లకు పంపుతున్నారు.

2023-24 లో మొత్తం ప్రభుత్వ బడులు 28,856 (70.5%) కాగా, నమోదైన విద్యార్థులు 19,40,964 (39%) మంది. రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 4235 (23%). 50 మంది లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు 13,930 (76%). ఇదే సమయంలో మొత్తం ప్రైవేట్ బడులు 12,022.(29.4%) కాగా, ఇందులో నమోదైన విద్యార్థులు. 36,35,898( 61%) మంది.

ప్రభుత్వం ప్రభుత్వ బడుల అభివృద్ధి కోసం కృషి చేయకుండా, ప్రజలు తమ గ్రామంలో ఉన్న బడిని కాపాడుకోవడానికి తగిన చొరవ చూపకుండా ఉంటే, భవిష్యత్తులో ప్రభుత్వ రంగంలో పాఠశాల విద్య కనుమరుగవుతుంది.

ప్రభుత్వ బడిలో పిల్లలు తక్కువ నమోదు కావడానికి కారణమేమిటి ? ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం లేకపోవడమా ? స్కూల్స్ లో పూర్తి వసతులు లేకపోవడమా? ఉపాధ్యాయ ఖాళీలను నింపక పోవడమా ? ఉపాధ్యాయుల బోధన సృజనాత్మకంగా లేక పోవడమా ? వారిలో జవాబుదారీ తనం లేకపోవడమా ? వర్తమాన కాల పరిస్థితులను అనుకూలంగా సిలబస్ రూపుదిద్దు లేకపోవడమా..?ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్షీషు మీడియం లేకపోవడమా ? ప్రభుత్వ బడిలో చదివితే పిల్లలకు చదువు రాదనే అభిప్రాయమా ? విద్యా రంగానికి తగిన బడ్జెట్ కేటాయింపులు లేకపోవడమా ? తల్లిదండ్రులలో ప్రభుత్వ స్కూల్ విద్య పట్ల విముఖత కలగడానికి కారణాలు ఏమిటి ?

ఈ అంశాలను చర్చించడానికి తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TPJAC) మే 27 న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశానికి TPJAC కో కన్వీనర్ లు మైసా శ్రీనివాస్, కన్నెగంటి రవి అధ్యక్షత వహించగా, సమావేశంలో TPJAC కన్వీనర్ ప్రొఫెసర్ హర గోపాల్ , శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ ఎం. కోదండ రామ్, MV ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్. వెంకట రెడ్డి, తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షులు అంబటి నాగయ్య , డాక్టర్ వనమాల, TPJAC, ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు బి. కొండల్ రెడ్డి, కె. వేణు గోపాల్ , వై. అశోక్ కుమార్ , రవి చంద్ర ప్రసంగించారు.

ఇంకా ఈ సమావేశంలో ఈ క్రింది ఉపాధ్యాయ సంఘాల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు. TPTF నాయకులు రవీందర్, STU నాయకులు పర్వత రెడ్డి, ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ కమిటీ నాయకులు ఎడమ శ్రీనివాస్ రెడ్డి , తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (TDF) నాయకులు డాక్టర్ శివారెడ్డి, టీచర్స్ ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ , తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల సంఘం (CRPF), ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ (AIPA), మదర్స్ అసోసియేషన్ (అమ్మల సంఘం), రెసిడెన్షియల్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ గద్వాల జిల్లా స్కూల్ ఎడ్యుకేషన్ సంరక్షణ కమిటీ , TSMS ప్రతిధులు చర్చలో పాల్గొన్నారు.

సమావేశం ఈ క్రింది నిర్ధిష్ట డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది.

1. రాష్ట్రంలో ముందుగా అధిక సంఖ్యలో విద్యార్థులున్న పాఠశాలలను గుర్తించి వాటికి కావలసిన అన్ని ఏర్పాట్లను చేయాలి. మౌలిక వసతుల కల్పన,బోధన, బోధనేతర సిబ్బంది నియామకం వెంటనే జరగాలి.

2. విద్యార్ధులలో అభ్యాసనా సామర్ధ్యాలు పెంచాలి: ప్రభుత్వ పాఠశాలలో నమోదు తగ్గిన మాట వాస్తవమే అయినా, ఉన్న విద్యార్థులకు విద్యా సామర్ధ్యాలు పెంచడానికి ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, విద్యార్ధులందరికీ తరగతి వారీ సామర్ధ్యాలను అందించాలి. కనీసం పైన గుర్తించిన పాఠశాలలో నైనా ఈ పని మొదలు పెట్టాలి.

3. రాష్ట్ర విద్యా హక్కు చట్టం రూపొందించాలి: తెలంగాణ రాష్ట్రం సమగ్ర విద్యా విధానంలో పూర్వ ప్రాధమిక విద్య (3 నుండి 5 సంవత్సరాలు వయసు పిల్లలు), పాఠశాల విద్య (6నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలు), ఇంటర్ విద్య (15 నుండి 18 సంవత్సరాల పిల్లలు) ను పాఠశాల విద్యగా పరిగణించాలి. అంటే రాష్ట్రంలోని 3 నుండి 18 సంవత్సరాల వయసు గల పిల్లలందరికి పూర్వ ప్రాధమిక స్థాయి నుండి పన్నెండవ తరగతి వరకు విద్యా హక్కును అందించడానికి రాష్ట్రంలో కొత్త చట్టాన్ని రూపొందించాలి.

4. కేజీ నుండి పన్నెండవ తరగతి వరకు రాష్ట్రంలో ఉన్న ఉన్నత పాఠశాలలను (హైస్కూల్ ) తీర్చిదిద్దాలి: మొదటి దశలో రాష్ట్రంలో అధిక సంఖ్యలో విద్యార్థులు నమోదయిన ఉన్నత పాఠశాలలను కేంద్రీయ విద్యాలయాల నమూనాలో తీర్చి దిద్దాలి. అప్పుడు కేజి నుండి పన్నెండవ తరగతి వరకు ఒకే పాఠశాలో పిల్లలు చదువుకునే అవకాశం దొరుకుంది. అవసరమైతే దగ్గర లోని గ్రామాలకు ఉచిత రవాణా సౌకర్యాలు కల్పించాలి. స్కూల్ లో విద్యార్ధుల నమోదు పెరిగే కొద్ది ఇతర పాఠశాలలను కూడా ఈ నమూనా లోకి తేవాలి .

5. పిల్లల జనాభా ఆధారంగా విద్యా వ్యవస్థ ఉండాలి: బడిలో నమోదు అయిన పిల్లలను బట్టి టీచర్ల నియామకాలు చేస్తున్న ప్రస్తుత విధానం కాకుండా గ్రామంలో , బస్తీలో పిల్లల జనాభాను బట్టి పాఠశాలలను ఏర్పాటు చేయాలి.

6. పూర్వ ప్రాధమిక విద్య: ఈ వయసులో పూర్వ ప్రాధమిక విద్య అవసరం అని ప్రపంచ వ్యాప్త నివేదికలు చెపుతున్న సత్యం. ప్రతి బడిలో పూర్వ ప్రాధమిక సెక్షన్ల ను ఏర్పాటు చేయాలి. వాటికి శిక్షణ పొందిన టీచర్లను నియమించాలి.

7. విద్యార్ధులకు నాణ్యమైన విద్యకు గ్యారంటీ ఇవ్వాలి: రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు అన్ని రాష్ట్రాలతో పోలిస్తే చాలా వెనుక బడి ఉన్నాయి. ప్రతి పాఠశాల విద్యార్థులకు తరగతి వారీ విద్యా సామర్ధ్యాలు అందిస్తామని గ్యారంటీ నివ్వాలి. ప్రతి నెలా రాష్ట్ర, జిల్లా, మండల మరియు క్లస్టర్ స్థాయిలో కేవలం నాణ్యమైన విద్య పురోగతి మీదనే సమీక్ష నిర్వహించే విధానాన్ని రూపొందించాలి.

8. పట్టణీకరణ- విద్య: రాష్ట్రంలో దాదాపు 40 శాతం జనాభా పట్టణాలలో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంత విద్యార్థుల అవసరాలు భిన్నంగా ఉంటున్నాయి. ముఖ్యంగా వలస కుటుంబాల పిల్లలు (ఇతర రాష్ట్రాల పిల్లలు కూడా) కూడా అధికం గానే ఉంటున్నారు. పట్టణ ప్రాంతంలో వార్డును ఒక యూనిట్ గా తీసుకొని అక్కడి పిల్లల జనాభాను బట్టి పాఠశాలలను అందుబాటులోకి తేవాలి.

9. మండలం ఒక యూనిట్ గా విద్యాప్రణాళిక: జిల్లా, జిల్లాకు మండల, మండలానికి విద్యా అవసరాలు వేరే విధంగా ఉంటాయి. కావున ప్రణాళికలు రూపొందించే సమయంలో మండలం లేదా పట్టణ వార్డు ఒక యూనిట్ గా తీసుకుని అవసరమయిన ప్రణాళికలు వేయాలి.

10. పాఠశాల విద్య బలోపేతానికి వికేంద్రీకరణ: విద్యారంగాన్ని పటిష్టం చేయాలంటే స్థానిక ప్రభుత్వాల భాగస్వామ్యాన్ని పెంచాలి.

11. తల్లిదండ్రుల భాగస్వామ్యం: విద్యా హక్కు చట్టం తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పాఠశాల యాజమాన్య కమిటీల రూపంలో పొందు పరిచింది. మన రాష్ట్రంలో గత మూడు సంవత్సరాలుగా ఈ కమిటీలు ఏర్పాటు కాలేదు. వెంటనే పాఠశాల విద్యా యాజమాన్య కమిటీ (SMC) లను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి.

12. ప్రైవేట్ విద్య : రాష్ట్రంలో ప్రైవేటు విద్యను విస్మరించలేము. ప్రైవేటు విద్యా సంస్థలలో ఫీజు దోపిడీ విపరీతంగా ఉందని తల్లిదండ్రులు ఆవేదనలో ఉన్నారు. అక్కడ పిల్లలకు విద్యా సామర్థ్యాలు అందించడంలో కూడా మెరుగైన పరిస్థితి లేదని పలు నివేదికలు తెలియ చేస్తున్నాయి. ప్రైవేటు విద్యను నియంత్రించడానికి స్వయంప్రతిపత్తి గల కమిషన్ ను ఏర్పాటు వేయాలి.

13. రెసిడెన్షియల్ స్కూల్స్: కొన్ని సామాజిక వర్గాలలో అత్యధికంగా ఉన్న నిరక్షరాస్యత వాతావరణం నుండి, దళిత బహుజనుల పిల్లలకు చదువెందుకు అనే ఆధిపత్య కులాల, వర్గాల భావజాలాన్ని ఎదుర్కోవడానికి,ఆయా సమూహాలలో ఉన్న పిల్లలను బడి వాతావరణానికి తీసుకురావడానికి వచ్చిన పాఠశాలలు ఇవి. ఈ ఆలోచనను మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. కాకపోతే, గురుకుల పాఠశాలలు రాష్ట్రంలోని పిల్లలందరికి విద్యను అందించే సామర్ధ్యం కలిగి ఉండవు. ఇవి పాఠశాల విద్యకు ప్రత్యామ్నాయం కాకూడదు. అయినా రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల గురుకుల పాఠశాలల్లో బోధన, భోదనేతర సిబ్బందిని నియమించకపోవడం, మౌలిక వసుతులు, సదుపాయాల పట్ల నిర్లక్ష్యం కొనసాగుతున్నది. అద్దె భవనాలలో నడిచే గురుకులాలలో మరిన్నిసమస్యలు ఉన్నాయి.

మొదటి తరం చదువుకు కదిలిన పిల్లలకు, తల్లి దండ్రులు లేని పిల్లలకు , సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలకు , అన్ని విధాలా నిర్లక్ష్యానికి గురి అయిన పిల్లలకు, వలస కార్మికుల పిల్లలకు, బాల కార్మిక వ్యవస్థ నుండి విముక్తి అయిన పిల్లలకు - ఇవి ఇప్పటికీ అవసరమే. ఇటువంటి నేపధ్యం ఉన్న కోసం గురు కులాలు నిర్వహించాలి.

14. ఏకోపాధ్యాయ పాఠశాలలు: (Single teachers schools): రాష్ట్రంలో 5895 పాఠశాలలలో ఒకే టీచర్ ఉన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం కనీసం ప్రతి పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి. ప్రస్తుతం తెలంగాణ లో చట్ట ఉల్లంఘన జరుగుతున్నది. ఈ పాఠశాలల్లో 88,429 విద్యార్థులు నమోదై ఉన్నట్లు 2023-24 UDISE+ గణాంకాల ద్వారా తెలుస్తుంది. ఈ ఒకే టీచర్ తో ఈ పాఠశాలల్లో నమోదైన విద్యార్థులకు బోధన జరగడం కష్టమైన పని.

15. బడ్జెట్: రాష్ట్ర బడ్జెట్ లో విద్యా రంగానికి 20 శాతం నిధులను కేటాయించాలి.

మరో నెల రోజులలో విద్యా రంగ సమస్యలను మరింత లోతుగా అధ్యయనం చేసి , రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాల ప్రతినిధులతో ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఈ డిమాండ్లను మరింత నిర్ధిష్టంగా ప్రభుత్వం ముందుకు తీసుకు వెళ్లాలని, ప్రభుత్వ రంగంలో విద్యా పరిరక్షణ కోసం ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించాలని సమావేశం నిర్ణయించింది.

Tags:    

Similar News