కూట్లె రాయితీయలేనోళ్లు ఏట్లె రాయి తీస్తారా?
తెలంగాణలో కెసిఆర్ పామిలీ డ్రామా రక్తి కడుతున్నదని అంటున్నారు రచయిత జూకంటి జగన్నాథం;
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ రాష్ట్ర సమితి నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోవైపు హరీష్ రావు అందరూ కుటుంబ సభ్యులే వీళ్లు అసెంబ్లీ సమావేశాలు పెట్టండి అని సమస్యల పైన చర్చిస్తామని డిమాండ్ చేయాలి కానీ కూట్లె రాయి తీయనోళ్లు ఏట్లె రాయి తీస్తరా అన్నట్టు సిగాలు పోతూ ఏ వేదిక మీద చర్చిస్తామంటే ఆ వేదిక (చట్టసభలో తప్ప) ఎక్కడైనా ఎప్పుడైనా చర్చిస్తామం అంటూ మరక మంచిదే అన్నట్టు ఇసుమంత కూడా మచ్చ లేని మశ్ఛర్ పహిల్బాన్ లా బస్తీమే సవాల్ చేస్తుంటారు.
మరోవైపు గతంలో ఒక టర్మ్ నీళ్ల మంత్రిగా మరో టర్మ్ ఆర్థిక మంత్రిగా గాలకు తెలంగాణకు అనన్యమైన సేవ చేసిన వెలగబెట్టిన నాయకుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద అప్పుడప్పుడు హామీల మీద అశ్శరభ శరభా అంటూ ఒంటికి ఒంటి కాలు మీద లేస్తుంటాడు. పైగా ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు ముఖ్యమంత్రికి పాలన చేత కావడం లేదని తమకే పుట్టుకతో వచ్చిన పరిపాలన వెన్నతో పెట్టిన విద్య అని తీస్మాన్ కారులమని బావ ఒకవైపు బామ్మర్ది మరోవైపు మద్దెల తాళాలు కొడుతూ బీరాలు పోతుంటారు.
ఇకపోతే మరోవైపు జాగృతి కవిత తాము తమ కుటుంబం అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర ఏళ్లలో ఎన్నడూ గుర్తుకురాని కనీసం మాటవరుసకు అనడానికి ఇచ్చగించని ఈమె సామాజిక ఉద్యమ నాయకురాలిగా కొత్తగా అవతారం ఎత్తారు. తన కళా కౌశలంతో ఒకసారి ధర్నా చౌక్ లో మరోసారి చిట్ చాట్ లో ఇంకోసారి ఢిల్లీలోనూ గల్లీలోను
సామాజిక నాయకురాలిగా వాక్కనిస్తుంటే , మాట్లాడే వారికి లేకున్నా వినేవారికి చూసేవారికి భలేగా నవ్వు తెప్పిస్తున్నది వినోదం కల్పిస్తున్నది .
ఇక ఫామ్ హౌస్ లో బంగారు తెలంగాణ నిర్మాత దర్శకత్వం నటన మాటలు పాటల రచయిత కేసిఆర్ వ్యవకలనాలు సంకలనాలు బాగాహారాలు లెక్కలు జూమ్లా తీస్తూ వేస్తూ, గోచార ఫలితాలను చూస్తున్నాడు. బిడ్డ కవిత గాకుండా అదే మరో నాయకుడు ఆమెలా ప్రవర్తిస్తే దిక్కారమును సైతునా అంటూ వెంటనే పార్టీలోంచి బహిష్కరించి అవతల ఎత్తేసేవాడు. ఈ ఎపిసోడ్ విషయంలో కెసిఆర్ వ్యవహరిస్తున్న తీరును చతురతను అమాయకులైన తెలంగాణ ప్రజలకు తెలిసినంత అర్థం చేసుకుంటున్నారు.
ఇకపోతే మరోవైపు సోషియల్ మీడియాతో పాటు తమ చెప్పు చేతుల్లో ఉన్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రభుత్వం తీరు మీద వార్తా కథనాలు దండిగా వండి వారుస్తూ రోజుకో తరీక దుమ్మెత్తి పోస్తున్నారు.
తమ తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో ఎదురులేని అధికారాన్ని అనుభవించిన నాయకుల యొక్క అవినీతి అక్రమాలకు కొండంత అండదండగా ఉన్న ఉన్నతాధికారులు అందనికాడికి దండుకున్నారు. నాయకులు మరోవైపు ఉన్నతాధికారులు ఒకరిని ఒకరు ఏమీ అనుకోకుండా పాలన సాగించారు. అందుకే ప్రస్తుత ప్రభుత్వంలో ముఖ్యమైన విభాగాలలో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారులుగాస ద్దితిన్న రేవును తలుస్తూ ప్రభుత్వం తీసుకోబోతున్న విదానపరమైన నిర్ణయాలను ఎప్పటికప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకులకు ముందే సమాచారాన్ని అందజేస్తున్నారు. ఒక విధంగా ఈ రాజకీయ రగడకు ప్రధాన కారణం అవుతున్నారు.విపక్ష నాయకులు మీడియా పాయింట్ల వద్ద ప్రెస్ క్లబ్లో ఎవరికి తోచిన ఆరోపణలు వారు చేస్తున్నారు. అంతేకాకుండా కోర్టులలో కేసులు వేస్తున్నారు. ఇది దాదాపు ఇరువై నెలల కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న కొమురెల్లి గుడి దగ్గర పట్నం పరచి మొక్కుకుంటున్నట్టు ప్రతిపక్ష నాయకుల పోకడలు రాజకీయ విశ్లేషకులకు కనిపిస్తున్నాయి.
ఇకపోతే ప్రభుత్వం శాసన సభకు జరిగిన ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నీ తీర్చలేకపోయినా, అతి ముఖ్యమైనవి ఆర్థిక వనరుల మేరకు ఒక్కటొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. అందులో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ మరియు రైతు భరోసా తెల్ల రేషన్ కార్డులకు సన్న బియ్యం ఒకటో తారీకున ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు తమ క్రమం తప్పకుండా ఇస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వం ప్రజా ధనంతో ఒకరోజులో తెలంగాణ వ్యాప్తంగా కుటుంబ సర్వే చేసి ఆ కులాల వారీ సమాచారాన్ని తమ వద్దనే అట్టే పెట్పుకొన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సామాజిక గణన చేసి బహిరంగంగా రిజర్వేషన్లను ప్రకటించారు .
తీరా వీళ్ళ దగ్గరికి వచ్చే వరకు ప్రజాస్వామ్యం జ్ఞాపకం రావడం విడ్డూరంగా ఉంది. వీరు విచారణకు హాజరైన ప్రతిసారి రాజు విడలే సభకు రవితేజము అలరగా అన్నట్టు చేసే హడావుడి ఇంత అంతా కాదు. గతంలో వీరు చేసిన నిర్వాకాలు రేవంత్ రెడ్డిని బెడ్ రూమ్ తలుపులు పగలగొట్టి అరెస్టు చేసింది సంగతి తెలిసిందే. తెలంగాణ జేఏసీ నాయకుడు ప్రొఫెసర్ కోదండరాం ఇంటి తలుపులు పగలగొట్టి బెదిరించిన ప్రజాస్వామ్యం ఇంకా ప్రజల మనో పలకంలో పచ్చి పచ్చిగా నిలిచిపోయి అలాగే ఉన్నాయి.
సోషియల్ మీడియా స్వగతాలను, వార్తాపత్రికలను, ఎలక్ట్రానిక్ ఛానళ్లను చూసి వార్తా కథనాలను చదివి పాఠకులు వీక్షకులు ప్రేక్షక పాత్ర వహించక ఆయా వార్తల వెనక ఉన్న మరో అసలు విషయాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తున్నారు . ఇది ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభ యొక్క విశ్వాసంపై ప్రజలకు కలుగుతున్న అనుమానాలు రేకెత్తుతున్న ఆలోచనలు ప్రజాస్వామ్య మనుగడకు అంత ఆరోగ్యకరమైన విషయం కాదు. కానేరదు.
కొందరిని కొన్నిసార్లు మోసం చేయవచ్చు గాని అందరినీ అన్నిసార్లు మోసం చేయలేరు అనే విషయాన్ని మన రాజకీయ నేతలు పీతల్లా ప్రజాక్షేత్రం అనే పంట పొలాలలో దొంగ బొరియలు చేయకుండా ఇక ముందైనా తెలుసుకొని మసలుకుంటే వాళ్ల వాళ్ల హెల్త్ కు మరీ మంచిది.