సుప్రీంకోర్టుకు మరో ముగ్గురు జడ్జీల నియామకం..
ప్రమాణం చేయించిన సీజేఐ బీఆర్ గవాయ్..;
భారత అత్యున్నత న్యాయస్థానానికి మరో ముగ్గురు న్యాయమూర్తులను నియమించారు. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంజరియా, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిష్ణోయ్, బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చందూర్కర్లను న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు శుక్రవారం కోర్టు ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ (BR Gavai) వారితో ప్రమాణం చేయించారు. వీరి నియామకంతో సుప్రీంకోర్టు (Supreme Court) పూర్తి స్థాయిలో మొత్తం 34 మంది న్యాయమూర్తులతో తిరిగి పని చేస్తోంది.
మాజీ ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, హృషికేశ్ రాయ్ పదవీ విరమణతో వీరి నియామకం ఖరారైంది.
జస్టిస్ అంజరియా..
మార్చి 23, 1965న అహ్మదాబాద్లో జన్మించిన అంజరియా..1989లో అహ్మదాబాద్లోని యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. అంతకుముందు 1988 ఆగస్టులో గుజరాత్ హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. నవంబర్ 21, 2011న గుజరాత్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. సెప్టెంబర్ 6, 2013న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఫిబ్రవరి 25, 2024న కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.
జస్టిస్ బిష్ణోయ్..
ఈయన ఫిబ్రవరి 5, 2024న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు 2013లో రాజస్థాన్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2015లో హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1964 మార్చి 26న జోధ్పూర్లో జన్మించిన జస్టిస్ బిష్ణోయ్ జూలై 8, 1989న న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. రాజస్థాన్ హైకోర్టు, జోధ్పూర్లోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ప్రాక్టీస్ చేశారు.
జస్టిస్ చందూర్కర్..
ఏప్రిల్ 7, 1965న జన్మించిన జస్టిస్ చందూర్కర్. న్యాయ పట్టా పొందాక జూలై 21, 1988న బార్ కౌన్సిల్లో చేరారు.1992లో నాగ్పూర్కు మారి వివిధ కోర్టులలో ప్రాక్టీస్ చేశారు. జూన్ 21, 2013న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.