మృత్యుంజయుడు
విమాన ప్రమాదంలో బతికి బయటపడ్డ ఒకే ఒక్కడు..;
గుజరాత్ (Gujarat) రాష్ట్రం అహ్మదాబాద్(Ahmadabad)లో జరిగిన విమాన ప్రమాదం(Plane crash)లో మొత్తం 241 మంది సజీవ దహనం కాగా .. ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇద్దరు పైలెట్లు, 10 మంది సిబ్బందితో కలిసి మొత్తం 242 మంది అహ్మదాబాద్ నుంచి లండన్కు బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానంలో బయలుదేరారు. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా.. 53 మంది బ్రిటన్ పౌరులు, పోర్చుగల్కు చెందిన వారు ఏడుగురు, ఒక కెనడియన్ ఉన్నారు. మృతుల్లో ఇద్దరు శిశువులతో పాటు 12 మంది పిల్లలు ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే బీజే మెడికల్ కాలేజీ భవనంపై కూలిపోయింది. దాంతో ఐదుగురు వైద్య విద్యార్థులు చనిపోయారు. మరికొంతమంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించేందుకు ఆంబులెన్స్లు కూడా ఘటనా స్థలికి చేరుకున్నాయి. అప్పటికే అందరూ గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారని అహ్మదాబాద్ పోలీసు కమిషనర్ చెప్పారు. 11A సీట్లో కూర్చున్న 38 ఏళ్ల రమేష్ విశ్వకుమార్ అనే వ్యక్తి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా వెంటనే ఆంబులెన్స్లో ఆసుపత్రికి తరలించామని చెప్పారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్ మోహన్ నాయుడు, హోమంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, హో మంత్రి హర్ష్ సంఘవి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
మృతులకు సంతాపం తెలిపిన టాటా గ్రూప్.. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించింది.