అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి
ఇద్దరు పైలెట్లు, 10 మంది సిబ్బంది సహా ప్రయాణికులంతా సజీవదహనం - మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి - ఐదుగురు మెడికోలు కూడా..;
గుజరాత్ (Gujarat) రాష్ట్రం అహ్మదాబాద్(Ahmadabad)లో జరిగిన విమాన ప్రమాదం(Plane crash)లో మొత్తం 242 మంది సజీవ దహనమయ్యారు. ప్రయాణికులతో పాటు ఇద్దరు పైలెట్లు, 10 మంది సిబ్బంది చనిపోయారు. మృతుల్లో ఇద్దరు శిశువులతో పాటు 12 మంది పిల్లలు కూడా ఉన్నారు. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా.. 53 మంది బ్రిటన్ పౌరులు, పోర్చుగల్కు చెందిన వారు ఏడుగురు, ఒక కెనడియన్ ఉన్నారు. ఇదే విమానంలో ప్రయాణిస్తున్న గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణిని కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన తీరును బట్టి ఎవరు ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ చెప్పారు.
ప్రమాదం ఎలా జరిగింది?
అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా (Air India flight) బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం లండన్కు బయల్దేరింది. సరిగ్గా మధ్యాహ్నం 1.17 నిముషాలకు టేకాఫ్ అయ్యింది. అయితే 5 నిముషాలకే విమానం కూలిపోయింది. 825 అడుగుల ఎత్తు నుంచి బీజే మెడికల్ కాలేజీ భవనంపై కూలిపోవడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఆకాశంలో దట్టమైన పొగ అలుముకుంది. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి సహాయక చర్యలు చేపట్టారు. కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందు పైలెట్ చేసిన మేడే (MAYDAY) కాల్ ATCకి చేరింది. ఆ తర్వాత పైలెట్ నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. ప్రయాణికులు గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. ఇప్పటివరకూ 204 మృతదేహాలను వెలికితీశారు. విమానం మెడికల్ కాలేజీపై కూలిపోవడంతో అందులో ఉన్న ఐదుగురు మెడికోలు చనిపోయారు. మరికొంత మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ప్రధాని దిగ్భ్రాంతి:
The tragedy in Ahmedabad has stunned and saddened us. It is heartbreaking beyond words. In this sad hour, my thoughts are with everyone affected by it. Have been in touch with Ministers and authorities who are working to assist those affected.
— Narendra Modi (@narendramodi) June 12, 2025
ఈ ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.