ఇంటి నుంచే ఓటు..

మొబైల్స్ ద్వారా ఓటు వేసే వీలు కల్పించిన మొదటి రాష్ట్రం బీహార్;

Update: 2025-06-28 13:02 GMT
Click the Play button to listen to article

బీహార్‌(Bihar) రాష్ట్రంలో తొలిసారి ఈ వోటింగ్ అమల్లోకి వచ్చింది. మొబైల్‌లోనే ఓటు వేసే సౌలభ్యం అందుబాటులోకి తెచ్చారు. పాట్నా, రోహ్తాస్, తూర్పు చంపారన్ జిల్లాల్లోని ఆరు మున్సిపల్(municipal elections) కౌన్సిళ్లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు తొలిసారిగా ఈ ఓటింగ్ విధానాన్ని అమలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొబైల్ ఫోన్‌తో ఓటు వేసిన తొలిరాష్ట్రంగా బీహార్ చరిత్రలోకి ఎక్కిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్(Election commissioner) దీపక్ ప్రసాద్ పేర్కొన్నారు. అయితే ఈ విధానాన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగిస్తారా? అన్నదానిపై స్పష్టత లేదు.

ఇంటి నుండే ఓటు..

పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయలేని వారికి ఈ సౌకర్యం అందుబాటులోకి తెచ్చామని ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఆన్‌లైన్‌(online voting)లో ఓటు వేసేందుకు ఓటర్లు ముందుగా తమ ఫోన్‌లో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందని, ఈ సౌకర్యం సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, గర్భిణులు, వలస ఓటర్లకు చాలా ఉపయోగపడుతుందని పేర్కొ్న్నారు. ఈ విధానంపై జూన్ 10 నుంచి 22 వరకు అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించామని చెప్పారు.

ఈ-ఓటింగ్‌కు ఎలా నమోదు చేసుకోవాలి?

ఈ ఓటింగ్‌కు ఓటర్లు తమ ఫోన్‌లో E-SECBHR యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓటరు జాబితాలోని ఓటరుకు లింకయిన ఫోన్ నంబర్, యాప్ ఇన్‌స్టా్ల్ చేసేటప్పుడు ఎంట్రీ చేసే ఫోన్ నంబర్ ఒకటే అయి ఉండాలి. అలా అయితేనే ఆన్‌లైన్‌లో ఓటు వేయవచ్చు. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సి-డిఎసి) రూపొందించిన ఈ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్‌లో మాత్రమే పనిచేస్తుంది. ఈ సౌకర్యం కోసం ఇప్పటికే 10 వేల మంది ఓటర్లు నమోదు చేసుకున్నారని, మరో 50వేల మంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండానే వెబ్‌సైట్ ద్వారా ఓటు వేసే అవకాశం ఉందని ఎన్నికల అధికారి చెప్పారు. నిష్పాక్షిక, పారదర్శక ఓటింగ్ కోసం ఒక మొబైల్ నంబర్‌ నుంచి ఇద్దరు రిజిస్టర్డ్ ఓటర్లు మాత్రమే లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో VVPAT (ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్)లాగే ఈ ఓటింగ్‌లోనూ ఆడిట్ ట్రైల్ ఉంటుందని ప్రసాద్ పేర్కొన్నారు. 

Tags:    

Similar News