కుల గణనను కేంద్రం ఆమోదం..
‘‘వాస్తవానికి జనాభా లెక్కింపు ప్రక్రియ ఏప్రిల్ 2020లో ప్రారంభం కావాల్సి ఉంది. కోవిడ్ కారణంగా ఆలస్యమైంది’ - కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్;
రాబోయే జాతీయ జనాభా లెక్కల్లో కుల ఆధారిత గణనకు(Caste census) కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) ప్రకటించారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
కుల డేటాను "పారదర్శకంగా మరియు నిర్మాణాత్మకంగా" సేకరిస్తామని వైష్ణవ్ పేర్కొన్నారు. ‘‘స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, కుల డేటాను ప్రధాన జనాభా గణన కార్యకలాపాలలో భాగం చేయలేదు. 2010లో అప్పటి ప్రధాన మంత్రి దివంగత మన్మోహన్ సింగ్ జనాభా గణనలో కులాన్ని చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని లోక్సభకు హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని సమీక్షించడానికి మంత్రుల బృందం ఏర్పడింది. అనేక రాజకీయ పార్టీలు కుల గణనను సిఫార్సు చేశాయి . అయితే ఆ సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారిక జనాభా గణనలో కుల డేటాను చేర్చడానికి బదులుగా సామాజిక-ఆర్థిక మరియు కుల గణన (SECC) అని పిలిచే ప్రత్యేక సర్వేను మొగ్గుచూపిందని వైష్ణవ్ హైలైట్ చేశారు.
జనాభా లెక్కలు కేంద్రం పరిధిలోకి వస్తాయని..కానీ ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ కారణాల వల్ల కుల సర్వేలు చేశాయని చెప్పారు.
వాస్తవానికి జనాభా లెక్కింపు ప్రక్రియ ఏప్రిల్ 2020లో ప్రారంభం కావాల్సి ఉందని, అయితే కోవిడ్ కారణంగా ఆలస్యమైందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
స్వాగతించిన తెలంగాణ ప్రభుత్వం
జనాభా లెక్కలతో పాటు కులగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం స్వాగతించింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కుల గణన రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరిగి చట్టం చేసి 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసి పంపిందని చెబుతూ కేంద్రం నిర్ణయం వెనక తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ఉందని బిసి సంక్షేమ శాఖ, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
కుల గణన చేసి తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
‘కేంద్ర ప్రభుత్వం బీసీ లకు తెలంగాణ లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని డిమాండ్ చేశాం. ఇప్పుడే కేంద్ర ప్రభుత్వ జన గణన ద్వారా జనాభా లెక్కల్లో కుల గణన చేస్తామని ప్రకటించింది. ఇది తెలంగాణ ప్రభుత్వ విజయం...తెలంగాణ ప్రజల విజయం. ఆలస్యమైనా కెేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. గతంలో 1931 లో బ్రిటిష్ కాలంలో జాతీయ స్థాయిలో కుల గణన జరిగింది. మళ్లీ ఈ ఏడాది తెలంగాణ లో జరిగింది. తర్వలో కేంద్రం దేశవ్యాపితంగా చేపడుతుంది. రాబోయే జన గణన లో కుల గణన చేస్తామని చెప్పడం బలహీన వర్గాల మంత్రిగా మీకు అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతున్న," అని పొన్న ప్రభాకర్ అన్నారు.