అయోధ్య: కొత్తగా నిర్మించిన ఆలయాల్లో విగ్రహాల ప్రతిష్ట

ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న యూపీ సీఎం అదిత్యనాథ్..;

Update: 2025-06-05 10:23 GMT
Click the Play button to listen to article

ఉత్తర ప్రదేశ్‌(Uttar Pradesh)లోని అయోధ్య(Ayodhya) రామాలయం లోపల అంతర్గతంగా నిర్మించిన ఎనిమిది ఆలయాలలో గురువారం దేవతల విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ కార్యక్రమం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) సమక్షంలో జరిగింది. శ్రీరామ దర్బార్ (కేంద్ర సంస్థాపన), శేషావతార్, ఈశాన్యం (ఇషాన్)లో శివుడు, ఆగ్నేయం (అగ్ని)లో గణేశుడు, దక్షిణ దిక్కు హనుమంతుడు, నైరుతీ (నైరిత్య)లో సూర్యుడు (సూర్య దేవుడు), వాయువ్యం (వాయవ్య)లో భగవతి దేవి, ఉత్తర దిశలో అన్నపూర్ణ దేవి విగ్రహాలను ప్రతిష్టించినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేర్కొంది. ఉదయం 6:30 గంటలకు 'యజ్ఞ మండపం' వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమం మొదలైంది.

2024లో రామ్‌లల్లా..

ఆలయంలో మొదటి పవిత్రోత్సవం సందర్భంగా రామ్‌లల్లా విగ్రహాన్ని జనవరి 22, 2024న ప్రతిష్టించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇది రెండవ పవిత్రోత్సవం.

ఈ సందర్భంగా అయోధ్యలోని రసిక్ నివాస్ ఆలయ ప్రధాన పూజారి మహంత్ రఘువర్ శరణ్ మాట్లాడుతూ.. ‘‘500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత, 'రాజరాముడు'గా పిలిచే శ్రీరాముడిని అయోధ్య రామాలయ మొదటి అంతస్తులో ఘనంగా ప్రతిష్టించాం.’’ అని చెప్పారు.

‘ఇది నేను చేసుకున్న పుణ్యం..’

విగ్రహాల ప్రతిష్ట సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మొదటి అంతస్తులోని 'రామ్ దర్బార్'ను సందర్శించారు. సమీపంలోని హనుమాన్‌గరి ఆలయానికి కూడా వెళ్లారు. ‘‘దేవతా విగ్రహాల ప్రతిష్టోత్సవంలో పాల్గొనడం నేను చేసుకున్న పుణ్యం’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

విగ్రహ ప్రతిష్ఠకు ముందు రామ్ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. విగ్రహ ప్రతిష్ట మాత్రమే పూర్తయ్యిందని, మరో శుభదినాన భక్తులను దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. దేవాలయ నిర్మాణం దాదాపు 95 శాతం పూర్తయ్యిందని చెప్పారు. 

Tags:    

Similar News