బీజేపీలోకి జార్ఖండ్ మాజీ సీఎం చంపాయ్ సోరెన్

జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్‌ సోరెన్‌ బీజేపీలో చేరనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సోమవారం ప్రకటించారు.

Update: 2024-08-27 07:48 GMT

జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్‌ సోరెన్‌ బీజేపీలో చేరనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సోమవారం ప్రకటించారు. ఆగస్టు 30న రాంచీలో సోరెన్ పార్టీలో చేరనున్నట్లు శర్మ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సోరెన్ సమావేశమైన చిత్రాన్ని ఆయన ఇక్కడ పోస్ట్ చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ కో-ఇంఛార్జిగా ఉన్న శర్మ కూడా ఈ సమావేశంలో భాగమయ్యారు.

"జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మన దేశంలోని విశిష్ట ఆదివాసీ నాయకుడు, చంపాయ్ సోరెన్ జీ కొద్దిసేపటి క్రితం గౌరవనీయులైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా జీని కలిశారు. ఆయన ఆగస్ట్ 30న రాంచీలో అధికారికంగా బీజేపీలో చేరనున్నారు" అని ఎక్స్‌లో పోస్టు చేశారు.

పార్టీ నాయకత్వం తనను అవమానిందని జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు, సోరెన్ ఆరోపించాడు. తన తదుపరి రాజకీయ కార్యాచరణను త్వరలో నిర్ణయిస్తానని ప్రకటించారు.

ఎవరీ చంపయీ సోరెన్‌..

67 ఏళ్ల గిరిజన నాయకుడు చంపయీ సోరెన్‌ జార్ఖండ్‌ రాష్ట్రానికి 12వ ముఖ్యమంత్రి. జనవరి 1, 1961న జంషెడ్‌పూర్‌లోని ఆదివాసీ కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి సిమల్‌ సోరెన్‌. రైతు. చంపై సోరెన్‌ 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. బీహార్‌ నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం జార్ఖండ్‌ ఉద్యమంలో శిబు సోరెన్‌తో చేరి ‘జార్ఖండ్‌ టైగర్‌’గా పేరుతెచ్చుకున్నారు. 2010లో అర్జున్‌ ముండా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో క్యాబినెట్‌ మంత్రిగా పనిచేశారు. హేమంత్‌ సోరెన్‌ క్యాబినెట్‌లో ఆహారం, పౌర సరఫరాలు, రవాణా శాఖ మంత్రిగా పనిచేశాడు. 2019లో హేమంత్‌ సోరెన్‌ మళ్లీ ముఖ్యమంత్రి అయినప్పుడు, చంపై సోరెన్‌ రవాణా, షెడ్యూల్డ్‌ తెగలు, షెడ్యూల్డ్‌ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.

హేమంత్‌ సోరెన్‌ అరెస్ట్‌‌తో ముఖ్యమంత్రిగా..

గతంలో జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని ఆరోపణలొచ్చాయి. రూ.600 కోట్ల భూకుంభకోణానికి పాల్పడి అక్రమంగా సంపాదించిన డబ్బును విదేశాలకు తరలించాడని ఈడీ ఆయనపై కేసు నమోదు చేసింది. అరెస్టు తప్పదని తేలడంతో రాజ్‌ భవన్‌లో ఆయన రెండు రోజుల క్రితం రాజీనామా చేశారు. దీంతో జార్ఖండ్‌ నూతన ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత చంపయీ సోరెన్‌ ప్రమాణస్వీకారం చేశారు. జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సి.పి.రాధాకృష్ణన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు.

Tags:    

Similar News