రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్ ఏడీ శ్రీనివాస్ అరెస్ట్
మూడు రాష్ట్రాల్లో అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ
అక్రమాస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డు ఏడీ శ్రీనివాస్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం అరెస్టు చేశారు. ఏడీ శ్రీనివాస్ నివాసం, బంధువుల ఇళ్లలో ఏక కాలంలో సోదాలు నిర్వహించిన అధికారులు తెలంగాణ, ఏపీ, కర్ణాటకల్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. మొత్తం ఆరు ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేశారు. రాయదుర్గం మైహోంభుజలో ఖరీదైన ఫ్లాట్, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, ఎపిలోని అనంతపురంలో 11 ఎకరాలు, మహబూబ్నగర్లో నాలుగు ఎకరాల స్థలం, నారాయణపేటలో రైస్ మిల్లుతో పాటు 3 ఎకరాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. సోదాల్లో రూ.5లక్షల నగదు, 1.6 కిలోల బంగారు నగలు, 770 గ్రాముల వెండి, 2 కార్లు, పలు పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డు ఎడి శ్రీనివాస్ కు మూడు రాష్ట్రాల్లో అక్రమాస్తులు ఉండటం చర్చనీయాంశమైంది.