‘మున్సిపల్ మంత్రి కూడా సీఎం కావడం మన ఖర్మ’

ఎస్టీపీ నిర్మించడం మంచి ఆలోచనే అయినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడం నాయకుల బాధ్యతన్న కవిత.

Update: 2025-12-04 10:58 GMT

ఉప్పల్ హిల్స్ కురుమ నగర్ వద్ద నిర్మిస్తున్న సివరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్(STP)పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. ఎక్కడో సాంక్షన్ అయిన ఎన్‌టీపీని ఉప్పల్ కురుమ నగర్‌లో ఎందుకు నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. దాని నిర్మాణం కోసం ఇక్కడి కాలనీ వాసులతో మాట్లాడారా? అని అడిగారు. గురువారం ఆమె ఎన్‌టీపీ నిర్మాణ పనులను సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి కూడా సీఎం రేవంత్ రెడ్డి కావడం మనం చేసుకున్న ఖర్మ అంటూ చురకలంటించారు. ఈ పర్యటనలో భాగంగా స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కవిత.

‘‘ఉప్పల్ భగాయత్ వద్ద సడెన్ గా మురుగు నీటి శుద్ది కేంద్రం (ఎస్టీపీ) ని తెచ్చారు. ఎక్కడో వేరే చోట సాంక్షన్ అయిన ఎస్టీపీని ఇక్కడ నిర్మిస్తున్నారు. దీంతో ఇక్కడి నాలుగు కాలనీల వాసులు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఈ ప్రాంతంలో నాలుగు ఎకరాలు ఖాళీ స్థలం ఉంది. ఐతే ఇక్కడ పార్క్, ఓపెన్ జిమ్, కమ్యూనిటీ హాల్, లైబ్రరీ ఇలా ప్రజలకు ఉపయోగపడే వాటిని నిర్మించాల్సింది. కానీ ఎక్కడో సాంక్షన్ అయిన ఎస్టీపీని ఇక్కడ నిర్మిస్తున్నారు. ఎస్టీపీ లు కూడా అవసరమే. కానీ వాటిని కట్టే ముందు కాలనీ వాసులను అడగాలి’’ అని తెలిపారు.

 

‘‘ఇప్పటికే ఇక్కడి ప్రజలు మూసీ కారణంగా బాధపడుతున్నారు. మళ్లీ ఎస్టీపీ తీసుకొచ్చి వారిని ఇబ్బంది పెట్టటం సరికాదు. ఇక్కడ ఉన్న వాళ్లంతా పేద, మధ్య తరగతి వాళ్లే. ఎంతో కష్టపడి ఇళ్లు కొనుక్కున్నారు. మూసీ, ఎస్టీపీ కారణంగా ఇక్కడ నేల, నీళ్లు, ఆరోగ్యం పాడవుతుందని వారంతా బాధపడుతున్నారు. వేరే చోట శాంక్షన్ అయిన ఎస్టీపీ ని ఇక్కడెందుకు నిర్మిస్తున్నారో చెప్పాలి. పనులు ఆపాలని మహిళలు అడిగితే వారిని నాలుగు పోలీస్ స్టేషన్ల చుట్టు తిప్పారంట’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేస్తామన్న ముఖ్యమంత్రి ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? మహిళ పోలీసులు లేకుండా మహిళలను అరెస్ట్ చేసి నాలుగు స్టేషన్ తిప్పటం దారుణం. ఇది చాలా సీరియస్ విషయం. డీజీపీ ఈ ఘటనపై విచారణ జరపాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ అంశాన్ని వదిలిపెట్టను. అదే విధంగా తక్షణమే పనులను ఆపేయాలి. అసలు ఇక్కడ కనీసం భూ పరీక్షలైనా చేశారా? ఎందుకు ఇక్కడే ఎస్టీపీ నిర్మిస్తున్నారు?’’ అని నిలదీశారు.

‘‘మున్సిపల్ శాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రే కావటం మన ఖర్మ. ఆయన దొరకడు. సమస్య ఎవరికీ చెప్పాలో అర్థం కాదు. మున్సిపల్ శాఖ కమిషనర్ ను కూడా కలిసి సమస్య వివరిస్తాం. అక్కడ కూడా పరిష్కారం కాకపోతే ప్రజావాణికి కాలనీ వాసులందరితో కలిసి వస్తాం. అప్పటికైనా సీఎం మాట్లాడుతారో చూస్తాం. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్లి పనులను ఆపించే ప్రయత్నం చేస్తాం. మూసీ ప్రక్షాళన కచ్చితంగా జరగాల్సిందే. కానీ అది ప్రజల ఆమోదంతో జరగాలి’’ అని అన్నారు.

Tags:    

Similar News