ఇప్పుడు జరిగింది దేశ చరిత్రలోనే విజయవంతమైన దాడి: మోదీ
తూటాలకు, ఫిరంగులతో సమాధానమిస్తాం;
By : The Federal
Update: 2025-05-31 10:41 GMT
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్ ప్రధాన భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై సైనిక దాడి భారత చరిత్రలోనే విజయవంతమైన ఉగ్రవాద వ్యతిరేక దాడి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ఉగ్రవాద స్థావరాలపై సైనిక దాడి తరువాత సిందూర్ శౌర్యానికి చిహ్నంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. ఎల్ఓసీ అవతల కాల్పులు జరిపే తూటాలకు భారత్ ఫిరంగి గుళ్లతో ప్రతిస్పందిస్తుందని ఆయన పాకిస్తాన్ ను హెచ్చరించారు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన మోదీ.. సిందూర్ విజయాలు సాధించిన సైన్యాన్ని ప్రశంసించారు.
ఉగ్రవాదులు మహిళా శక్తిని సవాల్ చేశారు..
‘‘సిందూర్ ఇప్పుడు దేశంలో శౌర్యానికి చిహ్నంగా మారింది. మీరు బుల్లెట్లను పేల్చితే వాటికి ఫిరంగి బంతులతో సమాధానం ఇస్తారు’’ అని లోక్ మాతా దేవీ అహల్య భాయి మహిళా శక్తి స్వశక్తీకరణ మహ సమ్మేళన్ లో మోదీ అన్నారు. పురాణ రాణి 300 జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు.
పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతీయ సంస్కృతి దాడి చేయడం ద్వారా, భారతీయ సమాజాన్ని విభజించడానికి ప్రయత్నించి భారత మహిళా శక్తిని సవాల్ చేశారని, అది వారికి ప్రాణాంతకంగా మారిందని ప్రధాని అన్నారు.
‘‘పహల్గామ్ లో ఉగ్రవాదులు భారతీయుల రక్తాన్ని చిందించడమే కాకుండా మన సంస్కృతిపై కూడా దాడి చేశారు. వారు మన సమాజాన్ని విభజించడానికి ప్రయత్నించారు. అతిపెద్ద విషయం ఏంటంటే.. ఉగ్రవాదులు భారత్ లోని మహిళా శక్తిని సవాల్ చేశారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ఈ సవాలు ఉగ్రవాదులకు, వారి నిర్వాహాకులకు చరమగీతంలా మారింది. ఆపరేషన్ సిందూర్ భారతదేశ చరిత్రలో ఉగ్రవాదులపై జరిగిన అతిపెద్ద, అత్యంత విజయవంతమైన ఆపరేషన్. పాకిస్తాన్ సైన్యం ఊహించలేకపోయినా, మన సైన్యం ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది’’ అని ప్రధానమంత్రి అన్నారు.
మహిళా ఎంపీల సంఖ్య పెంచే ప్రయత్నాలు..
మహిళా సాధికారత రంగంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. పార్లమెంట్ లో 75 మంది మహిళా ఎంపీలు ఉన్నారని, ఈ సంఖ్యను పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
‘‘నారీ శక్తి వందన్ అధినియం వెనక ఉన్న స్ఫూర్తి ఇదే. పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళా రిజర్వేషన్ ఇప్పుడు సాధించాము. ఇది చాలాకాలంగా పెండింగ్ లో ఉంది’’ అని ఆయన అన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు అని కూడా పిలవబడే నారీ శక్తి వందన్ అధినియం, లోక్ సభ, రాష్ట్ర శాసనసభలలో మొత్తం సీట్లలో మూడింట ఒక వంతు రిజర్వేషన్ లక్ష్యంగా పెట్టుకుని దీనిని ఆమోదించారు.
‘‘దీని అర్థం బీజేపీ ప్రభుత్వం మన సోదరీమణులు, కుమార్తెలకు ప్రతిస్థాయిలో, ప్రతి రంగంలో సాధికారత కల్పిస్తోంది’’ అని ఆయన అన్నారు.
దేశ రక్షణలో భారత కుమార్తెలు..
దేశ రక్షణలో భారత పుత్రికల సామర్థ్యాన్ని ఇప్పుడు ప్రపంచం మొత్తం గమనిస్తోందని ప్రధాని అన్నారు. ‘‘దీనికోసం కూడా ప్రభుత్వం గత దశాబ్ధంలో అనేక చర్యలు తీసుకుంది.
పాఠశాల నుంచి యుద్ధభూమి వరకూ నేడు దేశం తన కుమార్తెల ధైర్యసాహసాలపై అపూర్వమైన విశ్వాసాన్ని కలిగి ఉంది’’ అని ఆయన అన్నారు.
భారత నావికాదళానికి చెందిన లెప్టినెంట్ కమాండర్ రూప, లెప్టినెంట్ కమాండర్ దిల్నా లు సెయిలింగ్ బోట్ లో విజయవంతంగా ప్రపంచాన్ని చుట్టి వచ్చి తరువాత గోవాకు వచ్చిన వారి సాహాసాన్ని మోదీ ప్రస్తావించారు. నావికాదళానికి చెందిన ఇద్దరు ధైర్యవంతులైన కుమర్తెలు దాదాపు 250 రోజుల పాటు సముద్ర ప్రయాణాన్ని పూర్తి చేశారని అన్నారు.
‘‘వారు మోటార్ పై కాకుండా కేవలం గాలి ఆధారంగా నడిచే పడవలో వేల కిలోమీటర్లు ప్రయాణించి భూమిని చుట్టుముట్టారు. 250 రోజుల పాటు సముద్రంలో ఉండటాన్ని ఊహించుకోండి’’ అని ఆయన అన్నారు.
అహల్యబాయి హోల్కర్ కు అభినందనలు..
అహల్యబాయి హెల్కర్ భారత వారసత్వ సంరక్షకురాలి అని, దేశంలోని దేవాలయాలు, తీర్థయాత్రలు దాడి చేయబడినప్పుడూ వాటిని రక్షించారని మోదీ అన్నారు.
‘‘మా ప్రభుత్వం అహల్యబాయి హెల్కర్ తత్వశాస్త్రం అయిన ‘నాగరిక్ దేవో భవ’అనే మంత్రంపై పనిచేస్తోంది’’ అని ఆయన అన్నారు.
మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా కల్నల్ సోఫియా ఖురేషీపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించిన కొన్ని వారాలకే ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
భారత్ కచ్చితత్వ దాడుల్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు మరణించిన ఆపరేషన్ సిందూర్ గురంచి ప్రభుత్వం నిర్వహించిన బ్రీఫింగ్ సందర్భంగా కల్నల్ ఖురేషి వెలుగులోకి వచ్చారు.