‘బతుకుతాననుకోలేదు’

విమాన ప్రమాదంలో బయటపడ్డ ప్రయాణికుడిని పరామర్శించిన ప్రధాని మోదీ..;

Update: 2025-06-13 10:34 GMT
విశ్వకుమార్‌తో మాట్లాడుతున్న ప్రధాని మోదీ
Click the Play button to listen to article

గుజరాత్‌ (Gujarat) రాష్ట్రం అహ్మదాబాద్‌(Ahmadabad)లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రయాణికులంతా చనిపోయారని అందరూ భావించారు. భారీగా ఎగిసిపడిన మంటలు, దట్టంగా అలుముకున్న పొగ కారణంగా.. ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని ఆశలు వదులుకున్నారు. అయితే ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. తాను ఎలా ప్రాణాలు కాపాడుకున్నానో ఆసుపత్రిలో చెప్పుకొచ్చాడు 41 ఏళ్ల రమేష్ విశ్వకుమార్.

‘ప్రాణాలతో బయటపడతాననుకోలేదు..’

‘‘సీటింగ్ అరెంజ్‌మెంట్ ప్రకారం నేను 11A నెంబర్ సీట్లో కూర్చున్నా. నా సీటు పక్కనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది. అదే నా ప్రాణాలు కాపాడుతుందని అనుకోలేదు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం నుంచి భారీ శబ్దం వచ్చింది. కాసేపటికి కూలిపోయింది. నా సీటు కూడా ఊడిపోయింది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి విసిరివేయబడ్డాను. నేను చనిపోయానని అనుకున్నాను. కళ్ళు తెరిచి చూసేటప్పటికి నా తోటి ప్రయాణికులు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలొదిలారు. గ్రౌండ్‌ఫ్లోర్‌కి దగ్గరే ఉండడంతో సీటు బెల్టు విప్పి బిల్డింగ్ నుంచి బయటికి వచ్చేశాను.

వైరలయిన వీడియో..

గాయపడిన విశ్వకుమార్‌ కుంటుతూ.. అంబులెన్స్‌లోకి ఎక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలైంది. అతని చుట్టూ ఉన్న చేరిన జనం ప్రమాదం ఎలా జరిగింది? మీరు ప్రాణాలతో ఎలా బయటపడ్డారని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ‘‘పైలట్లు విమానాన్ని పైకి లేపడానికి ప్రయత్నించారు కానీ ఫలితం లేకపోయింది. వేగంగా వెళ్లి భవనం మీదకు దూసుకుపోయింది" అని చెప్పారు విశ్వకుమార్.

పరామర్శించిన మోదీ..

శుక్రవారం అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ(PM Modi) విమానం కూలిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న విశ్వకుమార్‌ను పరామర్శించారు.

మొత్తం మృతులు 265..

విమాన దుర్ఘటనలో మొత్తం 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, పోర్చుగల్‌కు చెందిన వారు 7, ఒక కెనడియన్ ఉన్నారు. మృతుల్లో ఇద్దరు శిశువులు, 12 మంది పిల్లలు కూడా ఉన్నారు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణిని కూడా ప్రాణాలు కోల్పోయారు. విమానం బీజే మెడికల్ కాలేజీ భవన సముదాయంపై కూలిపోవడంతో బిల్డింగ్‌లోని 24 మంది కూడా చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 265కు చేరుకుంది. 

Tags:    

Similar News