జగన్ భద్రతపై విచారణ.. అందుకు ఓకే చెప్పిన సర్కార్

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భద్రత అంశంపై ఆంధ్ర హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. ఉదయం నుంచి వాదనలు జరిగాయి.

Update: 2024-08-07 12:19 GMT

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భద్రత అంశంపై ఆంధ్ర హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. ఉదయం నుంచి వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా జగన్ భద్రత విషయంలో రాజీ పడొద్దని హైకోర్టు ఆదేశించింది. కోర్టు వాదనలో భాగంగా జగన్‌కు ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో అనేక సమస్యలు ఉన్నాయని, కనీసం ప్రయాణానికి కూడా అది సౌకర్యవంతంగా లేదని జగన్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బుల్లెట్ ప్రూఫ్ వాహన నిర్వహణ బాధ్యత ఎవరదని న్యాయమూర్తి ప్రశ్నించగా ఇంటెలిజెన్స శాఖదని ప్రభుత్వం తరపు న్యాయవాది బదులిచ్చారు. జగన్‌కు కేటాయించిన వాహనంలో ఉన్న సమస్యలపై వివరణ ఇవ్వాలని, వీలైతే వాహనాన్ని మర్చే ప్రయత్నం చేయాలని న్యాయమూర్తి తెలిపారు. కాగా తాము ఆమేరకు సమాచారం కనుక్కోని చెప్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఈ సందర్బంగానే అధికారంలోకి వచ్చీరాగానే కూటమి సర్కార్ జగన్ భద్తను తగ్గించేసిందని, జగన్‌కు ప్రాణహాని ఉన్న క్రమంలోనే ఆయనకు జెడ్ ప్లస్ సెక్యూరిటీని కొనసాగించాలని జగన్ తరపు న్యాయవాది కోరారు. అంతేకాకుండా జగన్ నివాసం, కార్యాలయం దగ్గర భద్రతను కూడా తొలగించారని, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఇది సరైన నిర్ణయం కాదని జగన్ తరపు న్యాయవాది వాదించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ‘‘జగన్‌కు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వొచ్చు కదా. ఎందుకు ఇవ్వడం లేదు. జామర్ ఏర్పాటుపై కూడా స్పష్టత ఇవ్వాలి’’ అని కోరారు. అయితే ‘‘జగన్‌కు చట్టప్రకారం ఇవ్వాల్సిన భద్రతను కల్పిస్తున్నాం’’ అని పోలీసు శాఖ స్పష్టం చేసింది. ఈ వాదనలో భాగంగానే జగన్ భద్రత విషయంలో రాజీ పడొద్దని న్యాయస్థానం తెలిపింది. ఈ వాదనల్లో భాగంగా జగన్‌కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో కొన్ని సమస్యలు ఉన్నాయని అంగీరించారు అధికారులు.

‘‘జగన్‌కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి సంబంధించి రిపేర్లు చేయడానికి స్పేర్ పార్ట్స్‌ను ఆర్డర్ ఇచ్చాం. అవి ఇంకా రాలేదు. ఈ క్రమంలో ఇంతలో జగన్‌కు వేరే వాహనం ఏర్పాటు చేస్తాం. అదే విధంగా రిమోట్ కంట్రోల్ ద్వారా జగన్‌కు ప్రాణహాని ఉండే ప్రాంతాల్లో జామర్లను కూడా ఏర్పాటు చేస్తాం’’ అని వివరించారు. దీంతో అనంతరం కేసు విచారణను వాయిదా వేసింది న్యాయస్థానం. ప్రభుత్వం తన కౌంటర్‌ను దాఖలు చేయాలని, అందుకు రెండు వారాల సమయం కేటాయిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. అదే విధంగా పిటిషనర్‌ కూడా మూడు వారాల్లో రీజాయిండర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

Tags:    

Similar News