బొజ్జా తారకం ‘బుద్ధుని ప్రవచనం’ పుస్తకావిష్కరణ
పేదల పక్షాన డబ్బులు తీసుకోకుండా వాదించిన న్యాయవాది బొజ్జాతారకం. ఆయన రచయితగా, అనువాదకుడిగా కూడా ప్రసిద్ధుడు. ఈ పుస్తకం ‘ద వరల్డ్ ఆఫ్ బుద్ధ’ కు అనువాదం
కారం చేడు కేసులో బాధితుల తరపున కన్నాభిరాన్, బాల గోపాల్ తో పాటు బొజ్జాతారకం కూడా వాదించారని, శిరోముండనం కేసులో నిందితుడికి శిక్షపడే వరకు బొజ్జాతారకం చాలా పోరాడాల్సి వచ్చిందని రిటైర్డ్ జిల్లా జడ్జి గుర్రప్ప గుర్తు చేశారు. బొజ్జాతారకం 85వ జయంతి సందర్భంగా ఆయన అనువాదం చేసిన ‘బుద్ధుని ప్రవచనం’ పుస్తకాన్ని తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో గురువారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా ఆయన మాట్టాడుతూ, పేదల పక్షాన డబ్బులు తీసుకోకుండా వాదించిన బొజ్జాతారకం న్యాయవాదిగా, రచయితగా, అనువాదకుడిగా ప్రసిద్ధులని గుర్తుచేశారు.
అధికారంలో ఏ మతమున్నా అల్ప సంఖ్యాకులపై దారుణాలు జరుగుతాయన్నారు. బుద్ధుడి ప్రవచనాల పేరుతో ప్రచారంలో ఉన్న వన్నీ బుద్ధుడి చెప్పినవి కావని, బుద్ధుడి పేరుతో ఆయన శిష్యులు కానీ, తరువాత వచ్చిన బౌద్ధ సన్యాసులు కానీ చెప్పినవేనని పేర్కొన్నారు.
ఆలిండియా రేడియో విశ్రాంత డైరెక్టర్ ఆకుల మల్లేశ్వరరావు మాట్లాడుతూ, ఇంగ్లీషులో వచ్చిన ‘ద వర్ఢ్ ఆఫ్ ద బుద్ధ’ పుస్తకాన్ని బొజ్జాతారకం ‘బుద్ధుని ప్రవచనాలు’ పేరుతో అనువాదం చేశారని, ఇది పాళీ భాషలో ఉన్న రచనలకు మూలమని తెలిపారు. ఈ పుస్తకంలో అష్టాంగ మార్గం, నిర్వాణం గురించి ఉందని, ఇది కంఠస్తం చేసుకోవలసిన పుస్తకమని అన్నారు. దు:ఖం విముక్తికి సత్యం. దు:ఖం మాత్రమే కాదు, విముక్తి గురించి కూడా చెప్పిన దివ్య జ్ఞాని బుద్ధుడని కొనియాడారు. ‘బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి’ అని చెప్పిన వారు బౌద్ధులవుతారని అన్నారు.