గుంటూరు ఓటర్లు ఎవరిని గెలిపించారు!
గుంటూరు ఓటర్లు ఎవరి గెలుపునకు తీర్పు ఇచ్చారు. రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే పార్టీ గెలుస్తుందా గతంలో మాదిరి రెండు పార్టీలు గెలుస్తాయా? అనే చర్చ జోరుగా సాగుతోంది.
గుంటూరు తూర్పు నియోకవర్గంలో మహమ్మద్ ముస్తఫా 2014, 2019లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. మూడో సారి ఆయన కుమార్తె నూరి ఫాతిమాను వైఎస్సార్సీపీ పోటీకి దించింది. ఈమె విద్యావంతురాలు కావడం వల్ల జనంలోకి త్వరగా చొచ్చుకు పోగలిగారు. అందరితో కలిసిపోయి మాట్లాడుతూ ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతూ యాక్టివ్గా కనిపించారు. రెండు సంవత్సరాలుగా నియోకవర్గంలో తిరుగుతూ అందరికీ సుపరిచితమయ్యారు. ఈమెపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మహమ్మద్ నసీర్ పోటీ చేశారు. గత ఎన్నికల్లోనూ నసీర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మూడు సార్లు విజయం సాధించగా ఎనిమిది సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. మరో రెండు సార్లు వైఎస్సార్సీపీ, ఒకసారి సీపీఐ విజయం సాధించాయి. 2009లో జరిగిన ఎన్నికల్లో పిఆర్పి అభ్యర్థిగా పోటీచేసిన షేక్ షౌకత్ రెండో స్థానంలో నిలిచారు. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన షేక్ మస్తాన్వలి 9,012 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంటే ఈ నియోజకవర్గం ఒక విధంగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా చెప్పొచ్చు.