ఏపీ సీఎంఓకు పూర్వ వైభవం లభించేనా?
గత ప్రభుత్వ హయాంలో విమర్శలకు నిలయంగా మారిన సీఎంఓ కార్యాలయం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి(సీఎంఓ)ఒక గుర్తింపు, గౌరవం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో అయితే దీనికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉండేవి. ఎంతో గౌవరం ఉండేది. రాజకీయాలకు తావు లేకుండా అధికారులు సీఎంఓ నుంచి విధులు నిర్వహించే వారు. పనులు కోసం వచ్చిన వారిని పార్టీలు, ప్రాంతాలు, కులాలు చూడకుండా వాటికి అతీతంగా వారికి సహాయం అందించే వారు. కానీ విభజన అనంతరం పరిస్థితులు తారు మారయ్యాయనే టాక్ అధికార వర్గాల్లో ఉంది. విభజన అనంతరం ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తొలి నాళ్లల్లో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. అందరికి అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. అయితే రాను రాను ఆ పరిస్థితులు మారాయి. 2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎంఓ యాక్టివిటీస్ మారుతూ వచ్చాయి. రాజకీయాలకు నిలయంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తాయి. తొలుత మంచిగానే మెయింటెయిన్ చేస్తూ వచ్చిన చంద్రబాబు.. రాను రాను చేతులెత్తేశారనే విమర్శలు అప్పట్లో వచ్చాయి. దీంతో అప్పట్లో సీఎంఓ ముఖ్యకార్యదర్శిగా ఉన్న సతీష్చంద్ర ఒక రాజకీయ నాయుడిలా వ్యవహరించారని, చంద్రబాబుకు ఈక్వల్గా సమాంతర వ్యవస్థను కూడా నడిపించారనే టాక్ అప్పట్లో వచ్చింది.