అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి నిందితుడికి యావజ్జీవం..
30 ఏళ్ల పాటు జైలులో ఉంచాలని మహిళా కోర్టు తీర్పు..;
చెన్నై(Chennai) అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసులో నిందితుడు జ్ఞానశేఖరన్కు యావజ్జీవ శిక్ష(Life imprisonment) విధించారు. ఈ కేసులో 29 మంది సాక్షులను విచారించిన తర్వాత 30 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.90వేలు జరిమానా విధిస్తూ చెన్నై మహిళా కోర్టు జస్టిస్ ఎం. రాజలక్ష్మి సోమవారం (జూన్ 2) తీర్పు చెప్పారు.
ఇంతకు క్యాంపస్లో ఏం జరిగింది?
అన్నా యూనివర్సిటీ (Anna University) క్యాంపస్లో సెకండియర్ ఇంజనీరింగ్ విద్యార్థినిపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు (Sexual assault) పాల్పడ్డాడు. విద్యార్థిని స్నేహితుడిపై దాడి చేసి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ ఘటనను సెల్ఫోన్లో రికార్డు చేశాడు. ఎవరికైనా చెబితే వీడియో బయటపెడతానని బాధితురాలిని బెదిరించాడు. ఈ ఘటన డిసెంబర్ 23 వతేదీ రాత్రి 8 గంటలో ప్రాంతంలో జరిగింది. చివరకు 19 ఏళ్ల బాధితురాలు ధైర్యం కూడగట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొట్టూర్పురానికి చెందిన రోడ్డు పక్కన బిర్యానీ అమ్ముకునే 37 ఏళ్ల జ్ఞానశేఖరన్(Gnanasekaran)ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతనిపై అప్పటికే 20కి పైగా దొంగతనం, కిడ్నాప్, దోపిడీ కేసులున్నట్లు బయటపడింది. చివరకు నిందితుడిని డిసెంబర్ 25న అరెస్టు చేశారు.
హైకోర్టు జోక్యంతో సిట్ దర్యాప్తు..
విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. క్యాంపస్లో భద్రతపై పలు ప్రశ్నలను లేవనెత్తింది. ప్రజల ఆందోళన నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్ అధికారులు భూక్య స్నేహ ప్రియ, అమాన్ జమాల్, ఎస్ బృందా నేతృత్వంలో సిట్తో దర్యాప్తు జరిపించాలని ఆదేశిస్తూనే.. బాధితురాలికి మధ్యంతర పరిహారంగా రూ.25 లక్షలు చెల్లించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో కీలక ఆధారాలయిన సీసీటీవీ ఫుటేజ్, నిందితుడి మొబైల్ ఫోన్ డేటాను సేకరించి ఫిబ్రవరి 2025 SIT ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. కేసు తీవ్రత, సున్నితత్వం దృష్ట్యా కేసును మహిళా కోర్టుకు బదిలీ చేశారు. ఈ కేసు విచారణలో 29 మంది సాక్షులను విచారించారు. చివరకు జూన్ 2 న తీర్పు వెలువడింది. జ్ఞానశేఖరన్ క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. అతని నేర చరిత్రను దృష్టిలో ఉంచుకుని జ్ఞానశేఖరన్ అభ్యర్థనను ప్రాసిక్యూషన్ తీవ్రంగా వ్యతిరేకించింది.