కొత్త కుల గణనకు కర్ణాటక క్యాబినెట్ ఆమోదం..

హేతుబద్ధత, చట్టపర కారణాలను చూపుతూ సీఎం సిద్ధరామయ్య నిర్ణయం;

Update: 2025-06-13 11:43 GMT
Click the Play button to listen to article

కర్ణాటకలో కొత్తగా కులగణన చేపట్టనున్నారు. సీఎం సిద్ధరామయ్య క్యాబినెట్ ఇందుకు ఆమోదం తెలిపింది. హేతుబద్ధత, చట్టపర కారణాలను చూపుతూ ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పదేళ్ల క్రితం చేపట్టిన కుల గణనను పక్కన పెట్టేసినట్లే.

2015లో కుల గణన..

వాస్తవానికి ఈ కుల గణన(Caste survey) తొలుత 2015 జరిగింది. ఆ సమయంలో సిద్ధరామయ్య (CM Siddaramaiah) ముఖ్యమంత్రిగా ఉన్నారు. కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్‌కు నాయకత్వం వహించిన జి. కాంతరాజ్ నేతృత్వంలో డేటాను సేకరించారు. అయితే ఆ నివేదికను మాత్రం ఎప్పుడూ బయటపెట్టలేదు. అందుకు కారణం కూడా లేకపోలేదు. కర్ణాటకలో ఆధిపత్య కులాలయిన వొక్కలిగలు, లింగాయత్ సామాజిక వర్గాల సంఖ్య.. వెనుకబడిన, మైనార్టీ వర్గాల సంఖ్య కంటే తక్కువగా ఉన్నట్లు చూపే ఈ డేటాను బయట పెడితే వొక్కలిగలు, లింగాయత్ సామాజిక వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. రాజకీయ సమతుల్యతకు ప్రమాదకరం కూడా. ఆ కారణంగానే డేటాను దాదాపు పదేళ్లపాటు దాచిపెట్టారు.

2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో జనాభా 6.11 కోట్లు. ఇది 2015 నాటికి 6.35 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఇంటింటికి వెళ్లి 5.98 కోట్ల మంది వివరాలు సేకరించారు. ఈ సర్వే ఏప్రిల్ 11, 2015న ప్రారంభించి, మే 30, 2015 నాటికి ముగించారు. ఈ సర్వేలో 1.33 లక్షల మంది ఉపాధ్యాయులు సహా దాదాపు 1.6 లక్షల మంది సిబ్బంది పాల్గొన్నారు.

పెరుగుతోన్న ఒత్తిడి..

2023లో సిద్ధరామయ్య తిరిగి ముఖ్యమంత్రి కావడంతో 2015 చేపట్టిన కుల సర్వేను విడుదల చేయాలనే ఒత్తిడి మరింత పెరిగింది. కానీ ఆధిపత్య కులాల నుంచి ఎదురుదెబ్బ తగులుతుందనే భయంతో.. ఆయన నివేదికను బయటపెట్టేందుకు వెనకంజ వేశారు. 

అగ్రనేతలతో భేటీ..

సిద్ధరామయ్య ఏప్రిల్ 11న ఢిల్లీలో కాంగ్రెస్(Congress) నాయకులు రాహుల్ గాంధీ, AICC అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. వారు ఓకే చెప్పడంతో సిద్ధరామయ్య మంత్రివర్గ సమావేశంలో నివేదికను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత రెండు ప్రత్యేక మంత్రివర్గ సమావేశాలు కూడా జరిగాయి. నివేదికను ప్రవేశపెట్టినప్పుడు చాలా మంది మంత్రులు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 2015లో జరిగిన సర్వేలో తమ సామాజిక వర్గానికి చెందిన ఎక్కువ మంది నుంచి డేటా సేకరించలేదని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 12న మూడో ప్రత్యేక కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్య్టా హైకమాండ్ ఆదేశాలతో ప్రభుత్వం మళ్ళీ కొత్తగా రీసర్వే చేయించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణాలను చూపుతోంది. 2015లో జరిగిన సర్వే అశాస్త్రీయంగా జరిగిందనే వాదనను కొత్తగా తీసుకొచ్చి రీసర్వేకే మొగ్గుచూపుతున్నారు.

కాలం చెల్లిన డేటా?

ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో హిందూ సమూహాలకు ఉప కులాల జాబితాను విడిగా తయారు చేశారని, కానీ ముస్లిం వర్గాలకు అలా చేయని కారణంగా డేటాలో అసమతుల్యత ఏర్పడిందని వొక్కలిగ, లింగాయత్ నాయకులు ఎత్తి చూపారు. ఈ సర్వే 2011 జనాభా లెక్కల ఆధారంగా రూపొందించారని, అప్పటికీ, ఇప్పటికే జనాభా కూడా పెరిగిందని వారు చెప్పారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం 2026‌లో జాతీయ జనాభా గణనను ప్లాన్ చేస్తోంది. దాంతో పోలిస్తే ఇప్పటికే సేకరించిన డేటాకు భిన్నంగా కూడా ఉండొచ్చు. కాంగ్రెస్ కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు కనిపించింది. సాధారణంగా కుల లేదా జన గణన సర్వే పదేళ్ల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత ఆ డేటాను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. 2015 నాటి సర్వేకు ఇప్పుడు పదేళ్లు పూర్తికావడంతో రీ సర్వే చేయడమే సమంజసమని వారు వాదిస్తున్నారు.

రాజకీయ ఒత్తిడే కారణమా?

కొన్ని సామాజిక వర్గాల నుంచి ఒత్తిడి కారణంగానే ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుందని, సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ సర్వేను బయటపెట్టడం లేదని విమర్శకుల నుంచి వినిపిస్తున్న మాట.

కారణం అదేనా?

ఆధిపత్య వర్గాల నుంచి స్పష్టమైన రాజకీయ ఒత్తిడి ఉంది. 2015 డేటా ఆధారంగా 2024లో జయప్రకాష్ హెగ్డే సమర్పించిన నివేదికను లింగాయత్, వొక్కలిగ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారి జనాభాను తక్కువగా చూపడంపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మంత్రివర్గంలో మంత్రులు ఈ నివేదికను బహిరంగంగా వ్యతిరేకించనప్పటికీ.. ఈ వర్గాల నాయకులు నిరసనలు చేపట్టారు. దాంతో జాప్యం పెరిగిపోయింది. మంత్రులు ముసాయిదాను అధ్యయనం చేసి వారి అభిప్రాయాలను సమర్పించాలని ప్రభుత్వం కోరింది. అదే సమయంలో కాంగ్రెస్‌కు విధేయులుగా ఉన్న అహిందా గ్రూపులు - మైనారిటీలు, వెనుకబడిన తరగతులు దళితులు నిరాశకు లోనయ్యారు. కుల సర్వే రిపోర్టు బయటపెట్టాలని వారు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఆధిపత్య కులాల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గి కులగణన నివేదికను బయటపెట్టడం లేదన్న వాదన కూడా వారి నుంచి వినిసిస్తోంది.


Tags:    

Similar News