కర్ణాటకలో ‘స్పెషల్ యాక్షన్ ఫోర్స్’
ఉడిపి, శివమొగ్గ, దక్షిణ కన్నడ జిల్లాల్లో మోహరింపు..;
కర్ణాటక (Karnataka) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోస్తా, మల్నాడ్ జిల్లాల్లో మత హింసను అరికట్టడానికి ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసింది. దక్షిణ కన్నడ, ఉడిపి వంటి తీరప్రాంతాల్లో మతపర ఘర్షణ నివారణకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మూడు కంపెనీలతో ప్రత్యేక ఫోర్స్..
కొత్తగా ఏర్పడిన స్పెషల్ యాక్షన్ ఫోర్స్(Special Action Force)లో మూడు కంపెనీలు ఉన్నాయి. ఒక్కో కంపెనీ ఒక్కో జిల్లాలో పనిచేస్తుంది. ప్రస్తుతం ఉడిపి, శివమొగ్గ, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఇవి పనిచేస్తాయి. ఒక్కో కంపెనీ తమ పరిధిలో మత ఘర్షణలు, అల్లర్లు చోటుచేసుకునే ప్రాంతాలపై నిఘా ఉంచుతాయి. అక్కడి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తాయి. అవసరమయినపుడు ఆ ప్రాంతాలకు చేరుకుని శాంతిభద్రతలను అదుపులోకి తెస్తాయి.
సిబ్బంది నియామకం..
స్పెషల్ యాక్షన్ ఫోర్స్లో పనిచేసే సిబ్బందిని ప్రస్తుతం పనిచేస్తున్న యాంటీ-నక్సల్ ఫోర్స్ (ANF) నుంచి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ANFలో ప్రస్తుతం వివిధ హోదాల్లో (BDA, BMICPA యూనిట్లు మినహా) 656 మంది అధికారులు, సిబ్బంది ఉన్నారు.
అక్రమ నిర్మాణాల నిరోధానికి టాస్క్ ఫోర్స్..
అలాగే బెంగళూరులో అక్రమ నిర్మాణాలను నిరోధించేందుకు టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చారు. ఇందుకోసం పాండవపుర, నాగమంగళలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి మొత్తం 248 మంది అధికారులు, సిబ్బందిని ఈ టాస్క్ ఫోర్స్కు అటాచ్ చేశారు.
స్పెషల్ ఫోర్స్లో ఎవరెవరు ఉంటారు?
హోం శాఖ అండర్ సెక్రటరీ కె.ఎన్. వనజ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. స్పెషల్ యాక్షన్ ఫోర్స్లో ఒక డిఐజిపి, ఒక డివైఎస్పీ (సివిల్), ఒక అసిస్టెంట్ కమాండెంట్, నలుగురు ఇన్స్పెక్టర్లు/రిజర్వ్ పోలీస్ ఇన్స్పెక్టర్లు ఉంటారు. ఇందులో 16 మంది పిఎస్ఐలు/ఆర్ఎస్ఐలు/సిస్లు, 60 మంది సిహెచ్సిలు, 150 మంది సిపిసిలు/ఎపిసిలు మరియు 15 మంది అటెండర్లు కూడా ఉంటారు.