'థగ్ లైఫ్' విడుదలను అడ్డుకునే వారిపై చర్య తీసుకోండి

కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం..;

Update: 2025-06-19 10:35 GMT
Click the Play button to listen to article

మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన "థగ్ లైఫ్" సినిమా ప్రదర్శనను అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం కర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది. అయితే సినిమాను ప్రదర్శిస్తే థియేటర్లకు తగిన భద్రత కల్పిస్తామని కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన హామీని న్యాయమూర్తులు ఉజ్జల్ భుయాన్, మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం రికార్డు చేసింది.

కర్ణాటకలో థగ్ లైఫ్ ఎందుకు రిలీజ్ కాలేదు?

'థగ్ లైఫ్' ('Thug life') మూవీ దేశవ్యాప్తంగా జూన్ 5న విడుదలైంది. కాని కర్ణాటక(Karnataka)లో మాత్రం విడుదల కాలేదు. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ సందర్భంగా చెన్నైలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో కమల్ చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. ‘‘కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది’’ అన్న మాటతో కన్నడ నాట తీవ్ర దుమారమే రేగింది. కన్నడ భాషాభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేసి కమల్ ఫోటోలను దహనం చేశారు. కమల్ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఆయన చిత్రాన్ని ప్రదర్శనకు అనుమతించని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) తేల్చి చెప్పింది. దీంతో కమల్ కర్ణాటక హైకోర్టు(Karnataka High Court)ను ఆశ్రయించారు. అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. "ఒక్క క్షమాపణ చెబితే సమస్య పరిష్కారం అయ్యేది" అని కోర్టు వ్యాఖ్యానించింది. అప్పటికీ కమల్ వెనక్కు తగ్గలేదు. క్షమాపణ చెప్పడానికి ససేమిరా అన్నారు.

ఈ నేపథ్యంలో 'థగ్ లైఫ్' సినిమాను ప్రదర్శనకు అనుమతించాలని కోరుతూ మహేష్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. దీనిపై న్యాయమూర్తులు ఉజ్జల్ భుయాన్, మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రేక్షకుల తలపై తుపాకి పెట్టి సినిమా చూడకుండా ఆపలేమని వ్యాఖ్యానిస్తూ.. సినిమా విడుదలకు వెంటనే అనుమతించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని చెప్పారు. 

Tags:    

Similar News