‘‘పోలీసుల హింస వల్లే కస్టోడియల్ మరణం’’

అనుమానితుడిపై పోలీసుల క్రూరత్వం, తమిళనాడులో సంచలనంగా మారిన లాకప్ డెత్;

Update: 2025-06-30 12:56 GMT
అజిత్ కుమార్

మహాలింగం పొన్నుస్వామి

మాదపురం కాళీ అమ్మన్ ఆలయంలో ఇటీవల జరిగిన దొంగతనం కేసులో అరెస్ట్ అయిన సెక్యూరిటీ గార్డు కస్టోడియల్ డెత్ కేసు అనేక కీలక మలుపులు తిరిగింది. మధురై ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం ప్రక్రియలో వెల్లడైన కీలక విషయాలు ‘ఫెడరల్’ చేతికి చిక్కాయి.

తమిళనాడులోని శివగంగై జిల్లాకు చెందిన 29 ఏళ్ల ఆలయ సెక్యూరిటీ గార్డు అజిత్ కుమార్ ను దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ సందర్భంగా పోలీసులు బాధితుడిని చావబాదినట్లు వెల్లడైంది. శవపరీక్ష, ఫలితాలు, ఫొటోగ్రాఫిక్ ఆధారాల ప్రకారం తీవ్ర హింసకు గురయ్యాడు.
పోలీసుల క్రూరత్వం..
ఐదు గంటలకు పైగా పోస్ట్ మార్టం జరిగింది. కుమార్ శరీరం అంతటా కనీసం 18 గాయాలు బయటపడ్డాయి. వాటిలో అతని తల, చేతులు, వీపు, కాళ్లపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి.
రక్తస్రావం, ముఖ్యమైన అవయవాలకు నష్టం, అంతర్గత గాయాలు కూడా ఉన్నాయి. ఛాతీపై అయిన గాయం మరణాలకు ప్రత్యక్ష కారణం కావచ్చని వైద్యులు నివేదించారు.
మానసిక గాయం, ఒత్తిడి, అంతర్గత రక్త స్రావం అతని మరణానికి దోహదపడి ఉండవచ్చని పలు వర్గాలు చెబుతున్నాయి. కుమార్ కుటుంబం ఆరోపించినట్లుగా, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పైపులతో కొట్టడం, కారంపొడి పోయడం, నీరు ఇవ్వకపోవడం వంటి హింసలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ న్యాయ విచారణ, జవాబుదారీతనం కోసం డిమాండ్లను తీవ్రతరం చేశాయి. ఈ ఫొటోలు, శవపరీక్ష ఫలితాలతో కలిపి, పోలీసుల క్రూరత్వానికి బలమైన ఆధారాలను అందిస్తున్నాయి.
పెరుగుతున్న ప్రజా ఆగ్రహం..
కస్టోడియల్ మరణంపై శివగంగై జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆశిష్ రావత్ దర్యాప్తుకు ఆదేశించారు. ఈ విషయం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది.
అన్నాడీఎంకే కార్యదర్శి ఎడప్పాడి కే. పళనిస్వామి సహ ప్రతిపక్ష నాయకులు కుమార్ కుటుంబానికి న్యాయం, పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆగ్రహం పెరిగే కొద్ది ఈ కేసు మున్ముందు సంచలనంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారులు త్వరిత, పారదర్శక న్యాయం అందించాల్సిన ఒత్తిడిలో ఉన్నారు.
Tags:    

Similar News