కేటీఆర్‌కు జై కొట్టిన కవిత..?

కవితకు వాస్తవాలు అవగతం అయ్యాయా? తన మార్క్ చూపించుకోవడానికా..?;

Update: 2025-06-14 12:15 GMT

‘రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ సర్కార్ మళ్ళీ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను’ తాజాగా కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై కవిత స్పందన ఇది. ఇందులో కవిత.. కేటీఆర్‌కు తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రస్తావించారు. దీంతో కేటీఆర్ నాయకత్వాన్ని కవిత అంగీకరించినట్లేన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు పార్టీ పరంగా మాత్రమే ఆమె ఆ పోస్ట్ పెట్టారని అంటున్నవారు కూడా ఉన్నారు. కొన్ని రోజులుగా కొన్ని విషయాల్లో కవితకు, కేటీఆర్‌కు మధ్య సంబంధాలు చెడాయి. కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ తర్వాత ఈ విషయం బహిర్గతమైంది. ఆ తర్వాత అనేక సందర్భాల్లో కూడా వీరిద్దరూ ఎడమొఖం-పెడమొఖంగా వ్యవహరించడం దీనిని మరింత బలపరిచింది.

దీంతో పార్టీలో పదవులు, రాజకీయ పదవుల విషయంలోనే వీరికి మనస్పర్థలు వచ్చాయన్న వాదనల జోరందుకుంది. అంతేకాకుండా లేఖ బహిర్గతం అయిన తర్వాత నుంచి కవిత తాను బీఆర్ఎస్ నేతను అని చెప్పుకోవడమే తప్ప.. బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. ఏకాడికి తెలంగాణ జాగృతి కార్యాచరణ, కార్యక్రమాల్లోనే ఆమె ఫుల్ బిజీ అయిపోయారు. కవిత లేఖకు కొన్ని రోజుల ముందే కేటీఆర్ నాయకత్వాన్ని తాను అంగీకరిస్తానని హరీష్ రావు బహిరంగంగా ప్రకటించారు. ఇంతలో కవిత నుంచి లేఖ రావడం, విమానాశ్రయంలో ఆమె మాట్లాడుతూ కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని అనడం సంచలనంగా మారాయి. ఆమె చేసిన వ్యాఖ్యలన్నీ కూడా కేటీఆర్‌ను ఉద్దేశించే అని అంతా అనుకున్నారు.

అయితే ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో జూన్ 16న విచారణకు రావాలంటూ ఏసీబీ అధికారులు కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై కవిత సైలెంట్‌గా ఉంటారని చాలా మంది పార్టీ కార్యకర్తలు కూడా భావించారు. కానీ అలా కాకుండా అనూహ్యంగా ఈ నోటీసులను ఆమె తీవ్రంగా ఖండించారు. ‘‘రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అని అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా వారి వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. అక్రమ కేసులకు, జైలుకు వెళ్లడాలకు భయపడే వ్యక్తులు బీఆర్ఎస్‌లో లేరని అన్నారు. ఆమె స్పందించడంతో తొలుత అంతా అవాక్కయినా.. ఎట్టకేలకు ఆమె కేటీఆర్.. నాయకత్వాన్ని అంగీకరించారని భావించారు. కానీ ఆమె నిజంగానే అంగీకరించారా? అన్న అనుమానం కూడా కలుగుతుంది.

పార్టీలో స్థానం కోసమే పోస్ట్ చేశారా..?

ఒక్కసారిగా కేటీఆర్‌ నాయకత్వాన్ని అంగీకరిస్తున్నట్లు సిగ్నల్ ఇచ్చే పోస్ట్‌ను కవిత పెట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో కవిత లేఖ సంచలనం సృష్టించింది. ఆ సమయంలో ఆమె పార్టీ మారతారని చాలా మంది భావించారు. కొందరయితే అసలు కవిత కొత్త పార్టీ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనీ చెప్పారు. కానీ కవిత మాత్రం తాను బీఆర్ఎస్ నాయకురాలినని, పార్టీ తనదని అన్నారు. అయితే ఇప్పుడు ఆ విషయాన్ని ప్రూవ్ చేసుకోవడానికి, తాను ఇంకా బీఆర్ఎస్ నాయకురాలినే అని నిరూపించుకోవడానికే కవిత తాపత్రయ పడుతున్నట్లు కనిపిస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ఈ పోస్ట్ పెట్టినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నిజం తెలిసి యూటర్న్ తీసుకున్నారా..?

తెలంగాణలో కవిత లేఖ వివాదం నడుస్తున్న సమయంలో ఆమె సొంత పార్టీ పెట్టనున్నారని గట్టిగా ప్రచారం జరిగింది. పలు సందర్భాల్లో కేటీఆర్ నాయకత్వాన్ని ఆమె పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు కూడా మాట్లాడారు. ఒకసారి మీడియా చిట్‌చాట్‌లో కేటీఆర్‌ను ఉద్దేశించి ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని స్టార్ట్ చేశారు. అందులో బీఆర్ఎస్‌కు సంబంధించి కానీ, కేటీఆర్‌కు సంబంధించి కానీ ఎటువంటి గుర్తులు లేవు. కేవలం కేసీఆర్ ఫొటోలు కొన్ని చోట్లు ఉన్నాయి అంతే. దీంతో తెలంగాణ జాగృతిని కవిత తన కొత్త పార్టీగా మారుస్తుందని అంతా భావించారు.

దానికి తోడు ఆ తర్వాత కవిత ఎక్కడా కూడా బీఆర్ఎస్ కండువా వేసుకుని కూడా కనిపించలేదు. ఏకాడికి తెలంగాణ జాగృతినే ప్రమోట్ చేశారు. ఆమె తెలంగాణ జాగృతి నాయకురాలిని అని చెప్పుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించారు. కానీ ఇప్పుడు ఎందుకో? ఎలానో? అది సాధ్యపడదని, జాగృతినే నమ్ముకుని రాజకీయాల్లో ఎదగడం, ముందుకు వెళ్లడం చాలా కష్టమవుతుందని ఆమెకు అవగతమైంది. అందువల్లే ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్‌నే కలుపుకుని పోవాలని ఫిక్స్ అయ్యారామే. ఆ ప్రయత్నాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకించడంతో స్టార్ట్ చేశారు.

Tags:    

Similar News