తెలంగాణ మంత్రులకు 'కేసీఆర్' ల్యాండ్ క్రూయిజర్లు

తెలంగాణ మంత్రులు ఇకపై అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ప్రభుత్వ వాహనాలలో ప్రయాణించనున్నారు. మంత్రులకు త్వరలో ల్యాండ్ క్రూయిజర్ కార్లు కేటాయించనున్నారు.

Update: 2024-06-12 07:23 GMT

తెలంగాణ మంత్రులు ఇకపై అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ప్రభుత్వ వాహనాలలో ప్రయాణించనున్నారు. కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు ఆయన కోసం రూపుదిద్దుకున్న కాస్ట్లీ కార్లు మంత్రులకు ఇవ్వనున్నారు. రాష్ట్ర మంత్రులకు త్వరలో ల్యాండ్ క్రూయిజర్ కార్లు కేటాయించనున్నారు. పూర్తిస్థాయి బుల్లెట్ ప్రూఫ్ తోపాటు శాటిలైట్ ఆధారిత టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ కార్లను మంత్రులకు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వంలో కేసీఆర్ వాడిన కాన్వాయ్ వాహనాలకే రంగులు మార్చి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వాడుతుండటంతో... ఈ వాహనాలను మంత్రులకు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన కాన్వాయ్ కోసం రూ.66 కోట్లతో 22 ల్యాండ్ క్రూయిజర్ కార్లను కొన్నారు. వాటికి బుల్లెట్ ప్రూఫ్ తోపాటు, ఇతర టెక్నాలజీ సిస్టంని అమర్చే పనులు విజయవాడ లోని త్రిహాయని ఇంజనీరింగ్ వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ కు అప్పగించారు. టెక్నాలజీతో పాటు అన్ని హంగులతో రూపుదిద్దుకున్న ఆ కార్లను ఇప్పుడు రాష్ట్ర మంత్రులు ప్రయాణించేందుకు వాడనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకంటే ముందే వాహనాలు సిద్ధమై తెలంగాణకి రావాల్సి ఉండగా పనుల్లో ఆలస్యం కారణంగా అవి విజయవాడలోనే ఉండిపోయాయి. అదనపు హంగుల పనులు పూర్తి కావడంతో త్వరలో కొత్త కార్లను విజయవాడ నుంచి హైదరాబాద్ తీసుకురానున్నారు.

కొద్దిరోజుల క్రితమే కొత్త వాహనాలు హైదరాబాద్ కి రావాల్సి ఉన్నప్పటికీ పార్లమెంటు ఎన్నికల హడావిడి, కోడ్ కారణంగా వాటిని ఇక్కడికి తీసుకురాలేదు. ప్రస్తుతం కోడ్ ముగియడం, సాధారణ పరిస్థితులు నెలకొనడంతో త్వరలో ఆ కార్లను హైదరాబాద్ తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే నిఘా విభాగం అధికారులు విజయవాడ వెళ్లి కొత్త వాహనాల పనితీరును పరిశీలించి వచ్చారు. 

Tags:    

Similar News