దసరా కానుకగా 42శాతం రిజర్వేషన్లు

దసరా కంటే ముందే బీసీ బిడ్డలకు పండుగ వాతావరణం వచ్చిందన్న మంత్రులు పొన్నం,వాకిటి

Update: 2025-09-29 13:01 GMT

మాతృమూర్తికి ప్రసవ వేదన అనేది ప్రకృతి ఇచ్చిన వరమని,అలాగే 42 శాతం రిజర్వేషన్లు బీసీ బిడ్డలకు ఇచ్చిన వరంగా మంత్రులు పొన్నం ప్రభాకర్ , వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.రాష్ట్ర ప్రజలందరికీ మంత్రులు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.బీసీ రిజర్వేషన్ల తోనే స్థానిక ఎన్నికలకు వెళుతున్నామన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ దసరా కంటే ముందే బీసీ బిడ్డలకు పండుగ వాతావరణం వచ్చిందన్నారు. ‘మేము ఎంతో మాకు అంతా వాటా’ అని రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కులగణన చేశారని,దాని ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.వాస్తవానికి బీసీలకు రిజర్వేషన్లలలో ఇంకా వాటా రావాలి కానీ కుదించుకొని 42 శాతం రావాలి అని అడుగుతున్నామని చెప్పుకొచ్చారు.రిజర్వేషన్లు అమలు కాకపోతే బీసీ బిడ్డలు ఇంకా వెనకబడిపోతారన్నారు. జయలలిత బీసీ రిజర్వేషన్లు పెంచి 9 షెడ్యూలు పెట్టినప్పుడు జయలలిత పార్టీ కేంద్రంలో అధికారంలో లేదని తెలిపారు. రాష్ట్రాల్లో ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి కేంద్రం బిల్లుకు ఆమోదం తెలపాలని అన్నారు.

తాము ఎవరికీ వ్యతిరేకం కాదని,ఎవరి నోటి కాడ ముద్ద లాక్కోవడం లేదని మంత్రులు స్పష్టం చేశారు. పార్టీ మెప్పు కోసం, నాయకుల మెప్పు కోసం ఎవరూ మాట్లాడి సమాజంలో తలవంపులు తెచ్చుకోవద్దని అన్ని పార్టీల బీసీ నాయకులకు తాము కోరుతున్నామని పొన్నం ప్రభాకర్ అన్నారు.అంతేకాని మీరే హామీ ఇచ్చారు,మీరే చేయాలి అని బట్ట కాల్చి మీద వేస్తాం అంటే ఎలా? అని ప్రశ్నించారు.రాష్ట్ర పరిధిలో ఉన్న అన్ని ప్రయత్నాలు చేశామని,కేంద్రం చేయాల్సింది చేయకపోగా ,బీజేపీ నాయకులు కాళ్లలో కట్టే పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
Tags:    

Similar News