బయటకొస్తున్న రేవంత్ వ్యతిరేక వర్గం!!

కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన తాజా ప్రకటన రాజకీయ వర్గాల్లో కలవరం రేపుతోంది.

Update: 2024-07-29 14:42 GMT

కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన తాజా ప్రకటన రాజకీయ వర్గాల్లో కలవరం రేపుతోంది. ఆదివారం సంగారెడ్డిలో బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న ఆయన... వచ్చే పదేళ్లలో సీఎం అవుతా... పదేళ్లు రాష్ట్రాన్ని పాలిస్తా. నేను ప్రస్తుతం ఎమ్మెల్యేను కాను కానీ.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి రానున్న పదేళ్లలో సీఎం అవుతానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఆయన చేసిన ఈ ప్రకటన సీనియర్ నాయకులకు కోపం తెప్పించగా, క్యాడర్‌లో గందరగోళం సృష్టించింది.

సంగారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ క్యాడర్ ఆయన అందుబాటులోకి వస్తాడని ఎదురుచూస్తుండగా, నిత్యం నియోజకవర్గానికి రాని జగ్గారెడ్డి ప్రకటనలకే పరిమితమయ్యారు. ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ తన పంథాను సరిదిద్దుకోవడంలో విఫలమయ్యారనేది మరోసారి స్పష్టం అవుతోంది. జగ్గా రెడ్డి భార్య నిర్మలా రెడ్డి నామినేటెడ్ పదవిని పొందినప్పటికీ, ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. దీనికి కారణం సంగారెడ్డిలో ఓడిపోతే నియోజకవర్గంలో అడుగుపెట్టను అంటూ ఆయన చేసిన శపథం కాబోలు.

అయితే జగ్గారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. సొంతపార్టీ నేతలపైనా అనేకసార్లు విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు. ఎన్నికల ముందు కూడా తానే సీఎం అభ్యర్థినని స్వయం ప్రకటన చేసుకుని పార్టీలోని సీనియర్ల ఆగ్రహానికి గురయ్యారు. రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇవ్వడంపైనా ఆయన అసంతృప్తిగా ఉన్నారనేది బహిరంగ సత్యమే. పదేళ్ల వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని, తర్వాత టర్మ్ లో కూడా తానే సీఎం గా ఉంటానని రేవంత్ రెడ్డి ఓ తెలుగు మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. ఇప్పుడు జగ్గారెడ్డి అందుకు భిన్నంగా రానున్న పదేళ్లలో తాను సీఎం అవుతానంటూ ప్రకటన చేయడం రేవంత్ దూకుడుకి అడ్డుకట్ట వేయాలని ప్రయత్నమా లేక ఓ వర్గం ఇంకా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానే ఉందని సంకేతాలివ్వడమా అనే చర్చ మొదలైంది.

Tags:    

Similar News