తెలంగాణ రైజింగ్పై యూజీ మాజీ ప్రధాని ప్రశంసలు
స్థిరత్వ సూత్రాలతోనే అభివృద్ధి సాధ్యమన్న టోనీ బ్లెయిర్.;
తెలంగాణ రైజింగ్ 2047 కు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం.. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో భేటీ అయ్యారు. ఇందులో ఆయనకు తెలంగాణ రైజింగ్ 2047 అజెండాను వివరించారు. తెలంగాణ రైజింగ్ ఆలోచనను టోనీ ప్రశంసించారు. ఈ సందర్భంగా తెలంగాణలో రైతులు, యువత, మహిళలు వంటి విభిన్న వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి టోనీబ్లెయిర్కు తెలియజేశారు. మానవ అభివృద్ధి సూచికల్లో అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పట్టణ, పట్టణ శివారు, గ్రామీణ ప్రాంతాల వారీగా తాము అమలు చేయబోయే సూక్ష్మ ప్రణాళికను యూకే మాజీ ప్రధానమంత్రికి సీఎం తెలియజేశారు.
తెలంగాణ రైజింగ్ 2047 ముఖ్య అంశాలను తెలియజేస్తూ, ఈ విజన్ను 2025, డిసెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వ రెండో వార్షికోత్సవం సందర్భంగా ప్రజలకు వెల్లడించనున్నట్లు సీఎం తెలిపారు. సుస్థిరాభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళిక ఉందని టోనీ బ్లెయిర్ ప్రశంసించారు. “భారత్ ఫ్యూచర్ సిటీ,” “యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ,” “యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ” వంటి ప్రాజెక్టులపై టోనీబ్లెయిర్ ఆసక్తి చూపారు. ఇరు నేతలు గంటకుపైగా సమావేశమైన అనంతరం తెలంగాణ రైజింగ్ విజన్ రూపకల్పన, అమలులో భాగస్వామ్యానికి తెలంగాణ ప్రభుత్వం, TBIGC ప్రతినిధులు ఉద్దేశ పత్రాన్ని (Letter of Intent) పరస్పరం మార్చుకున్నారు.