సర్కార్ కొత్త రూల్... ఇకపై రేషన్, హెల్త్ కార్డులకు లింక్ ఉండదు

రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీకి సంబంధించి సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ‘ప్రజా పాలన’ కార్యక్రమం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

Update: 2024-08-27 14:14 GMT

రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీకి సంబంధించి సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ‘ప్రజా పాలన’ కార్యక్రమం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు, హెల్త్ కార్డు జారీ చేసేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. మంగళవారం సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారితో పాటు సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ... ఇకపై రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు లింక్ ఉండదని, వాటిని వేర్వేరుగా జారీ చేయాలని చెప్పారు. ఈ కార్డుల జారీకి ప్రతి కుటుంబం నుంచి అవసరమైన వివరాలను సేకరించాలన్నారు. అందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, వార్డుల్లో ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించడానికి వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

హెల్త్ డిజిటల్ కార్డుల జారీకి అనుసరించాల్సిన పద్ధతి, హెల్త్ ప్రొఫైల్స్ నమోదుకు చేయాల్సిన వైద్య పరీక్షలు, అందుకోసం వైద్య శిబిరాల నిర్వహణ, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న లాబోరేటరీల వివరాల వంటి అంశాలన్నింటినీ పరిశీలించి కార్యాచరణను సిద్ధం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య సేవలకు, సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించేందుకు ఇకపై ప్రభుత్వం జారీ చేసే హెల్త్ కార్డు ప్రామాణికంగా ఉంటుందని సీఎం తెలిపారు. 

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి... 

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. డెంగ్యూ, చికున్ గున్యా, వైరల్ జ్వరాలతో వివిధ ఆసుపత్రుల్లో పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధులు ప్రబలకుండా తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రేయింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో క్రమం తప్పకుండా ఫాగింగ్ జరిగేలా చూడాలని, ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలని సీఎం ఆదేశించారు.

ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చేపట్టే చర్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే ఉద్యోగులు, సిబ్బందిపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. జీహెచ్ఎంసీ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. అవసరమైతే పోలీసు విభాగం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహకారం తీసుకొని సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు సీజనల్ వ్యాధులపై వెంటనే ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని, గ్రామాలు, పట్టణాలకు వెళ్లి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. డెంగ్యూ, చికున్ గున్యా కేసులు నమోదైన ప్రాంతాలకు వెళ్లి కారణాలను గుర్తించాలని, అవసరమైన పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.

Tags:    

Similar News