‘కాంగ్రెస్ పాలనను బీఆర్ఎస్ పాలనతో పోల్చద్దు..’
ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ అన్న సీఎం రేవంత్
రెండేళ్ల కాంగ్రెస్ పాలనను, పదేళ్ల బీఆర్ఎస్ పాలనను ఎట్టిపరిస్థితుల్లో పోల్చద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రెండు పాలనలకు నక్కకు నాగలోకానికి ఉన్న వ్యత్యాసం ఉందన్నారు. తమ పాలనలో ప్రజలకు మేలు జరిగితే.. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను ముంచిందని విమర్శించారు. ఆదివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పలు విషయాలు తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణ పూర్తిగా దివాలా తీయడానికి కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. కేసీఆర్ తీసుకొచ్చిన ఒక్క పథకాన్ని కూడా తాము ఆపలేదని, అన్ని పథకాలు కొనసాగుతున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో నాశిరకం బతుకమ్మ చీరలు ఇచ్చి దోపిడీ చేస్తే.. తమ ప్రభుత్వం మాత్రం కోటి మంది మహిళలకు నాణ్యమైన చీరలు రెండిటిని ఇవ్వాలని పథకాన్ని తీసుకొచ్చిందన్నారు.
జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధిని కొలబద్దగా తీసుకుని పరిశీలించి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటు వేయాలన్నారు. 2004 నుంచి 2014 వరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, 2014-2023 వరకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధిని ప్రజలు పరిశీలించాలని, ఆ విషయాలను తమను ప్రశ్నించి ఒక నిర్ణయానికి రావాలని అన్నారు. అసలు అభివృద్ధి జరిగిందే కాంగ్రెస్ పాలనలో అని అన్నారు. ‘‘ఉచిత కరెంట్ పథకాన్ని తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే. రూ.1300 కోట్ల బకాయిలను రద్దు చేసిన ఘనతా ఆయనకే సొంతం. వ్యవసాయాన్ని పండగగా మార్చిన నేత వైఎస్సార్. రైతులకు అండగా నిలుస్తూ వారి సంక్షేమం కోసం ఎన్నో ప్రాజెక్ట్లను నిర్మించిన పార్టీ కాంగ్రెస్. ప్రతి పథకాన్ని కూడా కాంగ్రెస్ పక్కాగా అమలు చేశాం’’ అని రేవంత్ చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పోలిక వద్దు..
‘‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనను, రెండేళ్ల కాంగ్రెస్ పాలనను పోల్చవద్దు. అన్ని రంగాల్లో బకాయిలు పెట్టి రూ.8లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని మాకు అప్పగించారు. వందేళ్లు పూర్తి అయిన ఉస్మానియా ఆసుపత్రిని కూడా కట్టలేదు. తెలంగాణను దివాళా తీశారు. తాడు తెగితే పాతాళంలో పడే పరిస్థితికి రాష్ట్రాన్ని తెచ్చారు. వాళ్లు దొడ్డు బియ్యం ఇస్తే మేము సన్నబియ్యం ఇస్తున్నాం. కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. రుణమాఫీ చేశాం. రైతు భరోసా అందించాం. వంట గ్యాస్ను రూ.500కే అందిస్తున్నాం. 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీగా అందిస్తున్నాం’’ అని తెలిపారు.
జూబ్లీహిల్స్పై కాంగ్రెస్ జెండా..
‘‘తెలంగాణలో కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉంటుంది. ప్రాధాన్యత వారీగా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాపై ఉంది. జూబ్లీహిల్స్లో గెలవాల్సిందే.. నియోజకవర్గం అభివృద్ధి జరగాల్సిందే. బీఆర్ఎస్కు గతమే తప్ప భవిష్యత్ లేదు. బీఆర్ఎస్.. పంతులు లేని బడిలా నడుస్తోంది. నాది లీడర్ మైండ్ సెట్ కాదు. క్యాడర్ మైండ్ సెట్. అందుకే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నా. గడప గడపకు కూడా ప్రచారం చేస్తా అన్నా.. సెక్యూరిటీ ఒప్పుకోలేదు. అందుకే ఆగిపోయా. జూబ్లీ పోరులో బీజేపీకి డిపాజిట్ కూడా రాదు’’ అని అన్నారు.
నవీన్ యాదవ్.. రౌడీనా..!
‘‘నవీన్ యాదవ్ను రౌడీ.. రౌడీ అంటున్నారు. అతడు ఆర్కిటెక్ చదివాడు. అతను గతంలోనే చెప్పాను వాళ్ల నాన్ను చూపి తనను రౌడీ అంటే.. పాస్ పోర్ట్ బ్రోకర్ కొడుకును ఏమనాలి? అని అన్నాడు. అంతేకాకుండా తన తండ్రి ఫోన్లో అరిచారని చెప్తూ కూడా కేటీఆర్.. నవీన్పై నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నారు. సునీతకు ఓటు వేయాలని అడగడాన్ని ఎవరూ తప్పుబట్టరు. రాజకీయాల్లో ప్రతి పార్టీ తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి వ్యూహాలు రచిస్తారు, వాటిని అమలు చేస్తారు. కానీ వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు అనవసరం’’ అని రేవంత్ హితవు పలికారు.