ప్రజాస్వామ్యం.. మందస్వామ్యం కాకూడదు: కేటీఆర్

వివక్షను కొనసాగించేందుకు డీలిమిటేషన్ అంశాన్ని ముందుకు తీసుకొస్తుంది. బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులను ఉత్తరాదికే పరిమితం చేయడం ఒక ఉదాహరణ అని కేటీఆర్ అన్నారు.;

Update: 2025-03-22 09:35 GMT

డీలిమిటేషన్‌కు వ్యతికంగా చెన్నైలో జరుగుతున్న జేఏసీ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి అంశంలో కూడా దక్షిణాది రాష్ట్రాలు అణచివేతకు గురవుతున్నాయని గుర్తు చేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదని, కానీ ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని మందస్వామ్యంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ డీలిమిటేషన్‌ను ఉద్దేశించిన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యం మందబలం ఆధారంగా నడవడం మంచిది కాదని, అది అసలు సరైన పద్దతి కాదని అన్నారు.

కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ వల్ల అనేక కష్టాలు వస్తాయని కేటీఆర్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై వివక్షపూరితంగా కేంద్రం ఈ డీలిమిటేషన్ ప్రతిపాదనలు చేసిందని ఆరోపించారు. దేశ అభివృద్ధి కోసం కుటుంబ నియంత్రణను విజయవంతం చేసినందుకు.. ఇరోజు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని, అప్పట్లో ఉత్తరాదిలోని రాష్ట్రాల తరహాలోనే మాకెందకని అనుకుని ఉంటే.. ఈ కష్టం వచ్చి ఉండేది కాదన్నారు. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించేయాలని, తద్వారా దక్షిణాది రాష్ట్రాల గొంతునొక్కేయాలనే కేంద్రం ఈప్రణాళికలు సిద్ధం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ ఆధ్వర్యంలో 14 ఏండ్ల పాటు తెలంగాణ ఉద్యమం నడిపించారు. 14 సంవత్సరాల అనంతరం తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చుకున్నాం. తమిళనాడు ప్రజల నుంచి అనేక అంశాలు స్ఫూర్తి తీసుకుంటాం. అస్తిత్వం, హక్కుల కోసం కొట్లాడడంలో తమిళనాడు స్ఫూర్తినిచ్చింది. ద్రవిడ ఉద్యమం సమైక్య దేశంలో తమ హక్కులు సాధించడానికి రాష్ట్రాలకు ఒక దిక్సూచీ లెక్క పని చేస్తుందన్నారు కేటీఆర్.

దేశానికి 36 శాతం జీడీపీలో భాగస్వామ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయి. డీలిమిటేషన్ కేవలం పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గడమే కాదు.. ఆర్థికపరమైన నిధుల కేటాయింపుల్లో తీవ్రమైన నష్టం జరిగే ప్రమాదం ఉంది. మొదటి నుంచి దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోంది. ఎన్డీఏ పాలనలో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష మరింత పెరిగింది. వివక్షను కొనసాగించేందుకు డీలిమిటేషన్ అంశాన్ని ముందుకు తీసుకొస్తుంది. బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులను ఉత్తరాదికే పరిమితం చేయడం ఒక ఉదాహరణ. జనాభా దామాషా ప్రకారం డీలిమిటేషన్ జరిగితేనే దేశ సమాఖ్య స్ఫూర్తికే విఘాతం కలుగుతుందని కేటీఆర్ అన్నారు.

Tags:    

Similar News