రాజాసింగ్ పార్టీకి ఎందుకు రాజీనామా చేశాడో తెలుసా ?

రాజాసింగ్ ఎంతమందిని అడిగినా సంతకాలు పెట్టమని చెప్పినట్లు తెలిసింది;

Update: 2025-06-30 12:41 GMT
BJP MLA Rajasingh

గోషామహల్ బీజేపీ ఎంఎల్ఏ రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేయటం సంచలనంగా మారింది. మొదటినుండి వివాదాస్పదుడైన రాజాసింగ్(BJP MLA Rajasingh) ఏమి మాట్లాడినా పార్టీలో సంచలనమవుతోంది. ఈ పరిస్ధితుల్లో కొత్త అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు(N Ramachadra Rao) నామినేషన్ వేసి ఏకగ్రీవంగా ఎన్నికైన రోజే తీవ్ర అసంతృప్తితో ఎంఎల్ఏ పార్టీకి రాజీనామా చేయటం పార్టీలో కలకలంరేగింది. రాజాసింగ్ పార్టీ(Telangana BJP)కి మాత్రమే రాజీనామా చేశారు ఎంఎల్ఏ పదవికి కాదు. అంతా బాగానే ఉందికాని అసలు రాజాసింగ్ రాజీనామాచేయటానికి కారణం ఏమిటి ? ఏమిటంటే ఎంఎల్ఏకి పార్టీలో ఘోర అవమానం ఎదురైందని సమాచారం.

ఇంతకీ ఎంఎల్ఏకి ఎదురైన అవమానం ఏమిటంటే రాజాసింగ్ అధ్యక్షపదవికి పోటీచేయాలని అనుకున్నారు. పార్టీ ఆఫీసుకువచ్చి నామినేషప్ ఫారమ్ కూడా తీసుకున్నారు. అయితే చివరికి నామినేషన్ వేయకుండానే పార్టీ ఆఫీసు నుండి వెనక్కు వెళ్ళిపోయారు. కారణం ఏమిటంటే అధ్యక్షపదవికి పోటీచేసేవారికి పార్టీలోని పదిమంది నేతలు ప్రపోజర్లుగా సంతకాలు పెట్టాలి. రామచంద్రరావుకు పదిమంది సీనియర్ నేతలు సంతకాలు చేసి ప్రపోజ్ చేశారు. రాజాసింగ్ దగ్గరకు వచ్చేసరికి సంతకాలు చేయటానికి ఎవరూ ముందుకు రాలేదు. రాజాసింగ్ ఎంతమందిని అడిగినా సంతకాలు పెట్టమని చెప్పినట్లు తెలిసింది. ఓల్డ్ సిటీలో తన మద్దతుదారులుగా ఉన్న రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముగ్గురు మాత్రమే రాజాసింగ్ నామినేషన్ ఫారమ్ పైన సంతకాలు పెట్టడానికి సిద్ధపడ్డారు.

పదిమంది సంతకాలు చేయాల్సిన ఫారమ్ లో ముగ్గురు సంతకాలుచేస్తే నామినేషన్ ఫారమ్ చెల్లుబాటు కాదు. తన నామినేషన్ పై ఎందుకు సంతకాలు చేయటంలేదని అడిగినపుడు పార్టీ నాయకత్వం సంతకాలు చేయవద్దని తమను ఆదేశించినట్లు కొందరు సీనియర్లు ఎంఎల్ఏతో చెప్పారని సమాచారం. రాజాసింగ్ నామినేషన్ ఫారమ్ లో మద్దతుదారులుగా ఎవరూ సంతకాలు చేయద్దని జాతీయ నాయకత్వం నుండి సోమవారం ఉదయమే ఆదేశాలు అందినట్లు సమాచారం. జాతీయనాయకత్వం నుండి ఆదేశాలు అందినతర్వాత నేతలు సంతకాలు ఎందుకు చేస్తారు ?

జాతీయ నాయకత్వం నుండి అందిన సమాచారం ప్రకారమే సీనియర్లు సంతకాలు చేయటానికి వెనకాడారు. దాంతో తననామినేషన్ ఫారమ్ లో సంతకాలు చేయటానికి కూడా సీనియర్లను జాతీయ నాయకత్వం కట్టడిచేయటాన్ని రాజాసింగ్ చాలా అవమానంగా ఫీలైనట్లు తెలిసింది. మూడుసార్లు వరుసగా ఎంఎల్ఏగా గెలిచిన తనకు పార్టీలో ఇలాంటిఅవమానం ఎదురవుతుందని రాజాసింగ్ ఊహించలేదు. నామినేషన్ ఫారమ్ కూడా వేయనీయకుండా నాయకత్వం తనను అడ్డుకున్న తర్వాత తాను పార్టీలో ఉండి ఉపయోగం లేదని ఎంఎల్ఏకి అర్ధమైంది. ఇంతజరిగిన తర్వాత కూడా తాను పార్టీలోనే ఉంటే మరిన్ని అవమానాలు ఎదురవ్వటం తప్ప ఉపయోగం ఉండదని అర్ధమైన తర్వాతే పార్టీకి రాజాసింగ్ రాజీనామా చేశారు.

మొదటినుండి వివాదాస్పదమే

పార్టీ తరపున మూడుసార్లు గెలిచిన రాజాసింగ్ మొదటినుండి వివాదాస్పదుడే. పార్టీ లైన్ను కాదని సొంత అజెండాతోనే రాజాసింగ్ రాజకీయాలు చేస్తున్నారు. ఓల్డ్ సిటీ(Old City)లో కీలకమైన గోషామహల్(Gosha Mahal) నియోజకవర్గంలో మూడుసార్లు గెలిచిన తాను తప్ప పార్టీకి మరో నేత దిక్కులేరన్నట్లుగా ఎంఎల్ఏ వ్యవహరిస్తుంటారు. అందుకనే పార్టీలైన్ దాటి స్వతంత్రంగా వ్యవహరిస్తు వివాదాస్పదమవుతున్నారు. మత ఘర్షణలు రెచ్చగొట్టేట్లుగా మాట్లాడినందుకే బీఆర్ఎస్(BRS) హయాంలో కేసు నమోదై అరెస్టయి జైలుకు కూడా వెళ్ళారు. రాజాసింగ్ జైలులో ఉన్నపుడు పార్టీలేని నేతల్లో ఒక్కళ్ళు కూడా పరామర్శకు వెళ్ళలేదు. దాంతో ఎంఎల్ఏకి బాగా మండిపోయింది. పార్టీ పటిష్టత కోసం తాను కష్టపడుతుంటే పార్టీ తనకు కష్టకాలంలో అండగా నిలవలేదనే కోపం పేరుకుపోయింది. సొంత అజెండాతో పార్టీని కూడా ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్న రాజాసింగ్ తో పార్టీనేతల్లో చాలామంది దూరంగా ఉంటున్నారు. ఇలాంటి అనేక పరిణామాలు, కారణాలతో రాజాసింగ్ పార్టీలో ఒంటరైపోయారు. అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకంతో తనలోని అసంతృప్తి ఒక్కసారిగా బయటపడి పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామాను ఉపసంహరించుకునేట్లుగా కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay), పార్టీ ఇన్చార్జి సునీల్ బన్సల్ ఎంత నచ్చచెప్పినా రాజాసింగ్ రాజీనామాను వెనక్కు తీసుకోవటానికి ఇష్టపడలేదు. చివరకు ఏమవుతుందో చూడాలి.

Tags:    

Similar News