కేసీఆర్ ను ఈటల ఇరికించేశారా ?
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తనకేమీ తెలీదని మొత్తం కేసీఆర్(KCR), హరీషే(Harish) చేసినట్లు వాగ్మూలం ఇచ్చారు;
‘మొత్తం కేసీఆరే చేశారు..నాకేమీ సంబంధంలేదు’...ఇది తాజాగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు మాజీ ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పిన వాగ్మూలం. కాళేశ్వరం అవినీతి, అవకతవకలపై ఎనుమల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తో విచారణ చేయిస్తున్న విషయం తెలిసిందే. 15 నెలల పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు, రిటైరైన ఇంజనీర్లు, ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్ధ ఎల్ అండ్ టీ ప్రతినిధులు సుమారు 110 మందిని విచారించిన కమిషన్ శుక్రవారం నుండి రాజకీయ నేతల విచారణ మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే మొదట ఈటల కమిషన్ ముందు దాదాపు గంటన్నరసేపు తన వాదన వినిపించారు.
తర్వాత మీడియాతో మాట్లాడుతు కమిషన్ అడిగిన అన్నీ ప్రశ్నలకు తాను సమాధానం చెప్పినట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తనకేమీ తెలీదని మొత్తం కేసీఆర్(KCR), హరీషే(Harish) చేసినట్లు వాగ్మూలం ఇచ్చారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన సమస్త సమాచారం అంతా కేసీఆర్, హరీష్ దగ్గరే ఉన్నదని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణంలో తన పాత్ర కేవటం నిధులు విడుదలచేయటం మాత్రమే అని కుండబద్దలు కొట్టినట్లు తెలిపారు. తనకు ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక విషయాలేవీ తెలియవన్నారు. ప్రాజెక్టు కట్టాలన్న ఆలోచన కేసీఆర్ దే అని కొన్ని వందలసార్లు కాళేశ్వరం ప్రాజెక్టు తన మానసపుత్రికగా చెప్పిన విషయాన్ని కమిషన్ కు తాను గుర్తుచేసినట్లు ఈటల(Eatala Rajendar) తెలిపారు.
కమిషన్ ముందు ఈటల చెప్పిన మాటల ప్రకారం కాళేశ్వరం అవినీతి, అవకతవకలకు పూర్తి బాధ్యత కేసీఆర్, హరీష్ దే అని చెప్పినట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే అంతా కేసీఆరే చేశారని చెప్పటంలోనే ఈటల భావన ఏమిటో అర్ధమైపోతోంది. కమిషన్ ముందు వాగ్మూలాలు ఇచ్చిన 110 మందిలో చాలామంది అవినీతి, అవకతవకలకు పూర్తి బాధ్యత అప్పటి పాలకులే అని చెప్పిన విషయం తెలిసిందే. 110 మంది పాలకులదే బాధ్యత అన్నారో లేకపోతే ఈటల ఇపుడు చెప్పినట్లుగా కేసీఆర్, హరీష్ దే బాధ్యత అని పేర్లుతో చెప్పారో తెలీదు. పాలకులదే బాధ్యతని చెప్పారంటే అర్ధమేంటి ? అప్పటి పాలకుడు అంటే కేసీఆర్ మాత్రమే కదా. కాబట్టి కమిషన్ ముందు వాగ్మూలమిచ్చిన 110 మందిలో చెప్పిన వాళ్ళ మాటలు, ఇపుడు ఈటల చెప్పిన మాటలు ఒకటిగానే ఉన్నాయి.
ఈటల మాటలు విన్న తర్వాత కాళేశ్వరం అవినీతి, అవకతవకల్లో కేసీఆర్ ను ఇరికించేశారని అర్ధమవుతోంది. కేసీఆర్ ఇరుక్కుంటే హరీష్ కూడా ఇరుక్కోక తప్పదు. ఎందుకంటే ఇరిగేషన్ మంత్రిగా పనిచేసింది హరీష్ రావే కాబట్టి. అప్పట్లో హరీష్ ఛైర్మన్ గా పనిచేసిన మంత్రివర్గం ఉపసంఘంలో సభ్యులుగా ఉన్న ఈటల ఇపుడు బీజేపీ ఎంపీగా ఉంటే, తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఇద్దరు కూడా కేసీఆర్ తో విభేదించి పార్టీలో నుండి బయటకు వచ్చినవారే. ఇద్దరినీ కేసీఆర్ అవమానకరంగా బయటకు పంపించారు. ఈ నేపధ్యంలోనే కమిషన్ ముందు వాగ్మూలమిచ్చిన ఈటల అప్పట్లో ఏమి జరిగిందనే విషయంలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పినట్లు అర్ధమవుతోంది.
కాళేశ్వరం సమస్య ఏంటి ?
దాదాపు రు. 84 వేల కోట్ల ప్రజాధనం ఖర్చుచేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు దాని అనుబంధ ప్రాజెక్టులు ఇపుడు పనికిరాకుండా పోయాయి. మేడిగడ్డ ప్రాజెక్టు 7వ బ్లాకులోని మూడు పిల్లర్లు భూమిలోకి కుంగిపోయాయి. ఎప్పుడైతే పిల్లర్లు కుంగిపోయాయో వాటిపైన నిర్మించిన బ్యారేజి ప్లాట్ ఫారమ్ కూడా చాలాచోట్ల పగుళ్ళిచ్చేసింది. పిల్లర్లు కూడా చాలాచోట్ల చీలిపోయాయి. కాబట్టి మేడిగడ్డ ప్రాజెక్టు నీటినిల్వకు పనికిరాదు. మేడిగడ్డ ప్రాజెక్టులో నీటినిల్వ చేయలేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి నిల్వ సాధ్యంకాదు. మేడిగడ్డ ద్వారా సుందిళ్ళ, అన్నారం బ్యారేజీలకు నీరు అందాలి. మేడిగడ్డలోనే నీటి నిల్వలేకపోతే ఇక దీనిపైన ఆధారపడిన అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల్లో నీటి నిల్వకు అవకాశమే లేదు. కాబట్టి కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం నిరుపయోగంగా మారిపోయాయి. అందుకనే పైన చెప్పిన నాలుగింటిలో పడిన నీటిని పడినట్లుగా ఇరిగేషన్ శాఖ బయటకు వదిలేస్తోంది.
కేసీఆర్ వాదనేంటి ?
బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మితమై బీఆర్ఎస్ హయాంలోనే మేడిగడ్డకు పగుళ్ళు వచ్చేసినా దాంతో తమకు ఎలాంటి సంబంధంలేదని అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీష్ వాదిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎక్కడా అవినీతి, అవకతవకలు జరగలేదని అడ్డంగా దబాయిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయిన విషయం మాట్లాడకుండా కాంగ్రెస్ హయాంలో ఎప్పుడో కట్టిన నాగార్జున సాగర్ ప్రాజెక్టులో లోపాల గురించి మాట్లాడుతున్నారు. తమ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులు నాసిరకం నిర్మాణాల కారణంగా తమ హయాంలోనే దెబ్బతిన్నా దాంతో తమకు సంబంధంలేదని అడ్డంగా వాదించటం కేటీఆర్, హరీష్ కే చెల్లింది.
దోషులను శిక్షించాలి
కమిషన్ విచారణ తర్వాత మీడియాతో ఈటల మాట్లాడినపుడు దోషులెవరో తేల్చి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమండ్ చేశారు. కమిషన్ తన విచారణను వీలైనంత తొందరగా ముగించి రిపోర్టు రెడీ చేయాలన్నారు. తన రిపోర్టులో కమిషన్ ఛైర్మన్ అసలు దోషులెవరో తేల్చాలని గట్టిగా అడిగారు. కమిషన్ రిపోర్టు ఆధారంగా దోషులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిపోర్టు మొత్తాన్ని ప్రభుత్వం బయటపెట్టాలని కూడ డిమాండ్ చేశారు. రిపోర్టు ప్రజల ముందుంచితే అసలైన దోషులెవరో ప్రజలే తేల్చుకుంటారని కూడా ఈటల ప్రభుత్వానికి చెప్పారు.
కమిషన్ ఏమి చేయబోతోంది ?
ఈరోజు ఈటల విచారణ అయిపోయిన తర్వాత హరీష్ 9వ తేదీన కమిషన్ విచారణకు హాజరవబోతున్నారు. 110 మంది అపిడవిట్ల ఆధారంగా, తాజగా ఈటల వాగ్మూలం నేపధ్యంలో హరీష్ కమిషన్ ముందు ఏమి చెబుతున్నారన్నది ఆసక్తిగా మారింది. తర్వాత అంటే 11వ తేదీన కేసీఆర్ కమిషన్ ముందు హాజరవబోతున్నారు. తాజా విచారణలో కాళేశ్వరం ప్రాజెక్టు బాధ్యతంతా కేసీఆర్, హరీష్ ది మాత్రమే అని తేల్చి చెప్పిన నేపధ్యంలో కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ ఏ విధంగా జరగబోతుంది ? దానికి వీళ్ళ స్పందన ఏమిటన్నది ఉత్కంఠగా మారింది.