ఈసారి కాళోజీ పురస్కారం గ్రహీత నలిమెల భాస్కర్

ప్రముఖ సాహితీవేత్త, కవి, రచయిత, నలిమెల భాస్కర్ కి 'కాళోజీ నారాయణరావు 2024' పురస్కారం దక్కనుంది.

Update: 2024-09-07 14:32 GMT

ప్రముఖ సాహితీవేత్త, కవి, రచయిత, నలిమెల భాస్కర్ కి 'కాళోజీ నారాయణరావు 2024' పురస్కారం దక్కనుంది. ప్రముఖ కవి అందెశ్రీ కమిటీ సిఫారసు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుకు నలిమెల ను ఎంపిక చేసింది. ఈ నెల 9న కాళోజి జయంతి సందర్భంగా పురస్కార ప్రదాన కార్యక్రమం జరగనుంది. కాగా, నలిమెల 1956 ఏప్రిల్1న రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం, నారాయణపూర్ లో జన్మించారు. 2013 సంవత్సరానికి గాను అనువాద సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును దక్కించుకున్నారు. మలయాళ రచయిత పుణత్తిల్ కుంజబ్దుల్లా రచించిన 'స్మారక శశిగల్. నవలను నలిమెల భాస్కర్ స్మారక శిలలు పేరుతో తెలుగులోకి అనువదించారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకున్నారు. తాజాగా ఆయనను కాళోజీ అవార్డు వరించింది.

కాళోజీ జయంతి సందర్భంగా పురస్కారం...

2015 నుంచి ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరిట 'కాళోజీ నారాయణరావు అవార్డు' ను తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ పురస్కారాన్ని కాళోజి నారాయణరావు జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 9న అర్హులైన వారికి ఇస్తున్నారు. తెలంగాణ భాషకు, సంస్కృతికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన జయంతి రోజును 'తెలంగాణ భాషా దినోత్సవం' గా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. కాళోజీ పురస్కారం కింద అవార్డు, మొమెంటో, రూ.1,01,116 నగదు బహుమతిని అందిస్తారు. ఈ ఏడాది కూడా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అవార్డుల కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది.

సాహితీవేత్త ఎంపిక కోసం కమిటీ..

ప్రతిష్టాత్మక ‘కాళోజీ నారాయణరావు అవార్డు’కు అర్హులైన సాహితీవేత్తను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ప్రముఖ కవి అందెశ్రీ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో కవులు, రచయితలైన ఏనుగు నర్సింహారెడ్డి, సంగనభట్ల నర్సయ్య, పొట్లపల్లి శ్రీనివాస్, మెంబర్ కన్వీనర్ మామిడి హరికృష్ణ సభ్యులుగా ఉన్నారు. కాళోజీ అవార్డుకు దాదాపు 40 మంది సాహితీవేత్తలు దరఖాస్తు చేసుకోగా... సాహితీవేత్త ఎంపికపై కమిటీలోని సభ్యులు పలు చర్చల అనంతరం నలిమెల భాస్కర్ ని ఎంపిక చేసి ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.

గతేడాది ఈ అవార్డు ఎవరికి ఇచ్చారంటే...

గతేడాది ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు, జయరాజ్ కు ఈ అవార్డును ప్రకటించింది ప్రభుత్వం. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ కాళోజీ అవార్డును అందించింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసుల మేరకు అప్పటి సీఎం కేసీఆర్ కవి జయరాజ్ ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. 

Tags:    

Similar News