వర్షాల కోసం కరీంనగర్ లో కప్పల పెళ్లి

బరాత్ తీసి ఆటపాట;

Update: 2025-06-20 13:41 GMT

తెలంగాణ కరీంనగర్ జిల్లాలో కప్పలకు పెళ్లి చేశారు. వానలు సమృద్దిగా కురవాలని కరీంనగర్ హుజురాబాద్ లో పెద్ద పాపాయ్య పల్లి గ్రామంలో శుక్రవారం ఈ వేడుక జరిగింది.

ఈ సారి నైరుతి రుతుపవనాలు వారం రోజుల ముందే రావడంతో రైతులు వ్యవసాయ పనులకు సిద్దమయ్యారు. జిల్లాలో వర్షపాతం నమోదుకాకపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు. మృగశిర కార్తె నాటి నుంచి వర్షాలు కురుస్తాయని రైతులు భావించారు. కాని వర్కవుట్ కాలేదు. గ్రామస్థులు ఉదయం తొమ్మిదిన్నరకు శ్రీ రామ లింగేశ్వర స్వామి ఆలయంలో సమావేశమయ్యారు. పొడవాటి కర్రకు రెండు కప్పలను కట్టి వివాహం చేశారు. వర్షాల కోసం దేవుడిని ప్రార్థించారు. పూజారి కప్పలకు పసుపు రాశారు. దాదాపు ఐదు గంటల పాటు పెళ్లి తంతు జరిగింది. గ్రామంలోని ప్రతీ ఇంటి ముందు కప్పల బరాత్ ను ఊరేగించారు. తమ ఇంటి ముందు వచ్చిన కప్పలకు గ్రామస్థులు నీళ్లతో సాక పెట్టారు. సాక అంటే కప్పలకు నైవేద్యం పెట్టినట్టుగా తెలంగాణలో భావిస్తారు. కప్పలపై నీళ్లు చల్లి పెళ్లి బరాత్ తీసారు.

వర్షాలు ఆలస్యమైతే

వర్షాలు ఆలస్యమైతే మేము కప్పల పెళ్లి చేస్తామని గ్రామస్థులు తెలిపారు. రుతుపవనాలు ప్రారంభం కాగానే సమృద్దిగా వర్షాలు కురిస్తే కప్పల పెళ్లి చేయమని వారు అన్నారు. వర్షాలు కురవనప్పుడే మాత్రమే చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోందని గ్రామ సర్పంచ్ బోరెడ్డి రజిత ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

పెద్ద పాపయ్య పల్లి గ్రామంలో 1100 ఇళ్లు ఉన్నాయి. గ్రామస్థుల నుంచి విరాళాలు సేకరించి ఈ వివాహం జరిపించినట్టు రజిత చెప్పారు. గ్రామస్థులు తమ ఆర్థిక స్థితిని బట్టి విరాళాలు ఇస్తారు. ఎవరినీ బలవంతంగా విరాళాలు సేకరించరు.

Tags:    

Similar News