‘బనకచర్లకు రేవంత్ ఓకే చెప్పారు’

తెలంగాణకు 1500 టీఎంసీల నీళ్లు మాత్రమే ఇవ్వమని అడగడానికి రేవంత్ ఎవరంటూ హరీష్ రావు సీరియస్;

Update: 2025-06-19 13:39 GMT

రేవంత్ రెడ్డికి బ్యాగ్‌లకు గురించి తెలిసినంతగా బేసిన్‌ల గురించి తెలియదంటూ మాజీ మంత్రి హరీష్ రావు చురకలంటించారు. దేవాదుల.. గోదావరిపైనే ఉందా? అని సీఎం హోదాలో వ్యక్తి అడగడం హాస్యాస్పదమని చురకలంటించారు. తెలంగాణకు, రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు రేవంత్ చేసిన ద్రోహానికి అతనిని ఉరి తీసినా తప్పులేందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. బనకచర్ల ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంపై హరీష్ రావు ఘాటు వ్యాక్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పాల్పడుతున్న జలదోపిడీని అడ్డుకోండి అని అడిగితే.. అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకోవడం ఏంటని రేవంత్‌ని నిలదీశారు. అసలు నీటిపారుదల శాఖ గురించి రేవంత్‌కు కనీస జ్ఞానమైనా ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణకు 1500 టీఎంసీల నీళ్లు ఇచ్చేలా చూడాలని కేంద్ర మంత్రిని కోరడానికి అసలు రేవంత్ ఎవరు? అయి మండిపడ్డారు. ‘‘గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీల వాటా ఉంది. కృష్ణాలో 763 టీఎంసీల కోసం పోరాడుతున్నాం. అలాంటిది రెండూ కలిసి 1500 టీఎంసీల నీళ్లు చాలని అనడం.. సీఎం మందబుద్దికి నిదర్శనం’’ అంటూ చురకలంటించారు. తెలియనప్పుడు తెలీనట్టు ఉండాలే తప్పా.. అన్నీ తెలిసినంటూ గీర్వానాలు పోయి అబద్ధాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేయకూడదని హితవు పలికారు హరీష్ రావు.

అలనాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకు మేలు జరిగేలా ప్రాజెక్ట్‌లు రూపొందించాలని కేసీఆర్ చెప్పారని, అలాంటిది ఇప్పుడు సీఎం మాత్రం ఆంధ్రకు మేలు జరిగేలా చూస్తున్నారని విమర్శించారు. నదుల అనుసంధానం విషయంలో తెలంగాణను సంప్రదించకుండా ముందుకెళ్లద్దని తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్ అయితే.. తెలంగాణ నీటి హక్కును కాలరాస్తూ 1500 టీఎంసీల నీరు చాలని చెప్పే సీఎం రేవంత్ అంటూ చురకలంటించారు. గోదావరి జలాలను సాగర్ నుంచి శ్రీశైలం తీసుకురావాలని ఆనాటి ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్ చెప్పారని, కానీ ఆ వ్యాఖ్యలను ఇప్పటి నేతలు రాజకీయ లబ్ధి కోసం వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగర్, శ్రీశైలం ద్వారా నదుల అనుసంధానం జరిగితే తెలంగాణకు మేలు జరుగుతుందని కేసీఆర్ భావించారని, కానీ అందుకు జగన్ అంగీకరించకపోవడంతో ఆ ప్రతిపాదన అక్కడే ఆగిపోయిందని హరీష్ రావు గుర్తు చేశారు.

తెలంగాణ నీటి హక్కుల విషయంలో రేవంత్ రెడ్డిది పూర్తి బాధ్యతారహిత్యమేనన్నారు హరీష్ రావు. ‘‘మేము రేవంత్ లెక్క అడ్డదారిలో రాలేదు. ఉద్యమం నుంచి వచ్చాం. ఏపీ బనకచర్ల ప్రాజెక్ట్‌కు రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అఖిలపక్ష సమావేశం నిర్వమించింది బనకచర్ల ఆపడానికా? కట్టుకోమని చెప్పడానికా? నల్లమల ఏ జిల్లాలో ఉందో కూడా రేవంత్‌కు తెలీదు. గోదావరి, కృష్ణా బేసిన్‌ల మీద బేసిక్ నాలెడ్జ్ కూడా రేవంత్‌రెడ్డికి లేదు. బనకచర్ల ఏ బేసిన్‌లో ఉందని సీఎం హోదాలోని రేవంత్.. అధికారులను అడగడం సిగ్గుచేటు. ఉద్యమం చేయలేదు కాబట్టే రేవంత్‌కు నీటి విలువ తెలియదు. పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా ఆరు మంత్రి పదవులకు రాజీనామా చేసిన చరిత్ర మాది. జగన్‌తో కేసీఆర్ మాట్లాడిన మాటలను రేవంత్ అండ్ కో వక్రీకరించారు. సముద్రంలో కలుస్తున్న 3వేల టీఎంసీల నీటిలో తెలంగాణకు 1950 టీఎంసీల నీరు కావాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. సముద్రంలో కలిసే నీటిని ఏపీ తీసుకోవాలని కేసీఆర్ ఎప్పుడూ.. ఎక్కడా అనలేదు’’ అని హరీష్ చెప్పారు.

Tags:    

Similar News